breaking news
Allocation funds
-
వ్యవసాయానికి పెద్ద పీట!
రైతుల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు రానున్న బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది. గత బడ్జెట్తో పోల్చితే కేటాయింపులు ఏకంగా 15 శాతం మేర పెరగనున్నట్టు విశ్వసనీయ వర్గాలు అందించిన సమాధారం ఆధారంగా తెలుస్తోంది. ఎరువుల సబ్సిడీల్లో ప్రధానంగా పోషకాధారిత సబ్సిడీకి ప్రాధాన్యం ఇవ్వనుంది. మరిన్ని దిగుబడిని ఇచ్చే వంగడాల అభివృద్ధి, ప్రకృతి అనుకూల వ్యవసాయానికి మరింత మద్దతు అందించనుంది. కేవలం వ్యవసాయమే కాకుండా, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఫిషరీస్ (మత్స్య)కు సైతం ప్రోత్సాహాన్ని కల్పించనుంది. దేశంలో 45 శాతం ఉపాధికి వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారంగా ఉండడం గమనార్హం. దేశ జీడీపీలో ఈ రంగం 15 శాతం వాటా సమకూరుస్తోంది. కనుక వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. నానో, ఆర్గానిక్ ఎరువులకు ప్రోత్సాహం ఎరువుల సబ్సిడీలో పోషకాధారిత ఎరువులకు కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. నేలలోని పోషకాలను కాపాడడం, యూరియా వినియోగాన్ని తగ్గించడం మధ్య సమతుల్యతను తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్హెచ్సీ/భూసారం వివరాలు)ను రైతులకు అందించనుంది. ప్రతి ప్రాంతంలోనూ నేల సారం ఎలా ఉంది, ఆ నేలకు తగ్గట్టు ఎలాంటి పోషకాలు అవసరం అన్న సమాచారం ఈ కార్డుల్లో ఉంటుంది. నానో, ఆర్గానిక్ ఎరువులకు ప్రోత్సాహం దిశగా మరిన్ని చర్యలు బడ్జెట్లో ఉండనున్నాయి. దీని ద్వారా పంటల దిగుబడిని పెంచడంతోపాటు, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించొచ్చు. ఫలితంగా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ప్రభుత్వానికి సబ్సిడీ భారం కూడా తగ్గిపోతుంది. అనుబంధ రంగాలకూ ప్రాధాన్యం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధనలో మోదీ సర్కారు సఫలీకృతం కాలేదు. నాబార్డ్ నివేదిక ప్రకారం.. గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 2016–17 నుంచి 2021–22 మధ్య ఏటా 9.5% కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి చెందింది. అంటే మొత్తం మీద చూస్తే ఈ కాలంలో ఆదాయ వృద్ధి 57 శాతమే పెరిగినట్టు తెలుస్తోంది. ఈ దృష్ట్యా వ్యవసాయేతర రంగాలైన ఫిషరీస్, డైయిరీస్, తేనెటీగల పెంపకం తదితర విభాగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ సరఫరా వ్యవస్థను (కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ తదితర) పట్టిష్టం చేయడం, వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ల బలోపేతంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.అంచనాలు..→ 2024–25 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం 1.52 లక్షల కోట్లు కేటాయించింది. 2025–26 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లకు కేటాయింపులు పెరగనున్నాయి. ఇందులో ఒక్క వ్యవసాయానికి రూ.1.23 లక్షల కోట్లు దక్కనున్నాయి. → సబ్సిడీ సాగు రుణం ఒక్కో రైతుకు రూ.3 లక్షల పరిమితి ఉండగా, దీన్ని రూ.5లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీనికి అదనంగా పంటల బీమాను సైతం పెంచనుంది. → నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్ పథకం కింద కోటి మంది రైతులను సహజ సిద్ధ సాగులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం గతేడాది లక్ష్యాన్ని ప్రకటించింది. వచ్చే బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని ప్రోత్సాహకాలు ఉంటాయన్న అంచనా ఉంది. → దేశీయంగా దిగుబడిని పెంచడం ద్వారా ధరల పెరుగుదలను కట్టడి చేయడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 80 బిలియన్ డాలర్లకు (రూ.6.88 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది. → 2030 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని 30 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు ప్రకటించనుంది. → వచ్చే ఐదేళ్లలో మత్స్యకార రంగానికి → 9 బిలియన్ డాలర్ల నిధుల సాయాన్ని అందించనుంది. → ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు 2027 నాటికి రూ.10,900 కోట్ల రాయితీలను కూడా అందించనుంది. → రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించే చర్యలు 5లక్షలు: ఒక్కో రైతుకు రాయితీతో కూడిన పంట రుణం2030నాటికి వ్యవసాయ ఎగుమతుల లక్ష్యం 80 బిలియన్ డాలర్లు10,900కోట్లు: ఫుడ్ ప్రాసెసింగ్కు రాయితీలు రైతులకు భూసారం కార్డులు – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇక బీఎస్ఎన్ఎల్కు తిరుగుండదు!!