BSNL landline phone
-
బాబోయ్...ల్యాండ్ఫోన్!
మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చినా... బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్లకున్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ల్యాండ్లైన్ వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరమ్మతులకు గురైతే వినియోగదారులకు ఇక నరకమే. ఆయా ప్రాంతాల్లోని టెలికం మెకానిక్లు, ఇంజినీర్లకు పదేపదే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ల్యాండ్ ఫోన్లు పాడైతే వినియోగదారుడు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 43,976 ల్యాండ్ఫోన్ కనెక్షన్క్షుడగా వాటిలో సుమారు 25 శాతం వరకు ఫోన్లు సక్రమంగా పని చేయకపోవడం, కేబుల్ సమస్యలు రావడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలాంటి నగరంలో బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రధాన కార్యాలయం, సంస్థ ఉన్నతాధికారులంతా కొలువై ఉన్నప్పటికీ ల్యాండ్ఫోన్ సమస్యలు ఎదురైతే దిక్కుమొక్కూ ఉండడం లేదు. దీంతోపాటు చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి వంటి ముఖ్యమైన పట్టణాల్లో సైతం ల్యాండ్ఫోన్ సమస్యలపై ప్రతి వారం ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వస్తూనే ఉన్నాయి. అయినా గానీ ఫిర్యాదులపై సకాలంలో స్పందించి పరిష్కరించే కిందిస్థాయి జేటీఓ, జేఈ, డీఈల పనితీరు పూర్తిగా పడకేసింది. పరికరం పాడైతే... ఐదు సంవత్సరాల క్రితం వరకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్లు మరమ్మతులకు గురైనా, ఏదైనా సాంకేతిక సమస్యలతో పాడైనా ఫోన్ కిట్(పరికరం) రీప్లేస్ చేసే సౌకర్యాన్ని పూర్తిగా సంస్థ పరి«ధిలోనే నిర్వహించేవారు. అయితే సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఫోన్ పరికరాలు ఉత్పత్తి కావడం లేదన్న ఒకేఒక్క సాకుతో అధికారులు, టెక్నికల్ సిబ్బంది ల్యాండ్ఫోన్ వినియోగదారులకు అవస్థలు సృష్టిస్తున్నారు. సాంకేతిక విభాగం అధికారులు, సిబ్బంది చాలినంతమంది లేరన్న అంశం కూడా ఓ సాకుగా చూపుతున్నారు. దీంతో ల్యాండ్ ఫోన్ పరికరం పాడైతే సంబంధిత సంస్థ టెక్నికల్ సిబ్బంది సూచించే బయట మెకానిక్ల వద్దే రిపేరు చేయించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు మెకానిక్ ఒక్కో ఫోన్కు రూ.250 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. పాడైన ఫోన్ పరికరం బాగు కాకుంటే మాత్రం బీఎస్ఎన్ఎల్ సాంకేతిక విభాగంలో రూ.650 చెల్లిస్తే కొత్త ల్యాండ్ ఫోన్ ఇస్తామంటూ అధికారులు చెబుతుండడాన్ని వినియోగదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రతినెలా సర్వీసు చార్జీల రూపంలో వందలకు వందలు చెల్లిస్తున్నా ల్యాండ్ఫోన్ సమస్యలపై అ«ధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని మండిపడుతున్నారు. పని చేయకున్నా సర్వీస్ బిల్లు ల్యాండ్ ఫోన్లు పనిచేయకున్నా, మరమ్మతులకు గురైనా సంస్థకు చెల్లించాల్సిన సాధారణ సర్వీసు బిల్లులను మాత్రం వినియోగదారుడు భరించక తప్పడం లేదు. ఈ విధంగా సరాసరిన నెలకు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులపై పడుతున్న సర్వీస్ బిల్లుల భారమే సుమారు రూ.5 లక్షలకు పైగా ఉంటోంది. వినియోగదారులు చిరకాలం నుంచి బంధం కొనసాగిస్తున్న ల్యాండ్ఫోన్లను వదులుకోలేక, సాంకేతిక సమస్యలతోనే కొనసాగించుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా సంస్థ టెక్నికల్ సిబ్బంది సహకారం వేలాది మంది వినియోగదారులకు సకాలంలో అందడం లేదు. -
బాక్స్ బద్దలైంది!
