breaking news
All India Democratic Womens Association
-
నుదుటిపై తొలిపొద్దు
సీపీఐ (ఎమ్) లీడర్ బృందాకారత్ తలరాతను ఎవరూ మార్చలేరంటారు. కానీ.. అదే తలరాత మీద రూపాయి బిళ్లంత ఉదయించే సూర్యుడు కనబడితే... ప్రతిరోజూ... ఒక అందమైన తొలిపొద్దు అవుతుంది. తలరాతను సైతం మార్చే ఉద్యమ సిందూరం అవుతుంది. బృందాకారత్... రోజూ ఉదయించే ఒక ఉద్యమం! ఎన్డీటీవీ వెబ్సైట్కి కనీసం నెలకొక ఆర్టికలైనా రాస్తుంటారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. దేశంలోని పరిణామాల తీవ్రతను బట్టి ఒక్కో నెలలో రెండు ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఆమె బెంగళూరు అకృత్యాలపై హోమ్ మినిస్టర్ వైఖరిని విమర్శించారు. అదే నెలలో, ‘గిరిజన మహిళలపై అత్యాచారం అన్నది ఒక ఆయుధం అయినప్పుడు...’ అంటూ ఒక వ్యాసం రాసి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఫిబ్రవరిలో... కేరళ నటిపై జరిగిన లైంగిక నేరం... సమాజాన్ని కలవరపరుస్తున్న ధోరణులకు ఒక ప్రతిబింబమని ఆవేదన చెందారు. ఆర్టికల్స్ రాయడం కాకుండా, బృందాకారత్ నిర్వహించే సామాజిక బాధ్యతలు ఇంకా చాలానే ఉన్నాయి. రాజకీయంగా దేశంలోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే కమ్యూనిస్టు కార్యకర్తల్లో బృందా ముఖ్యులు. మహిళా సమస్యలు దేశంలో ఎక్కడ తలెత్తినా మొదట నినదించే గొంతు, మొదట బిగుసుకునే పిడికిలి ఆమెదే! ఇరవై ఏళ్ల వయసు నుంచి పోరాట పథంలో ఉన్న ఈ 69 ఏళ్ల సీనియర్ నాయకురాలు ప్రస్తుతం... బెంగాల్ ప్రభుత్వ అరాచక కృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల టీచర్ల నియామకాలలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ మార్చి 9న విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతున్నప్పుడు వారిలోంచి పోలీసులు నలుగురు విద్యార్థినులను నిర్బంధంలోకి తీసుకుని ‘సెర్చింగ్ రూమ్’లో వారికి నరకం చూపించారు. బట్టలు తీయించారు. పీరియడ్స్లో ఉన్న ఒక యువతినైతే అండర్వేర్ కూడా తీయించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ దారుణంపై బృందాకారత్ ప్రస్తుతం ఉడికిపోతున్నారు. ఇదే విషయాన్ని ఈ నెల ఎన్డీటీవీ ఆర్టికల్ రాస్తూ, ఆరేళ్ల క్రితం ఆదివాసీ మహిళ సోని సోరిపై జరిగిన లైంగిక రాక్షసత్వానికి ఇది ఏమాత్రం తీసిపోని వికృతమైన అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బృందాకారత్ ‘ఐద్వా’ (ఆలిండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్) ఉపాధ్యక్షురాలు. ‘సెర్చింగ్ రూమ్’ ఘటనపై గత కొన్ని రోజులుగా ఐద్వా నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు తీవ్రరూపం దాల్చితే కనుక ఆ ఉద్యమ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు బెంగాల్ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా బృందాకారత్ను అరెస్టు చేయవచ్చు. సాహసోపేతమైన సామాజిక కార్యకర్త బృందాకారత్ గురించి కొన్ని వివరాలు, విశేషాలు. చదువు... ఉద్యోగం... ఉద్యమం బృంద 13 ఏళ్ల వరకు కలకత్తాలో చదువుకున్నారు. అక్కడి నుండి డెహ్రాడూన్లోని వెల్హమ్ వెళ్లిపోయారు. అక్కడి ‘వెల్హమ్ గర్ల్స్ హైస్కూల్’లో చదువుకున్నారు. తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల ‘మిరాండ హౌస్’లో డిగ్రీలో చేరారు. 