breaking news
Canal construction works
-
వాళ్లు చెయ్యరు.. ఇతరుల్ని చెయ్యనివ్వరు..!
జైపూర్: రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ) ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈఆర్సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్సే కారణన్నారు. చంబల్ నదీ పరివాహక ప్రాంతం నుంచి రాజస్తాన్లోని 13 జిల్లాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘నీటి వివాదాలకు పరిష్కారం వెదకాలని కాంగ్రెస్ ఏనాడూ భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళుతోంది. కానీ, మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది’అని ఆయన అన్నారు. రాజస్తాన్లోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జైపూర్లో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ.46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్ సీఎంగా ఉండగా నర్మదా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేలా పలు ప్రాజెక్టులను తలపెడితే కాంగ్రెస్, కొన్ని ఎన్జీవోలు వాటిని అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాయన్నారు. -
స్వప్నం సాకారం దిశగా..
రైతుల చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. చాలాకాలంగా సాగునీరు వృథాగా పోతున్నా రైతులు చేసేది లేక మిన్నకుండిపోయారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతరం ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెక్డ్యామ్ ఆవశ్యకతను గుర్తించింది. రూ.3.96 కోట్ల నిధులను మంజూరు చేసింది. తడ : మండలంలోని మాంబట్టు పంచాయతీ, ఎన్ఎంకండ్రిగ గ్రామానికి ఎగువన చిత్తూరు జిల్లా పరిధిలోని చెంచురామశెట్టి కండ్రిగ వద్ద పాములకాలువకు అడ్డుగా చెక్డ్యామ్ను పటిష్ట పరచడం ద్వారా పలు చెరువులకు నీరు పుష్కలంగా చేరుతుంది. కాళంగి గ్రాయిన్, నెర్రికాలువ కెనాల్ సిస్టం అభివృద్ధి, పాములకాలువ నెల్లూరు జిల్లా ప్రారంభ ప్రాంతంలో ఆనకట్ట కట్టడం వంటి పనుల ద్వారా తడ ఉత్తర ప్రాంతంలోని అనేక పంచాయతీలతోపాటు సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల పరిధిలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. కాలువ పొడవునా కాంక్రీట్తో కట్ట బలోపేతంతో నీరు వృథా పోకుండా వేగంగా చెరువులకు చేరి నీటి ఇబ్బంది లేకుండా వేలాది ఎకరాల్లో పంటసాగు చేసుకోవచ్చు. చెరువులకు సాగునీరు ♦ చెక్డ్యామ్ వల్ల ఎన్ఎం కండ్రిగ, మాంబట్టు, వెండ్లూరుపాడు, కాదలూరు పెద్ద, చిన్న చెరువులకు పుష్కలంగా నీరు చేరుతుంది. ♦ కాదలూరు చెరువులో నీరు లేక వృథాగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ (ఎస్ఎస్ ట్యాంక్)కి నీరు చేరి తడ మండలంలోని అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందుతుంది. ♦ ఐదు చెరువుల కింద మొత్తం 3,235 ఎకరాలకు (ఆయకట్టు 1,649 ఎకరాలు, డైరెక్ట్గా మరో 1,586 ఎకరాలకు) సాగునీరు అందుతుంది. ఎమ్మెల్యే సంజీవయ్య చొరవతో.. ♦ ఎమ్మెల్యే సంజీవయ్య గత టీడీపీ పాలనలో చెక్డ్యామ్ ఆవశ్యకతపై అనేక పర్యాయాలు అధికారులను కలిశారు. అయితే అప్పటి అధికార టీడీపీ స్పందించలేదు. ♦ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్యాదవ్కు చెక్డ్యామ్ ప్రయోజనాలను వివరించారు. ♦ మంత్రి అనిల్ వెంటనే రూ.3.96 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ♦ మంజూరైన నిధుల్లో రూ.కోటితో చెక్డ్యామ్ నిర్మాణం, మిగిలిన నిధులతో 4.4 కిలోమీటర్ల పొడవున మెయిన్కెనాల్ సప్లై చానల్కి లైనింగ్ పనులు, బ్రిడ్జిలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ♦ అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు మంజూరయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ♦ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనుమతులు వచ్చాయి చెక్డ్యామ్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సర్వే పనులు పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనలు చేస్తున్నారు. ఆ మేరకు తడ ఉత్తర భాగంలో మిగిలిపోయిన కొండూరు, గ్రద్ధగుంట, చేనిగుంట, అండగుండాల పంచాయతీల్లోని చెరువులకు కూడా సాగునీరు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తడ దక్షిణ భాగంలో సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. – సతీష్బాబు, ఇరిగేషన్ డీఈ, సూళ్లూరుపేట -
బాంబుల మోత : గ్రామస్తుల ఆందోళన
అవుకు (కర్నూలు) : కాల్వ నిర్మించేందుకు బాంబులు ఉపయోగించడంతో వాటి ధాటికి సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో భాగంగా మంగళవారం బాంబులతో పనులు చేస్తున్నారు. కాగా బాంబుల మోతతోపాటు పేలుడు సంభవించినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు గ్రామంలోకి ఎగిరిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ రాయి తగులుతుందోనని గ్రామస్తులు ఆందోళన ఉన్నారు.