breaking news
beechupally pushkara ghat
-
జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం
కృష్ణవేణి ఒడిలో తరించిన భక్తులు ముగిసిన పుష్కర మహోత్సవాలు నదీమతల్లికి సంధ్యాహారతితో వీడ్కోలు పలికిన భక్తులు బీచుపల్లిలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి, అలంపూర్లో కలెక్టర్ పూజలు సోమశిలలో హారతి ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి చివరిరోజూ ఘాట్లకు పోటెత్తిన జనం లక్షలాది మంది పుణ్యస్నానం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. జిల్లాలో 12రోజులపాటు అత్యంత వైభవంగా సాగాయి. పండితుల వేదమంత్రాల మధ్య మళ్లొస్తాం అంటూ మంగళవారం కృష్ణవేణికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణ పుష్కరాలు జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈనెల 12వ తేదీన అలంపూర్లోని గొందిమళ్లలో ఉదయం 5.58 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ అనురాగ్శర్మ, జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్, అడిషన్ డీజీ అంజనికుమార్, డీఐజీ అకున్ సబర్వాల్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తదితరులు అలంపూర్లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పంచదేవ్పహాడ్, మరుముల, గుమ్మడం, మూనగాన్దిన్నె, కృష్ణ, పాతాళగంగ వంటి పుష్కరఘాట్లలో లక్షలాదిగా భక్తులు చివరిరోజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అనేక మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. 12వ తేదీనుంచి 23వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఘాట్లలో 1,84,94,164 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల పూజలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రంగాపూర్ ఘాట్లో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్ బీచుపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. రంగాపూర్ ఘాట్లో సినీ నిర్మాత రామ యాదిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఛైర్మన్ బండారు భాస్కర్, కలెక్టర్ టికె.శ్రీదేవి రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లను సందర్శించారు. గొందిమళ్లలో సీఎం పుష్కరాలను ప్రారంభించిన ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పుష్కరాలను ముగింపు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలను క్షేమంగా చూడాలంటూ పండితులు వేద ఆశీర్వాదం చేశారు. బీచుపల్లిలో జరిగిన పుష్కరాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక గంగ హారతి ఇచ్చారు. 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మంత్రులు అభినందనలు తెలిపారు. సోమశిలలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం అభినందించారు జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, 48 శాఖల ఉద్యోగ, సిబ్బంది సహాయ సహాయ సహకారాలతో పుష్కరాలు జయప్రదం అయ్యాయి.’’ – కలెక్టర్ టీకే శ్రీదేవి -
ఉప్పొంగిన జన కృష్ణమ్మ
పుష్కర మహోత్సవ వేళ పాలమూరు కృష్ణాతీరం జనసంద్రాన్ని తలపించింది. సెలవు రోజుల్లో జనం రద్దీ అనూహ్యంగా పెరిగింది. విశిష్ట స్థల పురాణం ఉన్న ఘాట్లకు భక్తులు పోటెత్తారు. 12రోజుల పాటు జోగుళాంబ(గొందిమల్ల), సోమశిల, బీచుపల్లి, రంగాపూర్ ప్రధాన ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి. వీటితో పాటు నదీ అగ్రహారం, పసుపుల, కృష్ణ, పాతాళగంగ ఘాట్లు కూడా కిటకిటలాడాయి. జోగుళాంబలో 20 లక్షలు జోగుళాంబఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలు ప్రారంభోత్సవానికి అలంపూర్ సమీపంలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్ వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభించారు. గవర్నర్, మండలి చైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి అధికారులు, నాయకులు, సినీ స్టార్లు ఇక్కడే పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల 12రోజులపాటు దాదాపు 20 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు కలకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, విద్యుత్ శాలు విధులు సమర్థవంతంగా నిర్వహించి, సదుపాయాలు కల్పించారు. 12 రోజులపాటు ప్రశాంత వాతావరణంలో పుష్కరాలు నిర్వహించడంలో అధికారులు సఫలమయ్యారు. సోమశిలలో 27.81లక్షలు సోమశిల పుష్కరఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల ఘాట్లో మొత్తం 27.81లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 12వ తేదీ 53వేలు, 13న 90వేలు, 14న 1,22,200, 15న 1.52లక్షలు,16న 86,600, 17న 1.60లక్షలు, 18న 1.52లక్షలు, 19న 1,39,300, 20న 4.43లక్షలు, 21న 5.91లక్షలు, 22న 4.81లక్షలు, 23న 3.11లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. తొలి 8 రోజులు భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. ఆ తర్వాత నాలుగురోజులు అనూహ్యంగా పెరిగింది. ట్రాఫిక్ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంలు దామోదర రాజనర్సింహ్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పుణ్యస్నానాలు చేశారు. మంచాలకట్టలో 5.5లక్షలు, అమరగిరిలో 6 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రంగాపూర్లో 45లక్షలు రంగాపూర్ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలను పన్నెండు రోజుల పాటు రంగాపూర్ఘాట్లో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఘాట్లోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలో దాదాపు 2 కోట్ల మంది పుష్కరస్నానం చేస్తే అందులో 45లక్షల మంది అతి విశాలమైన రంగాపూర్లోనే స్నానమాచరించారు. మొదటి రెండు రోజులు జనం పలుచగా ఉన్నా నెమ్మదిగా పుంజుకుని చివరి నాలుగు రోజులు లక్షల్లో పోటెత్తారు. 10వ రోజే ఏకంగా 9 లక్షల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. పోలీసులు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరోత్సవాలను విజయవంతం చేశారు. రంగాపూర్ఘాట్కు వీఐపీల తాడికి అంచనాలకు మించి ఉన్నట్లు ఘాట్ ప్రత్యేకాధికారులు ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డ్వామా పీడీ కట్టా దామోదర్రడ్డి, ఆర్డీఓ రామచందర్ తెలిపారు. బీచుపల్లిలో 39.50 లక్షలు బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాల్లో 12రోజుల పాటు ఇటిక్యాల మండలం బీచుపల్లిలో 38.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పునీతులయ్యారు. పుష్కరఘాట్ ఇన్చార్జ్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో ప్రత్యేకాధికారులు జేసీ రాంకిషన్, గంగారెడ్డి అనునిత్యం ఎప్పటికప్పుడు ఘాట్లను పర్యవేక్షిస్తూ పుష్కరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగ్విజయంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో 1200మంది పోలీసులు నిఘా సారించారు. ప్రధానంగా ఘాట్లన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల్లో అపరిశుభ్రత నెలకొనకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని నిరూపించారు. ఈ నెల 12న తెల్లవారుజామున నదీహారతితో ప్రారంభమైన పుష్కరాలు మంగళవారం సాయంత్రం 7గంటలకు నదీహారతితో ముగించారు.