1967లో డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత లండన్లోని ఎయిర్ ఇండియా శాఖలో నాలుగేళ్లు పనిచేశారు. అక్కడ తప్పనిసరిగా స్కర్ట్లు ధరించాలి. చీర కట్టుకోడానికి లేదు. స్కర్ట్ ను ధరించాలన్న ఆ నిబంధనకు వ్యతిరేకంగా బృంద ఉద్యమించారు. దాంతో ఎయిర్ ఇండియా దిగివచ్చింది. నిబంధనను సడలించింది. స్కర్ట్ అయినా, చీర అయినా చాయిస్ మహిళా సిబ్బందిదే అని ప్రకటించింది! బృంద లండన్లో పనిచేస్తున్నపుడు వియత్నాం యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధ పర్యవసానాలు బృందను సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, అంతకన్నా కూడా యుద్ధ వ్యతిరేకిగా మార్చాయి. లండన్లోని అనేక యుద్ధవ్యతిరేక ప్రదర్శనల్లో కూడా ఆమె పాల్గొన్నారు. 1971లో ఇండియా తిరిగొచ్చి, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.హిస్టరీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా క్యాంపస్లోను, బంగ్లాదేశ్ యుద్ధ శరణార్థుల శిబిరాలలోనూ పనిచేశారు. అప్పుడే పార్టీ పత్రికలో కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత పూర్తికాల కార్యకర్తగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాలు ►కార్మిక సంఘాలలో పని చేయడం కోసం 1975లో ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో సీపీఐ(ఎం)కి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయనే బృందకు ఢిల్లీ శాఖలో సభ్యత్వం ఇచ్చారు. అదే ఏడాది నవంబర్ ఏడున ఆమె పార్టీ కామ్రేడ్ ప్రకాశ్ కారత్ని పెళ్లి చేసుకున్నారు. ► ఢిల్లీలో జౌళిమిల్లు కార్మికుల తరఫున ఢిల్లీ కార్మిక సంఘాల సమన్వయకర్తగా పనిచేశారు. మహిళా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1980లలో అత్యాచార వ్యతిరేక చట్ట రూపకల్పన జరుగుతున్న క్రమంలో బృందా కారత్కు ప్రముఖంగా గుర్తింపు వచ్చింది. అనంతరం సీపీఐ(ఎం) మహిళా విభాగం అయిన ‘ఐద్వా’లో పూర్తి స్థాయి దీర్ఘకాలిక కార్యకర్తగా కొనసాగారు. ►2005లో పశ్చిమబెంగాల్ నుంచి పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలయ్యారు. అదే ఏడాది పార్టీ పొలిట్బ్యూరో తొలి మహిళా సభ్యురాలయ్యారు. ►పొలిట్బ్యూరోలో సభ్యత్వాన్ని బృంద పోరాడి సాధించుకున్నారనే చెప్పాలి. అయితే తన సభ్యత్వం కోసం ఆమె పోరాడలేదు. పొలిట్బ్యూరోలో అసలు మహిళల ప్రాతినిధ్యమే లేకపోవడాన్ని తప్పుపట్టారు. అందుకు ఆగ్రహించిన కేంద్ర కమిటీ ఆమెను తొలగించింది. అయితే అలా తొలగించడం లెనినిస్టు సిద్ధాంతాలకు విరుద్ధం అని గ్రహించి పునర్నియమించుకుంది. ఆ తర్వాతి పరిణామమే పొలిట్బ్యూరోలోకి మహిళల ప్రవేశం. అమ్మానాన్న! బృందాకారత్కు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి అశ్రుకణ చనిపోయారు. అశ్రుకణ అంటే అర్థం తెలిసిందే. కన్నీటి బిందువు. ఎన్నో కన్నీళ్ల నిరీక్షణ తర్వాత పుట్టిందని ఆమెకు ఆ పేరు పెట్టారు. అశ్రుకణ విప్లవవాది! ఆ కాలంలో ఆడవాళ్లకు