breaking news
buildengs
-
అద్దె భవనాల్లో ఆసుపత్రులు
50 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఆయుర్వేదం పక్కాభవనం నిర్మించాలని కోరుతున్న ప్రజలు పట్టించుకోని పాలకులు శంకరపట్నం: గ్రామీణ ప్రాంత ప్రజారోగ్యం పడకేసింది. పంటపొలాల సస్యరక్షణ కోసం పలు రకాల పనులు చేపడుతున్న క్రమంలో రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించి వారికి చికిత్స అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వయస్సు పైబడిన వారు బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు లక్షల్లో నిధులు కేటాయిస్తూ వారికి వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు అల్లోపతి, ఆయుర్వేదం, యునానీ ఆస్పత్రులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రులన్నీ ప్రారంభం నాటినుంచి అద్దె ఇళ్లల్లోనే కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించినప్పటికీ ఆయుర్వేదం వవైద్యశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మొలంగూర్ గ్రామంలో 50 ఏళ్లుగా ఆయుర్వేద ఆసుపత్రి అద్దె ఇంట్లో కొనసాగుతోంది. ప్రారంభం మెుదట్లో ఈ ఆసుపత్రి కొన్నేళ్లు ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. అనంతర అక్కడి సమస్యల కారణంగా అద్దె ఇంట్లోకి మారింది. దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రోగులకు చాలా మంది శాశ్వత చికిత్స కోసం ఈ ఆయుర్వేద ఆసుపత్రికి వస్తున్నారు. మండలంలోని 20 గ్రామాల ప్రజలు తరుచుగా ఇక్కడ వైద్య సేవలు పొందేందుకు వస్తున్నారు. అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆసుపత్రిని శంకరపట్నం మండల కేంద్రానికి తరలించాలని గతంలో కొంత మంది ప్రజాప్రతినిధులు కోరినప్పటికీ మొలంగూర్ ప్రజలు అభ్యంతరం మేరకు ఇక్కడే కొనసాగుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇప్పటికీ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. పలు వ్యాధులకు చికిత్స.. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మొలంగూర్ ఆయుర్వేద ఆస్పత్రిలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే గ్రామసందర్శనలో భాగంగా చాలా మంది రోగులు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ ఉచితంగా మందులు తీసుకుంటున్నారు. వినతులకే పరిమితం.. జెడ్పీటీసీ సభ్యుడు సొంత గ్రామంలో ఆయుర్వేదవైద్యశాల భవనానికి నిధులు మంజూరు చేయాలని పలు మార్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు వైద్యాధికారిణి వినతిపత్రాలు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకూ ప్రతి మండల సర్వసభ్య సమావేశాల్లో ఆయూర్వేద ఆసుపత్రికి పక్కా భవనం నిర్మించాలని వైద్యురాలు విన్నవిస్తునే ఉన్నారు. జిల్లాల విభజన జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న నిధుల నుంచి ఆయుర్వేద ఆస్పత్రికి నిధులు విడుదల చేయాలని వైద్యులు, సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. -
అద్దె భవనాలు.. అరకొర వసతులు
మరుగుదొడ్లు, నీటి సదుపాయం కరువు ఇదీ అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి పట్టించుకోని అధికారులు ఇల్లంతకుంట: మూడు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులలో చదువుపై ఆసక్తిని పెంపొందించే ఉద్ధేశంతో పాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. మండలంలో 66 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 30 సొంత భవనాలుండగా 36 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ అస్తవ్యస్థంగా మారింది. కొన్ని గ్రామాల్లో పురాతన ఇళ్లలో కేంద్రాలు కొనసాగిస్తుండటంతో చిన్నపాటి వర్షం కురిసినా సమస్యలు తలెత్తుతున్నాయి. అనంతగిరి గ్రామంలోని ఓ అంగన్వాడీ కేంద్రం పాత ఇంటిలో నిర్వహిస్తున్నారు. భారీ వర్షం కురిస్తే ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు ప్రతి రోజు భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. అద్దె భవనాల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని వారు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. నీటి సదుపాయం.. మరుగుదొడ్లు కరువు.. మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు భోజనం వండి పెట్టాలని చెప్పడంతో ఏడాదిన్నర కాలంగా అంగన్వాడీ కేంద్రాల్లో వంట చేసేందుకు ఆయాలు, కార్యకర్తలు మరో చోటు నుంచి నీళ్లు తీసుకొచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.