breaking news
bank representatives
-
సీఎం వైఎస్ జగన్తో బ్యాంకు ప్రతినిధుల భేటీ
-
ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డైరెక్టర్ జనరల్–ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ యీ–ఎన్–పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమేనని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి వివరించారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు అందగానే వెంటనే ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు కార్యక్రమాలపై ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అట్టడుగున ఉన్న వర్గాల వారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం జగన్ వారికి వివరించారు. స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, మధ్యాహ్న భోజనంలో చేపట్టిన మార్పుల గురించి తెలిపారు. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి, ఆ దిశగా పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ‘అమ్మఒడి’ కింద నేరుగా నగదు బదిలీ చేసిన అంశాన్ని కూడా బ్యాంకు అధికారులకు స్పష్టంగా వివరించారు. ఉపాధే లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో తీసుకువస్తున్న మార్పులను, ఒక ఏడాది అప్రెంటిస్షిప్ విధానాన్ని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్, విద్యా వసతి పథకం గురించి కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమాలపై ఏఐఐబీ ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్ మీద పెడుతున్న పెట్టుబడులుగా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్న సీఎం వ్యాఖ్యలతో వారు ఏకీభవించారు. మీ ప్రణాళికలు బాగున్నాయి. 20 ఏళ్లుగా ప్రైవేటైజేషన్ మాటలు విన్నాం. ప్రజల కేంద్రంగా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవన ప్రమాణాల సాధన ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాల గురించి మళ్లీ ఇప్పుడే వింటున్నాం. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా తప్పక సాయం చేస్తాం. – సీఎం జగన్తో ఏఐఐబీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులకు తప్పక సాయం వైద్య విద్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై బ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. ప్రతి పార్లమెంటు స్థానానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూస్తున్నామని, దీనికోసం మరో 16 మెడికల్ కాలేజీలు కొత్తగా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా నిర్మించదలచుకున్న పోర్టుల గురించి వారు సీఎంను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్, రోడ్లు, వాటర్ గ్రిడ్, ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు తమ సహాయం ఉంటుందని తెలిపారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం గురించి కూడా సీఎం వారికి వివరించారు. సముద్రంలో కలిసిపోతున్న నీటిని తరలించడం ద్వారా శాశ్వతంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏ ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. -
సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులను మంగళవారం ప్రపంచబ్యాంకు బృందం పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో కొనసాగుతున్న ఆధునీకీకరణ పనులు ఈఏడాది పూర్తి కానున్నాయి. ఆ పనుల ప్రగతిని పరిశీలించేందుకు బ్యాంకు ప్రతినిధులు వారం రోజులపాటు ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి ప్రగతి నివేదికను తయారు చేయనున్నారు. అన్నిరంగాలకు సంబంధించిన నిపుణులు బృందంలో ఉన్నారు. అందులో భాగంగా బ్యాంకు ప్రతినిధుల బృందం సోమవారం సాగర్డ్యాంపై జరిగే పనులను, హాలియా, నిడమనూరు, మేళ్లచెరువు, హుజూర్నగర్ మండలంలోని వేపలసిం గారంలో ఎడమకాల్వ పనులను పరిశీలించారు. క్రస్ట్గేట్లు ఎత్తేందుకు మోటార్లు ఉంచే వంతెనతో పాటు 420 గ్యాలరీ, స్పిల్వే క్రస్ట్గేట్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టీంలీడర్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కాల్వల ప్రారంభం నుంచి చివరి వరకు పరిశీలించి ప్రగతి నివేదిక తయారు చేస్తామని తెలిపారు. వీరికి సాగర్డ్యాం అధికారులు జరిగిన పనులతో పాటు చేయాల్సిన పనులను చూయించారు. ఈబృందంలో నిపుణులు గౌతశివదాసిని, అనితకృష్ణ కరూర్, అర్జున్తోకేర్, తుమ్మర్దావా, పార్వతీశం, పాల్సింగ్సిద్ధు, జిన్జైన్, ఎస్.కె.జైన్, శాలిని అగర్వాల్ తదితరులున్నారు. వీరి వెంట సాగర్ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సునీల్, ఎస్ఈ రమేశ్, ఈఈ వెంకట్రెడ్డి, డీఈలు సుదర్శన్రావు, విజయకుమార్, ఏఈలు రామారావు, జైల్సింగ్, కృష్ణయ్య, నర్సింహమూర్తి తదితరులున్నారు. -
డ్వాక్రా రుణాలను రద్దు చేయండి
కలెక్టరేట్ ఎదుట మహిళల ధర్నా మచిలీపట్నం : ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ విమర్శించారు. డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళల సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నమ్మిన డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో రుణాలను చెల్లించలేదన్నారు. పొదుపు సొమ్మును వడ్డీ కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వీవోఏల సమస్యలు పరిష్కరించండి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యాన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ) సంఘం ప్రతినిధులు, సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీవోఏల సంఘ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమకు సెర్ఫ్ నుంచి 15 నెలల వేతన బకాయిలు రావాల్సి ఉందన్నారు. వెంటనే బడ్జెట్ను విడుదల చేయాలన్నారు. రాజకీయ నాయకుల వేధింపులు, అక్రమ తొలగింపులు, బెదిరింపుల నుంచి తమకు విముక్తి కలిగించాలని, గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీవోఏల సంఘ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, ప్రధాన కార్యదర్శి బి.సౌజన్య, ఎన్డీ భవానీ, పలువురు వీవోఏలు పాల్గొన్నారు.