ఎన్నో లక్ష్మణరేఖలు ఉండేవి. వాటిని దాటి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. ఒకేఒక ఆడకూతురు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆమెకు అడ్డుచెప్పలేదు. చదువుకున్నంతా చదివించారు. బృంద తండ్రి సూరజ్ లాల్. లాహోర్ ఆయన పుట్టినిల్లు. ఉద్యోగం వెతుక్కుంటూ కలకత్తా వచ్చారు. మొదట పోర్ట్ కమిషనర్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించారు. తర్వాత కాలగమనంలో పెద్దపెద్ద కంపెనీలకు డైరెక్టర్ అయ్యారు. ఉద్యమ సిందూరం బీజేపీకి, కమ్యూనిస్టులకు పడదు. మరి బొట్టుకు, బృందాకారత్కు ఎలా పడింది! ఏ కాలం నాటిదీ ప్రశ్న?! అయినా సరే, ఇప్పటికీ బృందను అడుగుతుంటారు. ‘మీరేమో ఉద్యమ వనిత. మీ నుదుటిపై మాత్రం సంప్రదాయ సిందూరం. ఏమిటీ వైరుధ్యం?’ అని. ఈ మాటకు నవ్వుతారామె. సిందూరం వ్యక్తిగతం. ఉద్యమం సామాజికం అనే అర్థం ఆ నవ్వులో కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 17కు ఆమెకు 70 ఏళ్లు నిండుతాయి. కానీ ఆమె చలాకీదనం ఆమె వయసును ఏళ్లుగా ధిక్కరిస్తూ వస్తోంది. నిరంతరం ఆమె ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉండడమే ఆమె అందం, ఆరోగ్య రహస్యం కావచ్చు. అయినా అవిశ్రాంతంగా శ్రమిస్తుండే ఒక సామాజిక కార్యకర్త అందచందాల గురించి అదొక ముఖ్యాంశంగా మాట్లాడుకోవడం సరికాదేమో! కార్మిక సంఘాల నాయకురాలిగా సీపీఐ(ఎం)లోకి వచ్చిన ఈ వామపక్ష యోధురాలు గత ముప్పై ఏళ్లుగా నిరుపేదలు, దళితులు, మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. సర్వకాల సర్వైవల్ మహిళా సమస్యలు, మహిళా ఉద్యమాలపై 2005 ఏప్రిల్లో బృందాకారత్ ఈ పుస్తకం రాశారు. బృంద స్వీయానుభవాలు, సునిశిత పరిశీలనల కలబోతే ‘సర్వైవల్ అండ్ ఇమాన్సిపేషన్’. సుప్రసిద్ధ మార్క్సిస్టు సిద్ధాంతి, రాజకీయ వ్యాఖ్యాత అయిన ఐజీజ్ అహ్మద్ మాటల్లో చెప్పాలంటే... ‘ఇది అరుదైన పుస్తకం. సమాచారం ఇస్తుంది. సూచనలిస్తుంది. స్ఫూర్తినిస్తుంది’. మల్టిపుల్ స్ట్రగుల్స్, గ్లోబలైజేషన్స్ అండ్ సర్వైవల్ ఇష్యూస్, ఆన్ పొలిటికల్ పార్టిసిపేషన్, కమ్యూనలిజం అండ్ ఉమెన్, వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, ఎ పర్సనల్ రిమెంబరింగ్ అనే ఆరు అధ్యాయాలలో ‘స్త్రీల మనుగడ, దాస్యవిముక్తి’ అంశాలను పొందుపరిచారు. వివాదాలు యోగా గురు బాబా రామ్దేవ్... కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఆయన ఉత్పత్తి చేస్తున్న పదార్థాలలో మానవ ఎముకలను మిళితం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని బృందాకారత్ ప్రస్తావించడం వివాదాస్పదం అయింది. శరద్పవార్, ములాయంసింగ్ యాదవ్, అంబికా సోని, నారాయణ్ దత్ తివారీ వంటి రాజకీయ నాయకులు ఈ విషయమై బృందా కారత్పై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బృందను తప్పుపట్టారు. భారతీయ జనతాపార్టీ ఫరీదాబాద్ నాయకుడొకరు ఏకంగా ఆమెకు లీగల్ నోటీసే పంపారు! అశ్రుకణ పెళ్లి పెద్ద సీన్ అయింది బృంద తల్లి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లి నాటికే బృంద అమ్మమ్మ చనిపోయారు. ఆమె తాతయ్యకో పెద్దన్నయ్య