పదిలో ప్రథమస్థానం సాదిద్ధాం
కడప ఎడ్యుకేషన్: రాబోయే పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాల సాధన కోసం అందరం సమన్వయంతో పనిచేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలుపుదామని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్రెడ్డి సూచించారు. కడప నగరంలోని డీసీఈబీ హాలులో శనివారం కడప డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఈఏడాది పదవ తరగతి ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ కష్ణపడాలని తెలిపారు.
ఫలితాల్లో ప్రవేట పాఠశాలలకు ధీటుగా ఉండాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పాఠశాల వేళల ఆనంతరం స్టడీఅవర్స్ నిర్వహించాలని తెలిపారు. వారు ఎలా చదువుతున్నారని పరిశీలించడంతో పాటు వీక్గా ఉండే సబ్జెక్టుల్లో ముందుకు తీసుకుపోవాలన్నారు. ప్రణాళిక బద్దంగా వెళ్లటంతోపాటు విద్యార్థులకు ఖచ్చితంగా స్లిప్ టెస్టులను నిర్వహించాలన్నారు. అలాగే వారంలో ఒకరోజైనా వారికి క్విజ్ ను నిర్వహించాలన్నారు.
లైబ్రరీ అలవాటు చేయూలి
పాఠశాల దశనుంచే విద్యార్థులకు లైబ్రరీని అలవాటు చేయాలని డీఈఓ హెచ్ఎంలకు సూచించారు. లైబ్రరీకి వెళ్లి పెద్దపెద్ద వాళ్ల చరిత్రలను చదివినప్పుడే వారిలో మానసిక స్థితి మారుతుందన్నారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరారు. జాతీయస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులే ప్రతిభ చాటుతున్నారన్నారు.
ఇప్పటికైనా స్పందించి పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం ప్రతి ప్రధానోపాధ్యాయుడిని తమ పాఠశాలలో ప్రత్యేకతలతోపాటు పదవ తరగతి పలితాల కోసం ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధి జీవీ నారాయణరెడ్డి. డీసీఈబీ సెక్రెటరీ వెంకటరామిరెడ్డిలతోపాటు పలుపాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.