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునర్వైభవాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు టెలికం సంస్థలు టారిఫ్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీనికితోడు కేంద్ర బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించడంతో మరింత వినియోగదారులు ఇటువైపు వస్తారని ఇక తిరుగుండదని భావిస్తున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికాం ప్రాజెక్ట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపులో సింహభాగం నిధులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంబంధిత ఖర్చుల కోసమే కేటాయించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెక్నాలజీ అప్గ్రేడేషన్, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లు కేటాయించడం విశేషం.“బడ్జెట్ అంచనా 2024-25లో ఈ డిమాండ్ కోసం మొత్తం నికర కేటాయింపు రూ.1,28,915.43 కోట్లు ( రూ.1,11,915.43 కోట్లు, మరో రూ.17,000 కోట్లతో కలిపి). ఇందలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద లభించే నిల్వల నుంచి రూ.17,000 కోట్ల అదనపు కేటాయింపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు పరిహారం, భారత్నెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి పథకాలకు ఉద్దేశించినది” అని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు.ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ, 5జీ నెట్వర్క్ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీఎస్ఎన్ఎల్కు బడ్జెట్ కేటాయింపులు మరింత ఊపును ఇవ్వనున్నాయి. -
రాష్ట్రానికి మొండిచేయి చూపిన మోదీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపిందని సీపీఎం నాయకులు విజయవాడ బీసెంట్ రోడ్లో తమ నిరసన తెలిపారు. ప్రజలకు మోదీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలు, నూతన రాజధానికి నిధుల ప్రస్తావనే రాలేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రవేటీకరణ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపారని విమర్శించారు. జాతీయ సంపదను కార్పొరేట్ వ్యక్తుల చేతులకు కట్టబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు కొంత ఊరట
రైల్వే లైన్ల సర్వేకు నిధులు మిర్యాలగూడ నుంచి జగ్గయ్యపేట లైన్ సర్వేకు రూ.9.88 లక్షలు మిర్యాలగూడ నుంచి డోర్నకల్ లైన్ సర్వేకు రూ.14.50 లక్షలు స్టేషన్ఘన్పూర్ నుంచి సూర్యాపేట లైన్ సర్వేకు రూ.25.45 లక్షలు ప్రాజెక్టులకు నిధులు మాచర్ల నుంచి నల్లగొండ లైన్ నిర్మాణానికి రూ. కోటి విష్టుపురం నుంచి జాన్పహాడ్ లైన్కు రూ.5 కోట్లు జగ్గయ్యపేట నుంచి మేళ్లచెర్వుకు రూ.100 కోట్లు మేళ్లచెర్వు నుంచి జాన్పహాడ్ లైన్ నిర్మాణానికి రూ.100 కోట్లు నల్లగొండ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు కొంత ఊరట లభించింది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు చేయలేదు. కానీ జిల్లాలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సర్వే చేసేందుకు గాను నిధులు మంజూరు చేసింది. అదే విధంగా ఇప్పటికే జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో ప్రధానంగా విష్ణుపురం నుంచి జగ్గయ్యపేట రైలు మార్గానికి మూడు విభాగాల్లో నిధులు మంజూరు చేసింది. దీంట్లో విష్ణుపురం నుంచి జాన్పహాడ్ రైలు మార్గానికి రూ.5 కోట్లు, జాన్పహాడ్ నుంచి మేళ్లచెర్వుకు రూ.100 కోట్లు, మేళ్లచెర్వు నుంచి జగ్గయ్యపేట రైలు మార్గానికి రూ.100 కోట్లు కేటాయించారు. మొత్తం జగ్గయ్యపేట నుంచి జాన్పహాడ్ వరకు రైలు మార్గం పనులు ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే నల్లగొండ నుంచి మాచర్ల వరకు ప్రతిపాదించిన రైలు మర్గానికి కేవలం కోటి రూపాయలు మాత్రమే కేటాయించడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2013-14 బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణం కోసం నిధులు కే టాయించినట్లు చెప్పారు. కానీ కేంద్రంలో ప్రభుత్వం మారింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే నాగార్జునసాగర్ అభివృద్ధి చెందేది. సర్వేలకు నిధులు ... మిర్యాలగూడెం నుంచి జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వే లైన్లు సర్వే చేసేందుకు రూ.9.88 లక్షలు, మిర్యాలగూడ నుంచి వరంగల్ జిల్లా డోర్నకల్ వరకు రూ.14.50 లక్షలు, సూర్యా పేట నుంచి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు 170 కి.