ఉన్నాడు. ఆ పెద్దన్నయ్య వాళ్లది కోల్కతాలో పెద్ద పేరున్న కుటుంబం. ఆయనకు బృంద తల్లి కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ పెళ్లికి ఎవరూ వెళ్లడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. దాంతో బృంద... అమ్మగారి వివాహం సుబోద్ మాలిక్ అనే స్వాతంత్య్ర సమరయోధుడి సహాయంతో జరిగింది. సుబోద్ ఇంటికి శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ టాగోర్ వంటి జాతీయ నాయకులు వచ్చి వెళుతుండేవారు. దాంతో ఇంకెవరూ మాట్లాడేందుకు లేకుండాపోయింది. ఆ సమరయోధుడు బృంద తల్లికి బంధువు కూడా. బృందకు ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి. అన్న, అక్క చనిపోయారు. చెల్లి రాధికారాయ్ ఎన్డీటీవీ అధినేత ప్రణయ్రాయ్ భార్య. బృంద సహా పిల్లలంతా తల్లి భావాలకు అనుగుణంగా స్వేచ్ఛగా లౌకికవాదులుగా పెరిగారు. ప్రశ్న – జవాబు మార్క్స్–జ్యోతిబసు ఏ వయసులో మీరు కమ్యూనిస్టు అయ్యారు? 21–23 మధ్య. అంటే 1960ల చివర్లలో. భారతీయ విద్యార్థులు నక్సలైట్ ఉద్యమంలోకి ఉరుకుతున్న సమయం కదా అది! మీరెందుకని కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు? అప్పటికే మార్క్స్ నా మైండ్లో ఉన్నాడు. కళ్లెదుట జ్యోతిబసు ఉన్నారు. సీపీఐ(ఎం)లో చేరిపోయాను. క్రియాశీల కమ్యూనిస్టు రాజకీయాల్లోకన్నా, కార్మిక సంఘాల కార్యాచరణల్లోనే ఎక్కువగా కనిపించారు? నేనొక కమ్యూనిస్టు కార్యకర్తను... అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. అత్యంత అప్రజాస్వామికమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటమే నేను ఎంచుకున్న లక్ష్యం. భారతదేశంలో కమ్యూనిజం విఫలమైనట్లు కనిపిస్తోంది. ఒక కార్యకర్తగా మిమ్మల్ని ఏనాడూ నిరాశ ఆవరించలేదా? నిలబడిపోవడం నిరాశ. నినదిస్తూ సాగిపోవడం కమ్యూనిజం. మేమెక్కడా నిలబడిపోలేదు. -
మద్యం రక్కసిపై మండిపడ్డ మహిళ
తాటిచెట్లపాలెం(విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం(ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, పలు మహిళా సంఘాలు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపాయి. స్థానిక పోర్టు హాస్పిటల్ నుంచి సాలగ్రామపురం పోర్టు హైస్కూల్ మీదుగా డీఎల్బీ కళ్యాణమండపం వరకు ప్రదర్శన నిర్వహించాయి. ‘షాపింగ్మాల్స్లో మద్యం అమ్మకాలా.. సిగ్గు సిగ్గు’ అంటూ మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ‘మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు.. మాకు మంచి నీళ్లు ఇవ్వు బాబూ.. మద్యం దుకాణాలు కాదు’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి సహా ఆందోళనలో పాల్గొన్న పలు మహిళా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బి.ప్రభావతి మాట్లాడుతూ మద్యం వల్ల తల్లి, పిల్ల, చెల్లి అనే ఇంగితం లేకుండా మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈతరహా పాలసీకి గ్రీన్సిగ్నల్ ఇవ్వడం దారుణమన్నారు. ఏపీ సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల మాట్లాడుతూ మహిళల ఆగ్రహం చవిచూసిన ఏ ఒక్క నాయకుడూ ఎంతో కాలం అధికారంలో నిలవలేదని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఆర్.