-
అల్లుడిదే కాదు.. ఆవేదన అందరిదీ!
హైదరాబాద్కు చెందిన శ్యాంప్రసాద్ అనే యువకుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన యువతిని వివాహమాడాడు. నేలకొండపల్లిలో ఘన చరిత్రగల బౌద్ధ స్తూపం ఉందని తెలుసుకొని ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. అయితే స్తూపాన్ని, అక్కడి పరిసరాల పరిస్థితిని చూసి తీవ్ర నిరాశ చెందాడు. తన ఆవేదనను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లగా ఆయన జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు రీట్వీట్ చేశారు. అయితే ఈ ఆవేదన నేలకొండపల్లి అల్లుడిది మాత్రమే కాదని ‘సాక్షి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. సాక్షి, ఖమ్మం డెస్క్: దక్షిణాదిలోకెల్లా అతిపెద్ద బౌద్ధక్షేత్రం.. సుమారు 106 అడుగులు వ్యాసార్థం, 60 అడుగుల ఎత్తు.. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందినదిగా ఘనత.. 46 ఏళ్ల క్రితం తవ్వకాల్లో గుర్తింపు.. ఇటువంటి ప్రత్యేకతలున్న ఆ క్షేత్రాన్ని కుటుంబంతో సహా కలసి వెళ్లి చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోరిక నెరవేరాలంటే మీరు ఎంతో కష్టపడాల్సిందే.. ఎందుకంటారా? ఆ స్తూపం వద్దకు వెళ్లేందుకు కనీస రవాణా సౌకర్యం లేకపోగా ఎలాగోలా వెళ్లినా తాగడానికి నీళ్లు, కూర్చోవడానికి నీడ లేక అల్లాడాల్సిందే..! ఖమ్మం జిల్లా కేంద్రానికి 24 కి.మీ. దూరంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో నేలకొండపల్లి–ముజ్జుగూడెం గ్రామాల మధ్యన ఈశాన్య దిక్కున ఉన్న బౌద్ధక్షేత్రం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నాలుగు బెంచీలు తప్ప తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటివేవీ కనిపించవు. ప్రధాన ద్వారం వద్ద స్థూపం వివరాలతో కూడిన బోర్డు ఉన్నా దానిపై అక్షరాలు చెరిగిపోయి అది కూడా చెదిరిపోయిన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక అడుగు ముందుకు పడినా... నేలకొండపల్లి సమీపంలోని బౌద్ధస్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ. 1.26 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కంచె, పార్కు ఏర్పాటు చేశారు. అలాగే పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షలతో స్తూపం అభివృద్ధి చేపట్టారు. అసలైన బౌద్ధ స్థూపం చాలా ఎత్తుగా ఉండటంతో బౌద్ధ స్థూపాన్ని పోలిన మినీ స్తూపంతోపాటు చిన్న పార్కును, అందులో పిల్లలను ఆకర్షించేందుకు జంతువుల సిమెంట్ బొమ్మలను ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో పార్కులో మొక్కలు పోయి పిచ్చిచెట్లు పెరిగి ఆ పరిసరాలు చిట్టడివిని తలపిస్తున్నాయి. కేటీఆర్కు శ్యాంప్రసాద్ చేసిన ట్వీట్ బోటింగ్ ఏదీ? బౌద్ధక్షేత్రాన్ని ఆనుకొని ఉన్న బాలసముద్రం చెరువులో పర్యాటకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క చర్య కూడా అధికారులు చేపట్టలేదు. బౌద్ధస్తూపం.. మరికొన్ని సంగతులు ►బౌద్ధస్తూపం ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం స్థానికులు ఎర్రదిబ్బగా పిలిచేవారు. ►క్రీస్తుశకం రెండో శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో ఈ ప్రాంతాన్ని నెల్సిండా అని పేర్కొన్నట్లు చెబుతారు. ఆ ప్రాంతమే వ్యవహారంలో నేలకొండపల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ►నేలకొండపల్లి పరిసరాల్లో క్రీ.