మీ మేర రైల్వే లైన్ సర్వే చేసేందుకు రూ.25.45 లక్షలు కేటాయించారు. అటకెక్కిన పెద్ద ప్రాజెక్టులు.. జిల్లా ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతాయనుకున్న సికింద్రాబాద్- భువనగిరి ఎంఎంటీఎస్ రైలు పొడిగింపు ఊసే కన్పించలేదు. పైగా రైళ్ల రద్దీని తగ్గించుకునేందుకు ఉద్దేశించిన సికింద్రాబాద్- భువనగిరి మూడో రైల్వే లైన్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. మూడో లైన్ సర్వేకోసం నాలుగేళ్ల కింద 50కోట్లు కేటాయించారు. కానీ ఈ సారి దాని ఊసే లేదు. బీబీనగర్- నడికుడి మార్గంలో డ బ్లింగ్, విద్యుదీకరణ పనుల గురించి ప్రస్తావించలేదు. కొత్త ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ప్రయాణికుల్లో దాగి ఉంది. భువనగిరి-ఫలక్నుమా ప్యాసింజర్ రైలు జనగామ వరకు పొడిగింపు పూర్తి స్థాయిలో జరగలేదు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్య కోరినట్లుగా కాచిగూడ వయా సూర్యాపేట విజయవాడ నూతన రైలు మార్గం గురించి ప్రస్తావన రాలేదు. పలు రైళ్లను నిలపాలని ఆయన కోరినా ఫలితం లేదు. భువనగిరి రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం వైఫై సౌకర్యం జిల్లాలోని నల్లగొండ, భువనగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుబాటులోకిరానుంది. ఏ గ్రేడ్, బీగ్రేడ్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొండి చెయ్యి చూపారు రైల్వే బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపింది. డబుల్ లైన్లు, విస్తరణ, కొత్త సర్వీస్లు ప్రారంభిస్తారనే ఆశలు అడియాసలయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేసిన కేంద్రం, దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపినట్టు అయ్యింది. స్వచ్ఛభారత్, క్లీన్ అండ్ గ్రీన్కు ప్రాధాన్యత ఇచ్చింది. సరుకు రవాణా చార్జీలు పెంచడం వల్ల పరోక్షంగా అన్ని రకాల వస్తువులపై ధరల ప్రభావం ఉంటుంది. రైల్వే బడ్జెట్ ఆశాజనకంగా లేదు. - బండా నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నిరాశాజనకంగా ఉన్న బడ్జెట్ ఇది కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చేయూతనందిస్తూ తగిన ప్రాజెక్ట్ల ఏర్పాటుకు కేటాయింపులు జరపాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అంతేగాక జిల్లాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే పనులకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతిపాదనలను పక్కకు పెట్టడం నిరాశకు గురి చేసింది. అదేవిధంగా కనీసం ఒక్క నూతన ప్రాజెక్ట్కు కూడా నిధులు మంజూరు చేయకపోవడం అన్యాయం. విష్ణుపురం- జాన్పహాడ్ రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం మాత్రమే ఆశాజనకంగా ఉంది. - ఐల వెంకన్నగౌడ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రజా వ్యతిరేక బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేవలం పారిశ్రామికవేత్తలకు పెద్దకొడుకుగా వ్యవహరిస్తోంది. మోదీ దేశానికి, రాష్ట్రానికి చేసింది నామమాత్రం. స్వచ్ఛభారత్ పేరుతో ప్రజలందరినీ రోడ్ల మీదకు నె ట్టేసి సంక్షేమ పథకాల అమలను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జె ట్ ఆశాజనకంగా లేదు. మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్. - బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీ అధ్యక్షుడు ప్రతి సారి అన్యాయమే రైల్వే బడ్జెట్లో ప్రతి సంవత్సరం జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. నామమాత్రంగా పెట్టిన నిధులను కూడా విడుదల చేయకుండా పెండింగ్లో పెడుతున్నారు. బడ్జెట్లో కొత్తప్రాజెక్టుల ప్రస్తావనే లేకుండా పోయింది. జిల్లాకు నిధులను రాబట్టడంలో ప్రజాప్రతినిధులు విఫలం చెందారు. -మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాటం ఆగదు రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పీపీఏల ద్వారా ప్రాజెక్టులు చేపడుతామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు నిధులను సమకూర్చుకోలేకపోవడం నిరాశాజనకం. బడ్జెట్లో రూ. 8.50 లక్షల కోట్ల బడ్జెట్ను ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని రాజీలేని పోరాటం చేస్తాం. భువనగిరి వరకు మూడో లైను, ఎంఎంటీఎస్, రాయగిరి స్టేషన్ను యాదగిరిగా మార్పుకోసం ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం. - బూరనర్సయ్యగౌడ్ ,భువనగిరి ఎంపీ బడ్జెట్లో గుండు సున్నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తెలంగాణతో పాటు జిల్లాకు గుండు సున్నా పెట్టింది. పెట్టుబడిదారులకు కొమ్ముకాసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. పేదలపై భారంమోపే విధంగా ఉంది. బడ్జెట్వల్ల పేదలకు ఒరిగేది ఏమీలేదు. - నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మోదం.. ఖేదం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆశించినంత స్థాయిలో లేదు. జిల్లా కేటాయింపు లకు వచ్చే సరికి జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-విష్టుపురం -జాన్పహాడ్ రైల్వే మార్గానికి రూ.100 కోట్లు కేటాయించారు. కానీ నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి కేవలం రూ.కోటిలు మాత్రమే మంజూరు చేశారు. అసంతృప్తి కలిగించే అంశం. - గుత్తా సుఖేందర్రెడ్డి, నల్లగొండ ఎంపీ