breaking news
Bapu passes away
-
మీ డెరైక్షన్లో సినిమా తీస్తానంటే..బాపుగారు జోక్ చేస్తున్నా అనుకున్నారు!
ఆ హోటల్కి లంచ్కెళ్లా. బఫే దగ్గర బాపు గారు కనబడ్డారు. ‘‘నమస్కారం సార్’’ అని పలకరించా. ఆయన కూడా నాకు నమస్కారం చెప్పారు. నేనెవరో ఆయనకు తెలీదు. ఎవరో అభిమాని అనుకున్నారు. ‘‘నేను మీ అభిమానినండీ’’అని చెప్పగానే, ‘‘చాలా థ్యాంక్సండీ’’ అన్నారాయన. ప్లేట్లో ఫుడ్ ఐటెమ్స్ వడ్డించుకున్నాక ‘‘నేను ఆ మూల కూర్చుని తింటానండీ’’ అని చెప్పారు బాపు. దానర్థమేంటో నాకు తెలుసు.నేను నవ్వుతూ ‘‘అలాగే సార్... మీ దగ్గరకు నేనే కాదు, ఇంకెవర్నీ రానివ్వను’’ అన్నాను. అన్నట్టుగానే ఆయన భోజనం చేసినంతసేపు ఎవరూ వెళ్లకుండా కాపలా కాశాను.బాపు గారితో నా ఫస్ట్ మీటింగ్ (?) అది. తనికెళ్ల భరణి గారికో ఉత్తరమొచ్చింది. రాసింది బాపుగారు. ‘‘ఒక మంచి సినిమా చూశాను. ‘అమ్మా - నాన్న - ఓ తమిళమ్మాయి’... నువ్వు కూడా చూడు. ఇది నిజం. ఇట్లు బాపు’’ ఈ విషయం భరణిగారు నాతో చెబితే ఎంత పొంగిపోయానో! ‘‘అమ్మా - నాన్న - ఓ తమిళమ్మాయి రిలీజైన కొన్ని రోజుల తర్వాత - నేను, రవితేజ ఓ అడ్రస్ వెతుక్కుని మరీ వెళ్లాం. అక్కడ బాపుగారు ఉన్నారు. నా పేరు చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి ‘‘మీరు పెద్ద డెరైక్టర్ కదా... నా దగ్గర కొచ్చారేంటి?’’ అన్నారు. ‘‘సార్... రవితేజ హీరోగా మీ డెరైక్షన్లో ఓ సినిమా ప్రొడ్యూస్ చెయ్యాలనుకుంటున్నా’’ అని చెప్పగానే, ఆయన జోక్ అనుకున్నారు. ‘‘ఒరేయ్ రమణా... వీళ్లు నాతో సినిమా తీస్తారట’’ అని గట్టిగా అంటే, లోపల నుంచి రమణగారొచ్చారు. ‘‘మీరు బానే ఉన్నారుగా... ఎందుకండీ ఈ పిచ్చిపని. మా టైమ్ అయిపోయింది. మా సినిమాలు ఇప్పుడెవరూ చూడరు’’ అన్నారు రమణగారు.దానికి బాపుగారు వంత పాడారు - ‘‘మా దగ్గర కథల్లేవు. మీరే కథ ఇవ్వండి’’ అన్నారు బాపుగారు ఛలోక్తిగా. అక్కడ మేం ఉన్నంతసేపు మమ్మల్ని ఎంత నవ్వించారో. తమ మీద తాము అలా జోకులేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి. అంత నిజాయితీ మేం ఇంకెక్కడా చూడలేదు కూడా.ఇది బాపుగారితో నా సెకండ్ మీటింగ్. లాస్ట్ మీటింగ్ కూడా! బాపుగారికి నేను వీరాభిమానిని. ఆయన చిత్రాలన్నా, సినిమాలన్నా ప్రాణం నాకు. ఈ ప్రపంచంలో గొప్పగొప్ప ఆర్టిస్టులుండొచ్చు. నవ్వునీ,ఏడుపునీ అద్భుతంగా ఆవిష్కరించొచ్చు.కానీ, ఆయనలా సిగ్గునీ, బిడియాన్నీ, మొహమాటాన్నీ, ఇబ్బందినీ బొమ్మలతో చూపించగలగడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయనలా బొమ్మలేయడం... ఆయనలా సినిమాలు తీయడం ఎవరితరమూ కాదు! ఇంకెన్ని తరాలు గడిచినా అంతే! నేను పాతిక సినిమాలు తీసుంటే - అందులో సగం టైటిల్స్ బాపుగారి లెటరింగ్తోనే ఉంటాయ్. చూశారా.... ఆయన తెలీకుండానే నాపై ఎంత ముద్ర వేసేశారో!తెలుగువాళ్లు ఎవరైనా డెరైక్ట్గానో, ఇన్డెరైక్ట్గానో ఆయనను అనుకరించాల్సిందే! అనుసరించాల్సిందే! అందుకే బాపుగారు చిరంజీవి. -
అవుట్డోర్ ‘సాక్షి’గా...
