ఏయూకు దీటుగా ‘నన్నయ’ను తీర్చిదిద్దుతాం
అంతర కళాశాలల అథ్లెటిక్ మీట్లో డిప్యూటీ సీఎం రాజప్ప
పెద్దాపురం :
నన్నయ యూనివర్సిటీని ఏయూకు దీటుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ఇప్పటికే రూ.46 కోట్లు వెచ్చించామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నన్నయ వర్సిటీ ఆధ్వర్యాన పెద్దాపురం మహారాణి కళాశాలలో రెండు రోజులపాటు జరిగే అంతర కళాశాలల అథ్లెటిక్ మీట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడాకారులు ప్రతి రంగంలోనూ రాణించేందుకు కృషి చేయాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నన్నయ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం.ముత్యాలునాయుడు, ఇంటర్మీడియెట్ బోర్డ్ ఆర్జేడీ కె.గంగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. తొలుత వీసీ ముత్యాలునాయుడు జ్యోతి ప్రజ్వలన చేయగా, రాజప్ప క్రీడలను అట్టహాసంగా ఆరంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 46 కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. లాంగ్జంప్, హైజంప్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరిబాబురాజు, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు.