breaking news
anti-regime
-
రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పాలన
మురికి వాడల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు జె.నరసింహస్వామి ఎత్తినహొళె పేరుతో ఇంకా మోసం చేస్తున్న మొయిలీ దొడ్డబళ్లాపురం : రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందంటూ మురికి వాడల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు జె.నరసింహస్వామి విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయలు సీమ జిల్లాలకు శాశ్వత నీటి వనరులు కల్పించాలంటూ యువమోర్చా ఆధ్వర్యంలో చిక్కబళ్లాపురం నుంచి బెంగళూరుకు 300 మంది కార్యకర్తలు చేపట్టిన పాదయాత్రను ప్రభుత్వం నిర్ధయగా అణిచి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన పాదయాత్రను అప్పటి ప్రభుత్వం అడ్డుకోలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలపై నిలదీసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని, ఈ విషయంపై కనీస పరిజ్ఞానం కూడా రాష్ర్ట ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎత్తినహొళె పథకం పేరుతో ఇప్పటికీ బయలుసీమ ప్రజలను ఎంపీ వీరప్ప మొయిలీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం పూర్తి అయ్యే అవకాశమే లేదన్నారు. అక్కడి నుండి నీరు తరలించడానికి దక్షిణ కన్నడ జిల్లా వాసులు అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. దమ్ముంటే రాజీనామా ఇవ్వండి ‘తాలూకాలో బెంగళూరు చెత్త డంపింగ్ చేయడానికి అనుమతులిచ్చింది బీజేపీ హయాంలో, నరసింహస్వామి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే, కావున పాపం ఆయనదే’ అంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య ప్రకటనలివ్వడం పట్ల నరసింహస్వామి ఫైర్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాలూకాలో బీబీఎంపీ బెంగళూరు చెత్త వేయడానికి స్థలాన్ని గుర్తిస్తే అప్పటి ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్కు రాజీనామా ఇచ్చి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నానని గుర్తు చేశారు. ఇప్పటి ఎమ్మెల్యే వెంకటరమణయ్యకు తాలూకా ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ ఉంటే తాను కూడా ముఖ్యమంత్రికి రాజీనామా ఇచ్చి అడ్డుకోవాలని సవాలు విసిరారు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు బీసీ నారాయణస్వామితోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. -
చంద్రబాబు పాలనంతా రైతు వ్యతిరేకమే
మంగళగిరి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల వద్ద పంట పొలాల్లో మంగళవారం రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, రైతులు రాజధాని భూ సేకరణపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని కోసం చందాలు అడుగుతున్న ముఖ్యమంత్రి రైతుల వద్ద భూములు సేకరిస్తే వారికి ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారని ప్రశ్నించారు. పులిచింతల నిర్వాసితులతో పాటు నియోజకవర్గంలో రింగ్రోడ్డు కోసం భూములు తీసుకున్న రైతులకు ఇప్పటి వరకు నగదు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం భూములను తీసుకుంటే ఆ రైతులు కూలీలుగా మారడం ఖాయమన్నారు. రైతుల పొట్టలు కొట్టి రాజధాని నిర్మాణం చేసి తనకు ధనార్జన చేసే రియల్ ఎస్టేట్, హోటళ్లు, వ్యాపారాల కోసమే రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడం జరుగుతుందన్నారు. ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రైతులంతా సంఘటితంగా పోరాడి భూములు కాపాడుకోవాలన్నారు. మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులను కష్టాలలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవడం గతంలో చూశామని, ఇప్పుడు మరలా అదే పరిస్థితి తలెత్తి రైతు కుటుంబాలు ఆందోళనకు గురి అవుతున్నాయన్నారు. సంవత్సరానికి మూడు పంటలు పండి వాటిమీదనే బతికే రైతు ఆ భూములు కాస్తా ప్రభుత్వం తీసుకుంటే వారి బ్రతుకు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తల్లీ బిడ్డను వేరుచేస్తారా..? రైతు సంఘం నాయకులు జొన్నా శివశంకర్ మాట్లాడుతూ రైతుకు భూమిని వేరు చేస్తే తల్లికి బిడ్డను వేరు చేసినట్లేనన్నారు. శివరామకృష్ణ కమిటీ సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా వేల ఎకరాలు రాజధాని పేరుతో సేకరించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని ఆయన విమర్శించారు. రైతులు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తాడని ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ చేయకపోగా ఉన్న భూములను లాక్కొని రాజధాని నిర్మాణాలు చేసుకుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పాటిబండ్ల కృష్ణమూర్తి, బురదగుంట కనకవల్లి, పెనుమాక సొసైటీ అద్యక్షుడు మేకా శివారెడ్డి, రైతులు దంటు గోవర్థనరెడ్డి, గోపాలం ప్రభాకరరావు, బోస్రెడ్డి, కళ్లం వెంకటరెడ్డి, కళ్లం శివారెడ్డి, కళ్లం సంజీవరెడ్డి, దంటు బాలాజీ రెడ్డి, కళ్లం చంద్రశేఖరరెడ్డి, రైతు సంఘాల నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, మోదుగుల శ్రీనివాసరెడ్డి, కాజ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జంగాల సాంబశివరావు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.