breaking news
arun showri
-
రఫేల్పై వాడివేడీ వాదనలు.. తీర్పు రిజర్వు
సాక్షి: న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాడీవేడిగా జరిగింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు అటర్నీ జనరల్ ధర్మసనానికి వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పిటిషనర్ల తరుఫున తొలుత వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలోని నిజనిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి.. జెట్ల ధరలను బహిర్గతం చేయలేమని అన్నారు. పిటిషనర్లు ప్రతిసారి ధరల గురించి ప్రస్తావించడం సరైనది కాదని అసహనం వ్యక్తంచేశారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు తమకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. కాగా రాఫెల్పై పిటిషన్ దాఖలు చేసిన మరో పిటిషనర్ అరుణ్ శౌరి న్యాయస్థానం ఎదుట తన వాదనల్ని విన్పించారు. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు. ఇప్పటికే కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే సుప్రీంకోర్టు గత తీర్పు ఇచ్చిందని న్యాయస్థానం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
రఫేల్పై తీర్పును పునఃసమీక్షించండి
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుపై వెలువరించిన సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్సిన్హా, అరుణ్శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీం కోర్టును కోరారు. 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 14న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి సంతకాలు లేకుండా ప్రభుత్వం సమర్పించిన సీల్డ్కవర్ నివేదికపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందని వారు కోర్టుకు విన్నవించారు. ‘కేవలం నమ్మశక్యంకాని ఆధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చిందని భావిస్తున్నాం. కనీసం సంతకాలు కూడా లేని సీల్డ్కవర్ నివేదికపై తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమ’ని యశ్వంత్సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత భూషణ్లు పిటిషన్లో వివరించారు. తీర్పును రిజర్వ్ చేసిన తరువాత అనేక కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, వాటి మూలాల్లోకి వెళ్లి కోర్టు విచారించాలని, ఆ లోపు తీర్పును సమీక్షించాలని వారు కోర్టుకు విన్నవించారు. -
తెలివిగా మాట్లాడితేనే నాయకులు కాదు!
-
తెలివిగా మాట్లాడితేనే నాయకులు కాదు!
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో అరుణ్శౌరి - నాయకుల్లో అభద్రతతో వ్యవస్థలు బలహీనపడతాయి.. దేశాన్ని పాలించేవారిని ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి - నోట్ల రద్దులో చిత్తశుద్ధి లేదు.. నల్లధనమంతా విదేశాల్లోనే ఉందని వ్యాఖ్య - అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ: జోషి జోసెఫ్ - తెలుగు సినిమాలకు మంచి కథలు - దొరకడం లేదు: ప్రకాశ్రాజ్ - రెండో రోజు భారీగా తరలివచ్చిన సందర్శకులు - వివిధ అంశాలపై చర్చలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక, కళా ప్రదర్శనలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. నల్లధనమంతా విదేశాల్లో భద్రంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్టు, రచయిత అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. కేంద్రం మొదట దొంగనోట్లను అరికట్టేం దుకు నోట్లు రద్దు చేస్తున్నట్లు చెప్పిందని, కానీ అవి కరెన్సీలో కేవలం 0.002 శాతమేనని తేలడంతో నల్లధనాన్ని వెలికితీసేందుకేనంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమానికి అరుణ్ శౌరి ముఖ్య అతిథిగా హాజరై... "నాయకులు వారి అనుచరులకు పాఠాలు" అనే అంశంపై ఉపన్యసించారు. "ఈ దేశంలో నల్లడబ్బు దాచుకున్న చివరి వ్యక్తి (కేంద్ర మాజీ మంత్రి) సుఖ్రామ్. అదీ 25 ఏళ్ల కిందట! ఇంక ఇప్పుడు దేనికోసం నోట్ల రద్దు తీసుకున్నట్టు?.." అని ప్రశ్నించారు. ఆర్భాటంగా మాట్లాడటం, పూటకో ఆకర్షణీయ నినాదం ఇవ్వడమే నాయకుల లక్షణం కాదని.. తెలివిగా మాట్లాడటం వివేకం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. గుజరాత్ నమూనాలో పది శాతం అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారని, కానీ నిజానికి 6 శాతం అభివృద్ధే జరిగినట్లు ఇటీవల యోగేంద్ర యాదవ్ అంచనాల్లో వెల్లడైందని చెప్పారు. తాను ఆరుసార్లు దివాళా తీశాను, ఆదాయ పన్నులు ఎగ్గొట్టానంటూ గొప్పగా చెప్పుకోవడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వాన్ని