బాపు తీసిన తొలి బొమ్మ బొమ్మలతో సున్నితమైన హావభావాలను పలికింపజేయడమే కాదు, ఒక రచయిత పుంఖాను పుంఖాలుగా రాసే కథలోని ఆంతర్యం మొత్తాన్ని ఒక్క బొమ్మతో చెప్పేసే బాపు... రెండున్నర గంటల కథను తెరపై రక్తికట్టించలేడా? కచ్చితంగా రక్తికట్టించగలడు. బాపుపై ముళ్లపూడి వెంకటరమణకి ఉన్న ఆపారమైన నమ్మకం అది. ఆ నమ్మకమే ‘సాక్షి’ నిర్మాణానికి కారణమైంది. బాపుకి కేరీ కూపర్ నటించిన ‘హై నూన్’ సినిమా అంటే ఇష్టం. రెండున్నర గంటల్లో జరిగే కథ అది. తన సినిమాను అలాగే చేద్దామనుకున్నారు బాపు. అందుకు తగ్గట్టే ముళ్లపూడి ‘సాక్షి’ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్టులో పాటలుండవ్. అప్పటికే నవయుగ పంపిణీదారులు కొన్ని సినిమాల వల్ల నష్టపోయి ఉన్నారు. వారి వద్దకెళ్లి ‘సాక్షి’ కథ వినిపించారు ముళ్లపూడి. ‘మూగమనసులు’ రచయితగా ముళ్లపూడి అంటే నవయుగావారికి వల్లమాలిన ప్రేమ. ‘మీరు కొత్తవారితో సినిమా చేద్దామంటున్నారు. సంతోషం. సినిమా అంతా అవుట్డ్డోర్లోనే అంటున్నారు. ఇంకా సంతోషం. కానీ... పాటల్లేకుండా సినిమా అంటున్నారు. అది మాత్రం బాలేదు. మన ప్రేక్షకులకు పాటలు చాలా ముఖ్యం’ అని ముళ్లపూడికి నచ్చజెప్పారు. పంపిణీదారుల సహకారం లేకుండా సినిమా పూర్తి చేయలేం కాబట్టి... పాటలు, నృత్యాలు... ఇలా అన్నీ కలిసొచ్చేట్లుగా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారు ముళ్లపూడి. దాంతో నవయుగ వారి భరోసా లభించింది. ి సనిమా సెట్స్కి వెళ్లింది. షూటింగ్కి వారం రోజుల ముందు ఆదుర్తి దగ్గర సహాయదర్శకుడైన కబీర్దాస్... బాపుని కూర్చోబెట్టి, లాంగ్ షాట్స్, మిడ్లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, సజషన్ షాట్స్ ఇవన్నీ... ఎలా తీయాలో సూచించారు. ‘అమ్మ కడుపు చల్లగా’ పాటతో చిత్రీకరణ స్టార్ట్. సాయంత్రానికలా పాటను పూర్తి చేసేశారు బాపు. ఆయన షాట్స్ పెట్టిన తీరు చూసి కెమెరామేన్ సెల్వరాజ్ విస్తుపోయారు. భవిష్యత్లో బాపు దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని జోస్యం చెప్పారు. ఇక ‘సాక్షి’ కథ విషయానికొస్తే... హంతకుడు చంపుతాడేమోనని ప్రాణభయంతో వణికిపోతున్న కథానాయకుడికి హంతుకుని చెల్లెలైన కథానాయికే భరోసా ఇస్తుంది. హీరోని పెళ్లాడుతుంది. తర్వాత ఏం జరిగిందనేది కథ. సినిమా ఆద్యంతం కోనసీమలోని పులిదిండి అనే గ్రామంలో తీశారు బాపు. కృష్ణకు ఇది రెండో సినిమా. విజయనిర్మల కూడా ‘రంగులరాట్నం’ తర్వాత నటించిన సినిమా ఇదే. విజయలలిత, సాక్షి రంగారావు, కనకదుర్గ, జగ్గారావులకు ఇదే తొలి సినిమా. కేవలం రెండున్నర లక్షల్లోనే సినిమాను పూర్తి చేశారు బాపు. సినిమా కూడా మంచి లాభాలే వచ్చాయి. అవార్డులను కూడా కైవసం చేసుకుంది.