ఎన్.మాధవి, ఎం.వి.పద్మావతి, సుజాత, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు పలువురిపై చేయిచేసుకున్నారు. అరెస్ట్ చేసిన మహిళలను పోలీస్ వాహనాలలో పూర్తిగా ఎక్కించకుండానే వాహన డోర్లను గట్టిగా అదమడంతో కొందరు గాయాలపాలయ్యారు. తోపులాటలో కిందపడిన వారిని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. వారికి దెబ్బతగిలి రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా అలానే వారిని బలవంతంగా వాహనాల్లోకి నెట్టి తరలించారు. -
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి
ఐద్వా నేతల డిమాండ్ విద్యార్థినుల మానవహారం తగరపువలస : అశ్లీల చిత్రాలను తీసి వివాదాలనే పబ్లిసిటీగా చేసుకుంటున్న దర్శకుడు రామ్గోపాల్వర్మను ‘ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్’ చట్టం కింద అరెస్టు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి టి.అరుణ డిమాండ్ చేశారు. ‘సావిత్రి’ సినిమా పోస్టర్లో నెలకొన్న అశ్లీలం వివాదంపై మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో చేపట్టిన మానవహారంలో ఆమె విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు. సెన్సార్ నిబంధనలు కఠినతరం చేసి అసభ్యంగా ఉన్న సావిత్రిలాంటి సినిమాల ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు కె. నాగరాణి మాట్లాడుతూ ఉపాధ్యాయినులను కించపరుస్తూ, బాలల మనోభావాలను కలుషితం చేసేలా సినిమాను నిర్మించటం దారుణమని విమర్శించారు. తొలుత చిట్టివలస శ్రీకృష్ణా డిగ్రీ కళాశాలకు చెందిన వందమంది విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో రామ్గోపాల్వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో ఐద్వా, సిటు నాయకులు బా గం లక్ష్మి, కె. దాక్షాయణి, రవ్వ నరసింగరావు, ఎస్. అప్పలనాయుడు పాల్గొన్నారు. -
మహిళలకు రక్షణ కల్పించాలి
కర్నూలు(న్యూసిటీ): మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ డిమాండ్ చేశారు. కర్నూలు నగర శివారులో శుక్రవారం శ్రావణి అనే యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళలపై హత్యాచారాలు, వేధింపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, నగర సహాయ కార్యదర్శి ఉమాదేవి, అరుణ, రషీద, షెహెనాజ్, తదితరులు పాల్గొన్నారు. నిందితుడిని ఉరి తీయాలి.. శ్రావణి హత్యకు కారకుడైన నిందితుడిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆ సంఘం ఆధ్వరం్యలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం నగర కార్యదర్శి వి.మల్లికార్జున, నాయకులు రవి, శశి, ఇమామ్, వీరాంజనేయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో.. శ్రావణిని హతమార్చిన నిందితుడని శిక్షించాలని కోరుతూ జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మద్దమ్మ మాట్లాడుతూ కర్నూలు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, ఐకేపీ డీపీఎం వసంతకుమారి, జయంతి, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.