విషాదాంతం
పెళ్లికి ముందురోజు అదృశ్యమైన యువకుడు
మూడు రోజుల తర్వాత అనుమానాస్పదస్థితిలో మృతి
రైలుకిందపడి ముక్కలు ముక్కలైన శరీరం
పెళ్లికి ముందే ఆ యువకుడి జీవితం ముక్కలైంది. తాళి కట్టడానికి ఒక రోజు ముందు అదృశ్యమైన యువకుడు మూడు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. పెళ్లి సందడి కనిపించాల్సిన ఇల్లు శోకసంద్రంగా మారింది.
హిందూపురం అర్బన్: మేనకోడలి మెడలో తాళి కట్టాల్సిన యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. హిందూపురం పట్టణ శివారులోని కొటిపి రైల్వేగేటు సమీపాన శరీరం ముక్కలుముక్కలై కనిపించింది. వివరాలిలా ఉన్నాయి. మునిసిపాలిటీ పరిధిలోని పోచనపల్లికి చెందిన పవన్కుమార్ (28) చేనేత కార్మికుడు. ఈ నెల 16న మేనకోడలితో వివాహం కావాల్సి ఉంది. 15వ తేదీ పసుపు పూసే కార్యక్రమం జరగాల్సిఉం ది. అయితే ఆరోజు మధ్యాహ్నం చెప్పులు కొనుక్కోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అంబేడ్కర్ సర్కిల్లోని ఓ చెప్పుల దుకాణం వద్ద ద్విచక్రవాహనాన్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలిసింది. అనంతరం బంధువులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం కొటిపి రైల్వేగేటు సమీపాన రైలుకిందపడి ముక్కలైన మృతదేహం గురించి సమాచారం అందింది. రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహం వద్ద ఏటీఎం కార్డు, తిరుపతి నుంచి వచ్చినట్లు రైలు టికెట్ లభ్యమయ్యాయి. ఏటీఎం కార్డు చిరునామా ఆధారంగా.. మృతదేహం పవన్కుమార్ది అని నిర్ధారించి బంధువులకు సమాచారం అందించారు. పసుపు బట్టల్లో చూడాల్సిన యువకుడిని మాంసపు ముద్దగా చూడాల్సి వచ్చిందంటూ బంధువులు రోదించారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా ఇతన్ని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని బంధువులు వాపోతున్నారు.