పట్టి చూపుతోందన్నారు. మోదీ, ట్రంప్లాంటి వాళ్లు తమకు అందరూ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పదే పదే ప్రచారం చేసుకోవడం ద్వారా తమ అంతర్గత స్వీయబాధిత ధోరణిని వెల్లడిస్తారని పేర్కొన్నారు. అభద్రత ఉంటే అంతే.. నాయకుడు అభద్రతకు లోనైతే వ్యవస్థలు ఎలా బలహీనపడతాయో చెప్పేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చక్కటి ఉదాహరణ అని అరుణ్ శౌరీ చెప్పారు. బలహీనులను, రాజీపడగలిగే వాళ్లను, స్వీయ ఆలోచన లేకుండా అడుగులకు మడుగులొత్తేవాళ్లను, పదవికోసం ఎంతటికైనా దిగజారేవాళ్లను ఆమె తన అనుచరులుగా కొనసాగించి, తనలోని అభద్రతను అధిగమించారన్నారు. "నీ చట్టూ ఉన్నవాళ్లు ద్వితీయ శ్రేణి వ్యక్తులు అయినప్పుడు, వాళ్లు తిరిగి తృతీయ శ్రేణి వ్యక్తులను చేరదీస్తారు. ఇది అంచెలంచెలుగా కిందికి పాకుతుంది. ఉదాహరణకు ఒక విద్యా మంత్రి బలహీనుడైతే అంతకంటే బలహీనమైన వైస్ చాన్సలర్లను ఎంపిక చేస్తాడు. రాజకీయాల్లో ఇదే కొనసాగుతోంది.." అని చెప్పారు. సత్యం వేరు, వ్యాపార సత్యం వేరంటూ రెండో దానికి మినహాయింపునిచ్చే ధోరణి ప్రబలిందన్నారు. "లెసన్స్ ఫర్ లీడర్స్ అండ్ ఫాలోవర్స్" పేరిట పుస్తకం రాస్తున్నానన్న శౌరీ... వంద కోట్ల జనాభా ఉన్న దేశాన్ని పాలించే నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రజలు చూపాల్సిన జాగరూకతను వివరిస్తూ పాయింట్ల వారీగా ఇచ్చిన ప్రసంగానికి సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐశ్వర్యమనిమణ్ణన్ ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ సిలంబమ్, లీలాశాంసన్ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు, గుస్సాడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరూ హిందూమత దీప స్తంభాలు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు ఇద్దరూ హిందూ మతానికి రెండు దీప స్తంభాలని అరుణ్ శౌరీ పేర్కొన్నారు. సెరిబ్రల్ పాల్సీ బాధితుడైన కుమారుడు, పార్కిన్సన్స్ బాధితురాలైన భార్య వల్ల తనకు న్యూరోసైన్స్ మీద, అద్భుత శక్తులు చూపిన ఈ ఇద్దరు యోగుల మీద ఆసక్తి కలిగిందని.. అందుకే మెదడు శరీరాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశంపై పరిశోధిస్తున్నానని శౌరీ చెప్పారు. దానిపై "టూ సెయింట్స్" పేరిట పుస్తకం రాస్తున్నాన్నట్లు చెప్పారు. తెలుగు సినిమాలకు కథలు దొరకడం లేదు ఫెస్టివల్లో "మీనింగ్ ఫుల్ సినిమా" అనే అంశంపై జరిగిన చర్చలో సినీనటుడు ప్రకాశ్రాజ్, ఫిల్మ్ మేకర్ నందినీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహూతులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పారు. తెలుగు సినిమాలకు వైవిధ్యంతో కూడిన మంచి కథలు లభించడం లేదని.. ఇలాంటి చర్చలు, సాహిత్య సదస్సుల ద్వారా కొత్త కథకులు, కొత్త కథలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సినిమాకు మంచి, చెడు అనేది ఉండదని.. ప్రేక్షకులను స్పందింపజేయగలిగితే చాలునని ప్రకాశ్రాజ్ పేర్కొన్నారు. కథానాయకులు తమ అభిమానులను విపరీతంగా ప్రభావితం చేస్తున్నారనే అంశంపై స్పందిస్తూ.. అది పూర్తిగా నిజం కాదన్నారు. చిరంజీవి, రజనీకాంత్ వంటి నటులు అయ్యప్ప మాల ధరిస్తే ప్రజలు కూడా మాల ధరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏ సినిమా అయినా ప్రేక్షకుల మనోభావాలతో అనుసంధానమైతే అది అర్థవంతమైన సినిమాగానే భావించవచ్చని నందినీరెడ్డి అభిప్రాయపడ్డారు. దళారీ వ్యవస్థ ఓ మాఫియా.. లిటరరీ ఫెస్టివల్లో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ జోషి జోసెఫ్ రాసిన "ఇండియా ఆన్ సేల్" పుస్తకంపై చర్చ జరిగింది. దేశంలోని అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకొని ఉందని జోసెఫ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ మొదలుకుని రాజకీయ, ఆర్థిక, వ్యాపార రంగాల వరకు లంచాలతో దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు ఆ వ్యవస్థ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒక మాఫియాగా మారిన రాజకీయ రంగం దళారులపైనే ఆధారపడి పాలన కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, లంచగొండితనం వల్లే గ్రామీణ ప్రాంతాలు కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదన్నారు. విమానయాన రంగంలో వ్యవస్థీకృతమైన అవినీతి కొనసాగుతోందని.. ఎయిరిండియాకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి దళారులే కారణమని పేర్కొన్నారు. దళారులతో ఎయిరిండియాను దెబ్బతీసి ఆ రంగంలో తాను ఎదిగేందుకు టాటా శక్తి వంచన లేకుండా ప్రయత్నించారని చెప్పారు.