శ. 6వ శతాబ్దం వరకు బౌద్ధం విరాజిల్లినట్లు భావిస్తున్నారు. ►1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా, రెండో దఫా 1984లో చేపట్టిన తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్ముయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణాలు, పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ మ్యూజియాల్లో భద్రపరిచారు. -
బాదన్కుర్తి.. బుద్ధుడి ధాత్రి!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక రాజ్యం.. ఆ రాజ్యంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న ఓ జనావాసం.. అది తెలంగాణలోనే ఉంది. అక్కడికి చేరువలో నది మధ్యలో చిన్న దీవి.. ఆ దీవిలో ఉందీ ఓ అద్భుతమైన బౌద్ధ స్థూపం.. ఇటీవలే జరిపిన తవ్వకాల్లో ఈ స్థూపం బయల్పడింది. ఇది తెలంగాణలో బయటపడ్డ అతి పురాతన స్తూపంగా చరిత్రకారులు భావిస్తున్నారు. బావరి గ్రామానికి సమీపంలో.. క్రీ.పూ.1 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. విశేషమేంటంటే బుద్ధుడిని స్వయంగా కలసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించిన బావరి అనే వ్యక్తి నివసించిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్తూపం ఉంది. అంటే బుద్ధుడు సజీవంగా ఉన్నప్పుడు ఆయన బోధనలను ప్రచారం చేసిన వారి తాలూకు వ్యక్తులే వీటిని నిర్మించారని తెలుస్తోంది. గోదావరి నది మధ్యలో చిన్న దీవిలో ఉన్న ఈ స్తూపంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర బౌద్ధ నిర్మాణాలను వెలుగులోకి తెస్తే ఇది పెద్ద పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన.. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే సుత్త నిపత గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి దీని గురించి తెలియకపోవటంతో బౌద్ధ పర్యాటకులు ఇక్కడికి రావట్లేదు. నిర్మాణాలు వెలుగు చూసి, వాటి ప్రాధాన్యంపై ప్రచారం చేస్తే దేశవిదేశీ బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సుత్త నిపత గ్రంథంలోని పారాయణ వగ్గ చాప్టర్లో తెలంగాణ ప్రాంతం ప్రస్తావన ఉందని గతంలోనే నిపుణులు గుర్తించారు. ‘అస్మక రాజ్యంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుడిని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించారు’అని అందులో లిఖితపూర్వకంగా ఉంది. అస్మక పరిధిలో తెలంగాణ ఉండటంతో ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో జనావాసం ఎక్కడుందా అని నిపుణులు శోధించి.. అది ఖానాపూర్ మండలంలోని బాదన్కుర్తి గ్రామంగా గుర్తించారు. ఆ గ్రామం నది చీలికలో ఉంటుంది. అక్కడ ప్రాథమికంగా తవ్వకాలు జరిపి బౌద్ధ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. కానీ వాటిపై ఓ దేవాలయం సహా వేరే నిర్మాణాలు రావటంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా దానికి చేరువలో అతి పురాతన బుద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలను గుర్తించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశంతో బుద్ధవనం అధికారి శ్యాంసుందర్, పుణేలోని డెక్కన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్, ఔత్సాహిక చరిత్రకారులు జితేంద్రబాబు, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు ఇటీవల పర్యటించి వాటిని గుర్తించారు. ►బాదన్కుర్తి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో బావాపూర్ సమీపంలో గోదావరి మధ్యలో రెండు చిన్న దీవులున్నాయి. వాటిల్లో దాదాపు 57 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఒక దీవిని పరిశీలించగా ఇవి వెలుగు చూశాయి. ►దాదాపు 17 అడుగుల ఎత్తున మట్టి దిబ్బను పరిశీలించగా అది బౌద్ధ స్తూపమని తేలింది. ►3 అంచెలుగా ఈ స్తూపం నిర్మితమైంది. ►ఇందులో దిగువ ఉన్న చివరి అంచె రాతి కట్టడంగా ఉండగా, పై 2 అంచెలు పెద్ద ఇటుకలతో నిర్మితమై ఉన్నాయి. చివరి వరుస వ్యాసం 40 చదరపు అడుగులు ఉంది. ►దీనికి చేరువలో 20 అడుగుల వ్యాసంతో మరో రెండు స్తూపాలున్నాయి. ఇలా ఒకేచోట 3 స్తూపాలుండటం, పెద్ద స్తూపం మూడు అంచెలుగా ఉండటం అరుదని నిపుణులంటున్నారు. గుప్త నిధుల కోసం కొందరు ఆ మూడు స్తూపాల మధ్య తవ్వటంతో అవి కొంతమేర దెబ్బతిన్నాయి. ఎంతగానోఆకట్టుకుంటుంది చాలా పురాతనమైన స్తూపాలుండటం, బుద్ధుడి బోధనలు స్వయంగా విని బౌద్ధాన్ని ప్రచారం చేసిన బావరి నివసించిన ప్రాంతం కావటం, గోదావరి నది మధ్యలో ఉండటంతో ఇది పర్యాటకంగా బాగా అభవృద్ధి చెందే ప్రాంతం. అందుకే అక్కడ వెంటనే తవ్వకాలు జరిపి నిర్మాణాలను వెలుగులోకి తేవాలని హెరిటేజ్ తెలంగాణ శాఖను కోరాం. సమీపంలోనే కడెం రిజర్వాయర్, దట్టమైన అడవి, గోదావరి నది.. పర్యాటక ప్రాంతంగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయంలో ప్రతిపాదనలు రూపొందిస్తాం –మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి -
ఈ గోడ... చరిత్రకు జాడ!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండడుగుల పొడవున్న భారీ ఇటుకలు.. గోడ తరహాలో వరుసగా పేర్చిన నిర్మాణం.. వృత్తాకారంలో ఉందన్నట్లు వంపు తిరిగిన ఆకృతి.. తాజాగా బయటపడ్డ ఓ గోడ ఆకృతి ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శాతవాహనుల కాలం నాటి కట్టడంగా భావిస్తున్న ఈ గోడ బౌద్ధ నిర్మాణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా బౌద్ధ స్తూపాలు వృత్తాకారంలో ఉంటాయి. చైత్యాలు ఆంగ్ల అక్షరమాలలోని ‘యు’ఆకృతిలో ఉంటాయి. తాజాగా వెలుగుచూసిన కట్టడం ప్రాథమిక ఆనవాళ్లు వంపు తిరిగి ఉండటంతో స్తూపమో, చైత్యమో అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కట్టడం పుట్టు పూర్వోత్తరాలు తేల్చేందుకు పురావస్తుశాఖ నడుం బిగించింది. బుధవారం ఉదయం పురావస్తు శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి నిగ్గు తేల్చనున్నారు. జనగామకు చేరువలో.. భువనగిరి–జనగామ మధ్యలోని పెంబర్తికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎల్లంల గ్రామ శివారులో ఈ నిర్మాణం వెలుగు చూసింది. చాలాకాలంగా ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఐదు రోజుల కింద కూలీలు ఇసుక తవ్వుతుండగా రెండుమీటర్ల లోతులో ఇటుక నిర్మాణం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఉపాధ్యాయుడు రత్నాకర్రెడ్డి వెళ్లి పరిశీలించి అది పురాతన కట్టడంగా భావించారు. రెండు అడుగులకు కాస్త తక్కువ పొడవుతో ఉన్న ఇటుకలు కావటంతో అవి శాతవాహన కాలానికి చెందినవే అయి ఉంటా యని భావించి విషయాన్ని పురావస్తు శాఖ దృష్టికి తెచ్చారు. పురావస్తుశాఖ డైరెక్టర్ విశా లాచ్చి వెంటనే స్పందించారు. వాటిని పరిశీలించాల్సిందిగా అధికారి భానుమూర్తిని ఆదేశించడంతో ఆయన స్థానిక సిబ్బందితో కలసి బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. పర్యాటకానికి ఊతం.. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలు, చైత్యాలు వెలుగు చూశాయి. ఫణిగిరి, ధూళికట్ట, నేలకొండపల్లి, కోటలింగాలలో బౌద్ధ నిర్మాణాల జాడలు బయటపడ్డాయి. బుద్ధుడి బోధనలు వినేందుకు వెళ్లి వచ్చిన బావరి నివసించిన ప్రాంతం కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఇక్కడి నుంచే బౌద్ధ మత ప్రచారం ప్రారంభమై చైనా వంటి దేశాలకు పాకిందన్న ఆధారాలు వెలుగుచూడటంతో రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతోంది. నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనంలో తైవాన్లాంటి దేశాల సాయంతో బౌద్ధ విశ్వవిద్యాలయ స్థాపనకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే కేంద్రం బౌద్ధ ప్రాంతాల అభివృద్ధికి నిధులనూ కేటాయించింది. ఈ తరుణంలో జనగామ ప్రాంతంలో వెలుగుచూసిన కట్టడం బౌద్ధ నిర్మాణమైతే మరింత ఊతమొచ్చినట్లు అవుతుంది. -
ఏలూరు శివారులో బౌద్ధ స్థూప స్తంభాలు
శాతవాహనుల కాలం నాటివని అంచనా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లో ఒకప్పుడు బౌద్ధం విలసిల్లిందనేందుకు బలమైన ఆధారాలు మరోసారి వెలుగు చూశాయి. వట్లూరు గ్రామ శివారులో బౌద్ధ స్థూపానికి చెందిన ఆయక స్తంభాలు, శిలామంటప స్తంభాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలానికి చెందినవిగా భావిస్తున్న ఈ స్థూప స్తంభాలు బౌద్ధస్థావరానికి చెందినవై ఉంటాయని భావిస్తున్నారు. ఏలూరు శివారులోని వట్లూరు గ్రామంలో ఇటీవల చెరువుకట్టకు మరమ్మతు చేస్తుండగా ఆరు స్తంభాలు బయటపడ్డాయి. అడుగుభాగంలో అర్ధపద్మం, మధ్యలో పూర్ణపద్మం ఆకృతులు, వాటి చుట్టూ చూడముచ్చటైన నగిషీలు చెక్కి ఉన్నాయి. వీటిని గ్రామస్థులు స్థానిక భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద భద్రపరిచారు. -
బుద్ధం.. శరణం.. చందవరం
