breaking news
BEd College Principal
-
బీఈడీలో బ్లాక్ టీచింగ్.. చీటింగ్!
కర్నూలు సిటీ: ఛాత్రోపాధ్యాయుల బ్లాక్ టీచింగ్(ఇంటర్న్షిప్)లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై వేటు పడకుండా కర్నూలు డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కోర్సు అభ్యసించే ఛాత్రోపాధ్యాయులను థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ సమయంలో బ్లాక్ టీచింగ్(ఇంటర్న్షిప్)కు పంపిస్తారు. ఇందుకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇంటర్న్షిప్కు స్కూళ్లను కేటాయించాలని కోరుతారు. బీఈడీ కాలేజీల యాజమాన్యాలు సైతం ఈ మేరకు డీఈఓకు విన్నవించుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని కొన్ని బీఈడీ కాలేజీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 2020–22 బ్యాచ్కి చెందిన ఛాత్రోపాధ్యాయులు బ్లాక్ టీచింగ్(ఇంటర్న్షిప్) చేసినట్లు చూపించాయి. పలు ఫిర్యాదులు రావడంతో ఎన్ని కాలేజీలకు బ్లాక్ టీచింగ్కి అనుమతులు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో డీఈఓకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఈ లేఖకు ఈ ఏడాది మార్చి 2వ తేదిన స్పందిస్తూ.. 11 కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేశారనే ఆరోపణలు వచ్చిన హెచ్ఎంలపై డీఈఓ చర్యలు తీసుకోకుండా 20 రోజుల్లోనే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు డీఈఓ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. అనుమతులకు అక్రమ వసూళ్లు! రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 2020–22 విద్యా సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 20 బీఈడీ కాలేజీలకు బ్లాక్ టీచింగ్కి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో 11 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, మరో 11 కాలేజీలకు ఇవ్వలేదని ఆర్యూ అధికారులకు డీఈఓ తెలిపారు. ఆ తరువాత కొద్ది రోజులకే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్లాక్ టీచింగ్ కోసం అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు కర్నూలులో బుధవారపేటలోని ఓ హోటల్లో బేరం కుదుర్చుకుని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మామూళ్లు వసూలు చేయడంలో డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని వాటాలుగా పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా కాలేజీల యాజమాన్యాలు డీఈఓపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. చర్యలు తీసుకుంటాం 2020–22 విద్యా సంవత్సరానికి 22 కాలేజీలకు బ్లాక్ టీచింగ్కి అనుమతులు ఇవ్వాలని రాయలసీమ యూనివర్సిటీ అధికారులు కోరారు. ఇందులో 11 కాలేజీలకు మాత్రమే మొదట ఇచ్చాం. మార్చి నెలలో 11 కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదని యూనివర్సిటీ అధికారులకు తెలిపిన మాట వాస్తవమే. అయితే యూనివర్సిటీ అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటే కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన హెచ్ఎంలపై విచారించి చర్యలు తీసుకుంటాం. – రంగారెడ్డి, డీఈఓ -
‘బాబు’.. డబుల్ రోల్ !
- బీఈడీ కళాశాల సారథిగా ఉంటూ అదే కోర్సు చదువుతున్న వ్యక్తి - జవాబు పత్రాల మూల్యాంకనానికీ హాజరు - అయినా పట్టించుకోని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు - విద్యాప్రమాణాలు దిగజారతాయంటున్న నిపుణులు సాక్షి, రాజమండ్రి : ఆయన ఓ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్. ఆయనే 2013-14 సంవత్సరం బీఈడీ విద్యార్థి కూడా. ఇంకా పరీక్షలు రాయాల్సి ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా బీఈడీ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం చేసేశారు. ఈ కంగాళీ వ్యవహారాన్ని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం విశేషం. రాజమండ్రిలో సెయింట్ జాన్స్ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్గా చాలా కాలం నుంచి పని చేస్తున్న బి.రాజబాబు పోస్టుగ్రాడ్యుయేషన్తో పాటు ఎంఈడీ చేశారు. ప్రిన్సిపాల్గా ఉండడానికి బీఈడీ ఉత్తీర్ణత తప్పనిసరి అని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు అనడంతో (ఎంఈడీ చేసినా ప్రిన్సిపాల్గా ఉండాలంటే ఎన్సీఈటీ నిబంధలన ప్రకారం బీఈడీ కూడా చేయాల్సి ఉండడంతో ఆ కోర్సులో చేరుతున్నట్టు సమాచారం) రాజబాబు రాజమండ్రిలోని శారదా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 2013-14 సంవత్సరంలో (హాల్ టికెట్ నం: 213168301015) బీఈడీలో చేరారు. బుధవారం విశాఖలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లో బీఈడీ జవాబుపత్రాల మూల్యాంకనం మొదలైంది. రాజబాబు మ్యాథమేటిక్స్ బోర్డు ఎగ్జామినర్గా మూల్యాంకనం చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన యూనివర్సిటీ అధికారులు బుధవారమే ఆయనను మందలించినా.. తిరిగి గురువారం సాయంత్రం వరకూ సైకాలజీ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. బీఈడీ విద్యార్థిగా ఉన్న వ్యక్తి అదే పరీక్ష జవాబుపత్రాలను మూల్యాంకనం చేయడం విద్యా ప్రమాణాల రీత్యా అనుచితమని నిపుణులు అంటున్నారు. కాగా వర్సిటీ అధికారులు మూల్యాంకనం నుంచి రాజబాబును తప్పించామని చేతులు దులుపుకొంటున్నారు. విధుల నుంచి తప్పించాం.. రాజబాబు అనే వ్యక్తి బీఈడీ విద్యార్థిగా ఉంటూనే కళాశాల ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నట్టు ప్రాథమిక పరిశీలనలో తేలిందని ఏయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి చెప్పారు. దీనిపై ఆయనను, రెండు కళాశాలల యాజమాన్యాలను వివరణ కోరుతున్నామన్నారు. కాగా బీఈడీ విద్యార్థిగా ఉన్న వ్యక్తిని మూల్యాంకనం విధుల నుంచి తప్పించి, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఆచార్య శివ ప్రసాదరావు చెప్పారు. గిట్టని వాళ్ల దుష్ర్పచారం.. కాగా తాను బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న మాట వాస్తవమే అయినా మూల్యాంకనానికి హాజరు కాలేదని రాజబాబు అంటున్నారు. గిట్టని వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ కళాశాల యాజమాన్యం తన అర్హతలు చూసి ప్రిన్సిపాల్ ఉద్యోగం ఇచ్చిందని, అయితే వర్సిటీ నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్గా వ్యవహరించేందుకు బీఈడీ ఉత్తీర్ణత అవసరం కావడంతో ఆ కోర్సు చదువుతున్నానని వివరించారు. తనలా చదువుతున్న వాళ్లు రాష్ట్రంలో చాలామంది ఉన్నారన్నారు. ఇది తప్పనుకుంటే తనను కాక వర్సిటీ అధికారులను ప్రశ్నించాలన్నారు. కొసమెరుపు..... బీఈడీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి చీఫ్ సూపరింటెండెంట్గా రాజబాబు ఎక్సటర్నల్ ఎగ్జామ్స్కి ఇచ్చే రిలీవింగ్ సర్టిఫికెట్ల పైన, యూనివర్సిటీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన మార్కుల జాబితాలపై అధికారికంగా సంతకాలు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై స్పందించడానికి తమ వద్ద పూర్తి సమాచారం లేదని అధికారులు అంటున్నారు.