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డున చిన్న బజార్ కూడలిలో ల్యాండ్లైన్ ఫోన్ సేవల కోసం సుమారు 32 ఏళ్ల క్రితం బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ పిల్లర్(బాక్స్)ను లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఇలిసిపురం, ఏడు రోడ్ల కూడలి, టౌన్ హాల్ సమీప ప్రాం తాల్లో ఉన్న సుమారు 1500 ఫోన్ కనెక్షన్లకు ప్రధాన అనుసంధాన కేంద్రం గా ఈ జంక్షన్ బాక్స్ సేవలందిస్తోంది. రోడ్డుకు ఓ పక్కన, అదీ మున్సిపల్ స్థలంలోనే ఉన్న బాక్స్ వల్ల ట్రాఫిక్కు గానీ, ఇంకెవరికి గానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం జరుగుతున్న చిన్నబజార్ రోడ్డు విస్తరణ పనులకు సైతం ఇది ఆటంకమని ఉడా, మున్సిపల్ అధికారులు భావించలేదు. ఇది ఉన్న స్థలం మూడు అడుగుల లోపే ఉండటంతో కాలువల నిర్మాణంలోనూ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ దానికి సమీపంలోనే వాణిజ్య సముదాయం ఉన్న ఓ వ్యాపార ప్రముఖుడు మాత్రం అది తనకు అడ్డంగా ఉందని భావించారు. దాన్ని అక్కడి నుంచి తరలించాలని పట్టుబట్టారు. కేంద్ర మంత్రికి అనుచరునిగా ఉన్న సదరు వ్యాపారి దీనిపై బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాడు. అతనికి మంత్రి పీఏగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వత్తాసు పలకడంతో బాక్సును వేరే చోటుకు మార్చడానికి బీఎస్ఎన్ఎల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ స్థలంపైనా అభ్యంతరం బాక్సును అక్కడి నుంచి తొలగించాలని సదరు ప్రముఖుడు ఆరునెలల నుంచి ఒత్తిడి చేస్తుండటంతో గత్యం తరం లేక బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రత్యామ్నయ స్థలం కోసం వెతికారు. అక్కడికి 150 మీటర్ల దూరంలో ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, వస్త్ర వ్యాపారుల సంఘం కల్యాణ మండపం మధ్యలో ఉన్న చిన్న స్థలంలో దాన్ని ఏర్పాటు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు. ఆ మేరకు అక్కడ బీఎస్ఎన్ఎల్ అధికారులు సిమెంట్ దిమ్మ కూడా నిర్మించారు. ఇంతలో అక్కడ బాక్స్ ఏర్పాటు చేయవద్దంటూ మరో వస్త్ర వ్యాపారి ఆ దిమ్మను పడగొట్టించారు. దీంతో అతి కీలకమైన జంక్షన్ బాక్సును ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక బీఎస్ఎన్ఎల్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రూ.12 లక్షల వృథా ఖర్చు కాగా జంక్షన్ బాక్సును మార్చి వేరే చోట పెట్టడానికి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్లు చెబుతున్నారు. దీనికి వినియోగించే కేబుల్ ధర మీటరు రూ. పదివేలకు పైగా ఉంటుంది. ఇక తవ్వకాలు, మెటీరియల్, ఇతరత్రా ఖర్చులు కలిపి సుమారు రూ.12 లక్షలు అవుతుందని అంటున్నారు. ఒక వ్యాపారి ప్రయోజనం కోసం లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులు వినియోగించడం సమంజసం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతగా ఆ వ్యాపారికి అడ్డం అనుకుంటే ఆయన కాంప్లెక్స్లోనే ఓ మూల ఏర్పాటు చేస్తే ఖర్చు బాగా తగ్గుతుంది.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. జీఎం ఆదేశించారు.. మేం చేస్తున్నాం ఈ విషయంపై బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజినీర్ లక్ష్మణరావు వద్ద ‘న్యూస్లైన్’ ప్రస్తావించగా జంక్షన్ బాక్సును వేరొక చోటుకు మార్చాలని జీఎం జారీ చేసిన ఆదేశాలను తాము అమలు చేస్తున్నామన్నారు. మున్సిపల్ అధికారులు చూపించిన ప్రత్యామ్నాయ స్థలంలో సిమెంట్ దిమ్మ నిర్మిస్తే.. దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారన్నారు. దాంతో మరో స్థలం కోసం అన్వేషిస్తున్నామన్నారు. ప్రస్తుత స్థలంలోనే అది ఉన్నా ఎవరికీ ఇబ్బంది లేనప్పటికీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము పనిచేయాలన్నారు. ‘మేడమ్ ఆబ్లిగేషన్.. వింటేనే మంచిది’ ‘సార్.. ఇది మేడమ్ గారి ఆబ్లిగేషన్.. అందుకే నేను చెబుతున్నాను.. వింటేనే మీకు మంచిది’.. అంటూ బీఎస్ఎన్ఎల్ జీఎం మహంతికి కేంద్ర మంత్రి వద్ద పీఏగా ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పరోక్షంగా హెచ్చరించి ఈ పని చేయించారని తెలుస్తోంది. అయితే ఈ విషయం కేంద్రమంత్రి దృష్టిలో ఉందో.. లేదో తెలియదని, ఆమె పీఏ అత్యుత్సాహంతోనే ఇదంతా జరిగిందనే వాదన కూడా విన్పిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన జేబులు బాగానే నిండాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.