రామాలయం, శివాలయం తదితర ఆలయాలు ప్రతి ఊళ్లో కనిపిస్తాయి. కానీ, బౌద్ధారామాలు దేశంలో చాలా తక్కువ. ఆంధ్రరాష్ట్రంలో మరీ తక్కువ. అలాంటి అరుదైన బౌద్ధారామం ఒకటి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలానికి చెందిన ఈ గ్రామం పేరు చందవరం. ఈ గ్రామం గొప్ప బౌద్ధారామంగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు-గుంటూరు రాష్ట్ర రహదారిలో త్రిపురాంతకం మండలం వెల్లంపల్లికి 7 కిలోమీటర్ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన ఈ బౌద్ధారామం అతి ప్రాచీనమైనది. చందవరం ఒంగోలు నుంచి 75 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపైన బౌద్ధారామం... రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఈ బౌద్ధారామాన్ని చందవరం బౌద్ధస్థూపం అని కూడా పిలుస్తుంటారు. 1965లో పురావస్తుశాఖ వారు జరిపిన తవ్వకాల్లో ఈ బౌద్ధ స్థూపం బయటపడింది. ఈ చందవరం స్థూపం క్రీస్తుశకం ఒకటి లేదా రెండు శతాబ్దాల నాటిదని తెలుస్తోంది. ఈ స్థూపం లభ్యమైన తర్వాత నాలుగు సార్లు తవ్వకాలు సాగించారు. ఆ తవ్వకాల్లో 15 పెద్ద స్థూపాలు, వందలాది చిన్న స్థూపాలు దొరికాయి. 1972లో రాష్ట్రపురావస్తుశాఖ ఈ ప్రాంతంలో నాలుగు దఫాలుగా తవ్వకాలు జరిపితే అనేక వందల చిన్నస్థూపాలు, 15 పెద్దస్థూపాలు బయల్పడ్డాయి. ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపం దాదాపు 200 అడుగుల ఎత్తుగల కొండపై ఉంది. ఈ స్థూపం చుట్టుకొలత దాదాపు 120 అడుగులు, 30 అడుగుల ఎత్తులో ఉంది. నాటి విశ్రాంతి మందిరాలు.. బౌద్ధస్థూపం ఉత్తరాన ఉన్న ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ప్రతిష్టించి ఉంది. బౌద్ధుల పగోడాను తలపించే నిర్మాణపు పునాదులు కూడా ఇక్కడ లభించాయి. బౌద్ధ భిక్షులు విశ్రాంతి తీసుకునే మందిరాల పునాదులూ ఈ ప్రాంతంలో ఉన్నాయి. గుండ్లకమ్మ నది పక్కన గల ఎత్తయిన కొండపైన బౌద్ధస్థూపం ఉన్న ప్రాంతాన్ని సింగరాకొండ అని కూడా అంటారు. ఇది రెండంతస్తుల స్థూపం. దక్షిణ భారత దేశంలో ఇలా ఉన్న ఏకైక స్థూపం ఇదే! ఇక్కడ ఒక మ్యూజియం నిర్మాణంలో ఉంది. ఈ కొండ మీద శిల్పాలను ప్రస్తుతం చందవరం మండల కార్యాలయంలో భద్రపరిచారు. బౌద్ధమతం క్రమంగా క్షీణించడంతో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి, అందులోని శిల్పాలు, రాళ్లు, మట్టి మొదలైనవాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయనిర్మాణానికి ఉపయోగించి ఉంటారని నిపుణుల అంచనా! ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఈ అమూల్యమైన చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. సాంచీ స్థూపాన్ని పోలి ఉండే చందవరం బౌద్ధ స్థూపం, గండికోట నది, చందవరం పర్వతంపై ఉన్న మరో స్థూపం ఇక్కడ చూడదగినవి. దూపాడు బౌద్ధ స్థూపం చందవరానికి మూడు మైళ్ల దూరంలో దూపాడు బౌద్ధ స్థూపం ఉంది. ఇది బాగా శిథిలం అయింది. స్థానికంగా దీనిని ద్వీపగడ్డ అని కూడా అంటారు. స్థూపం పైభాగంలో లోతైన రంధ్రం ఉంది. పురావస్తు శాఖ వారి తవ్వకపు గుర్తులు ఉన్నాయి. స్థానికులు దీనిని కోటదిబ్బ అని కూడా అంటారు. ఇదే జిల్లాలో చిన్న గంజాంలో కూడా ఒక బౌద్ధ స్థూపం ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. చందవరం ఇలా చేరుకోవచ్చు... ఒంగోలు నుంచి రోడ్డుమార్గాన చందవరం చేరుకోవచ్చు. దొనకొండ నుండి చందవరం 14 కి.మీ. ఉంటుంది. దొనకొండ నుంచి ప్రైవేట్ వాహన సౌలభ్యమూ ఉంది. - ఎన్.వేదాద్రి, ఎస్.జి.టి టీచర్, తెనాలి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement