Air Defense
-
అగ్రరాజ్యానికో గోల్డెన్ డోమ్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అగ్రరాజ్యం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ, అమేయమైన సైనిక శక్తి.. ఇలా అన్నీ ఉన్నా అమెరికాను సువిశాలమైన, విస్తారమైన భూభాగం భయపెడుతోంది. భూమి ఎక్కువుంటే ఎందుకు భయపడాలనే సందేహం రావొచ్చు. దేశం ఓ మోస్తరు విస్తీర్ణంలో ఉండే ఉన్న భూభాగమంతటికీ సమగ్ర స్థాయిలో రక్షణ కల్పించొచ్చు. అదే విశాల భూభాగమైతే శత్రు దేశ క్షిపణులు ఎక్కడ పడతాయో ఊహించడం కూడా కష్టం. అమెరికాను వేధిస్తున్న ఈ సమస్యకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో చెక్ పెడతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రకటించారు. మొత్తంగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాట్లుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి యావత్ అమెరికా భూభాగాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ స్పష్టంచేసింది. భూమి మీదే కాదు ఆకాశంలోనూ ఇందుకు సంబంధించి లేజర్ కాంతిపుంజం వెదజల్లే వ్యవస్థలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది. ఇంతటి సంక్లిష్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన అసాధారణ వ్యవస్థ నిర్వహణకు రాబోయే 20 సంవత్సరాల్లో ఏకంగా 542 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ప్రస్తుతానికి అమెరికా పార్లమెంట్లో ట్రంప్ తొలి దఫాగా ప్రాజెక్ట్ కోసం కేవలం 25 బిలియన్ డాలర్లు మాత్రమే ప్రతిపాదించారని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది.ఏమిటీ గోల్డెమ్ డోమ్?ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ క్షిపణులను మన భూభాగంపై మోహరించిన సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మార్గమధ్యంలోనే ఆ మిస్సైళ్లను కూల్చేసింది. గాజా భూభాగం మీద నుంచి హమాస్ సాయుధులు సంధించిన వందలాది క్షిపణులను సైతం ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ గగనతల రక్షణ వ్యవస్థ ఇలాగే నేలమట్టంచేసి తమ నేలను కాపాడుకుంది. ఎస్–400, ఐరన్డోమ్లు భూతలం మీద మొహరించిన రక్షణ వ్యవస్థలు. వాహనాలపై బిగించిన రాకెట్ లాంఛర్ ఇందులో కీలకం. అయితే అమెరికా సిద్ధంచేయబోతున్న గోల్డెన్ డోమ్ కాస్తంత భిన్నమైంది. ఇది భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మేళవింపు. లేజర్ కాంతి ఎంతటి కఠినమైన లోహాలనైనా కోసి పారేస్తుంది. ఆకాశంలోని ఉపగ్రహం లాంటి వ్యవస్థ ఈ లేజర్ కాంతి పుంజాన్ని శత్రు క్షిపణులపై ప్రయోగించి వాటిని సెకన్ల వ్యవధిలో నాశనం చేస్తుంది. గోల్డెన్ డోమ్లో ఈ లేజర్కాంతి విభాగమే అత్యంత కీలకమైంది. గోల్డెన్డోమ్లో భాగంగా పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా, దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు.లేజర్ కాంతి, సెన్సార్లు, శాటిలైట్ల సమ్మేళనంఈ గోల్డెన్ డోమ్ను లేజర్ కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాల, క్షిపణుల సమ్మేళనంగా చెప్పొచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం ‘మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్’గా నిలిచిపోనున్నాయి. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సెన్సార్లను భూతలం మీద ఉండే గగనతల రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఫలానా ప్రాంతం నుంచి శత్రు క్షిపణి దూసుకొస్తున్న విషయాన్ని భూతల, గగనతల సమ్మిళిత వ్యవస్థలు గుర్తించి వెంటనే ఆకాశంలోని లేజర్ కాంతిపుంజ విభాగానికి చేరవేస్తాయి. లేజర్కాంతి అవసరంలేని సందర్భాల్లో శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు వెనువెంటనే క్షిపణులను ప్రయోగిస్తారు. సొంత క్షిపణితో పనికాదని నిర్ధారించుకోగానే అత్యంత తీక్షణమైన లేజర్ కాంతిని ఆ శత్రు క్షిపణిపై ప్రసరింపజేస్తారు. నేల మీద మొబైల్ లాంఛర్ నుంచి, యుద్ధవిమానం నుంచి వచ్చే క్షిపణులనూ ఈ లేజర్కాంతి నాశనం చేయగలదు. అలా అమెరికా గగనతలంలో కీలకమైన చోట్ల ఈ లేజర్బీమ్ లైటింగ్ సిస్టమ్స్ను సిద్ధంచేస్తారు. ఈ బహుళ అంచెల వ్యవçస్థలన్నీ ఎల్లవేళలా సమన్వయంతో పనిచేస్తూ అమెరికాను కంటికి రెప్పలా కాపాడతాయి. గోల్డెన్ డోమ్ ముఖ్యంగా నాలుగు పనులు చేస్తుంది. 1. ఫలానా చోట శత్రు క్షిపణి క్రియాశీలకంగా మారిందని గుర్తించగానే అది లాంఛర్ను దాటి బయటికొచ్చేలోపే నాశనంచేస్తుంది. 2. ఒకవేళ అప్పటికే బయల్దేరితే తొలిదశలోనే అడ్డుకుంటుంది. 3. లేదంటే మార్గమధ్యంలో నేలకూలుస్తుంది. 4. అప్పటికీ చేయిదాటిపోతే అది లక్ష్యాన్ని ఢీకొట్టే చిట్టచివరి నిమిషంలోనైనా మిస్సైల్ను మట్టుబెడుతుంది. ఈ పనులను కృత్రిమమేధ ఆధారిత కమాండ్ సిస్టమ్ చూసుకుంటుంది.స్టార్వార్స్ సిద్ధాంతం నుంచి..అంతరిక్షం నుంచి కాంతిపుంజాన్ని ప్రయోగించడమనేది ఇంకా ప్రయోగదశలోనే ఉందని అమెరికా ఎయిర్ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ మంగళవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ, యూఎస్ నార్తర్న్ కమాండ్లు సమష్టిగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై పనిచేస్తు న్నాయి. ‘‘ సంప్రదాయక క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లతోపాటు అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులనూ ఈ గోల్డెన్ డోమ్ విజయవంతంగా అడ్డుకుంటుంది’’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సత్ చెప్పారు. యూఎస్ స్పేస్ఫోర్స్ జనరల్ మైఖేల్ గెటెలిన్ ఈ ప్రాజెక్ట్కు సారథ్యంవహిస్తారు. ఫోర్స్టార్ జనరల్ అయిన గెటెటిన్కు వైమానిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. తాము సైతం ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములుగా చేరతామని కెనడా తన ఆసక్తిని వెల్లడించింది. ఆయుధరంగ దిగ్గజం ‘లాక్హీడ్ మార్టిన్’ సంస్థ గోల్డెన్ డోమ్ ఉపకరణాలను అభివృద్ధిచేయనుంది. 80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్ రీగన్ ‘స్టార్వార్స్’ సిద్ధాంతం, ఇజ్రాయెల్ ఐరన్డోమ్ వ్యవస్థల నుంచే గోల్డెన్ డోమ్ ఆలోచన పురుడుపోసుకుంది. క్షిపణులను అడ్డుకునే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఏగిస్ సిస్టమ్లనూ గోల్డెన్ డోమ్లో వినియోగించనున్నారు.సందేహాలు, అనుమానాలుఇంతవరకు అంతరిక్షంలో పరీక్షించని ఈ వ్యవస్థను కేవలం నాలుగేళ్లలోపు ఎలా అందుబాటులోకి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గోల్డెన్ డోమ్లో పెద్ద సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు, ఏఐ సెన్సార్లు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక రుణభారాన్ని మోస్తున్న అమెరికా సర్కార్ ఈస్థాయి కొత్త భారీ బడ్జెట్ను ఇంత తక్కువ సమయంలో సమకూర్చుకోగలదా? అసలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం తొలినాళ్లలో ఒకేరోజు ఒకేసారి 20 నిమిషాల వ్యవధిలో హమాస్ 5,000 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. వాటిని అడ్డుకోవడంలో ఐరన్డోమ్ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ సంస్థే ఇన్ని మిస్సైళ్లను ప్రయోగించగల్గితే పేద్ద యుద్ధమే వస్తే రష్యాలాంటి దేశం ఇంకెంత స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ శక్తిసా మర్థ్యాలు ఏపాటివో అందుబాటులోకి వస్తేగానీ చెప్పలే మని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.చైనా, రష్యా నుంచి ముప్పు..రష్యా, చైనా తమ ఉపగ్రహాలకు అధునాతన శక్తిసామర్థ్యాలను సంతరింపజేశాయి. అవి అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యంచేయగలవు. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ అవసరం ఏర్పడిందని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. కేవలం అంతరిక్షంలో వాడేందుకు రష్యా ఒక కొత్తతరహా అణ్వాయుధాన్ని తయారుచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ అణ్వాయుధం అంతరిక్షంలో సంచరిస్తూ విడతలవారీగా పేలుతూ సమీప శత్రుదేశ ఉపగ్రహాలను నాశనంచేయగలదని అమెరికా వాదిస్తోంది. అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచనను ఇప్పటికే రష్యా, చైనాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శక్తివంతమైన లేజర్కాంతి వ్యవస్థలను అంతరిక్షంలో ఏర్పాటుచేసి ఉప గ్రహాలు సంచరించే కక్ష్యలను రణక్షేత్రాలుగా మార్చొద్దని ఇరు దేశాలు గోల్డెన్ డోమ్ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి. -
గాల్లో దీపం పాక్ గగనతలం
పాకిస్తాన్పై ప్రళయ భీకరంగా భారత వైమానిక బలగాలు దాడి చేస్తుంటే ఆ దేశ రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి చూసిందన్న వార్త నేపథ్యంలో అసలు ఈ ధూర్తదేశ గగనతలానికి రక్షణ ఉందా? ఉంటే ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్ మోహరించిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి. శతఘ్నులు, యుద్ధ విమానాలు మొదలు జలాంతర్గాములదాకా చాలా రకాల ఆ యుధాలపై పాకిస్తాన్ చైనా మీదనే ఆధారపడు తోంది. గగనతల రక్షణ వ్యవస్థలను సైతం చైనా నుంచే కొనుగోలు చేసింది. పాకిస్తాన్ మోహరించిన హెచ్క్యూ–9పీ, హెచ్క్యూ–16 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనంచేసింది. ము ఖ్యంగా లాహోర్, సియాల్కోట్లలో మోహరించిన హెచ్క్యూ–9పీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత వైమానిక దళాలు ధ్వంసంచేశాయి. చైనా తన కోసం తయారుచేసుకున్న హెచ్క్యూ–9 రకం వ్యవస్థను పాకిస్తాన్ కోసం కాస్త మార్పులు చేర్పులుచేసి ఆ దేశానికి అమ్మేసింది. ‘‘రష్యా తయారుచేసిన ఎస్–300 మిస్సైల్ వ్యవస్థను చైనా తయారీ హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థ పోలి ఉంటుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుపై భారత క్షిపణులు విరుచుకుపడుతున్నా పాకిస్తాన్ గగనతల రక్షణవ్యవస్థలు ఏమాత్రం పసిగట్టలేక పోయాయి. ఇది పూర్తిగా ఎయిర్డిఫెన్స్ వ్యవస్థ వైఫల్యాన్ని అద్దంపడుతోంది’’ అని యుద్ధరంగ నిపుణుడు సందీప్ ఉన్నిథాన్ చెప్పారు. ‘‘ దూసుకొస్తున్న శత్రుదేశాల క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ముందుగా కనిపెట్టాల్సిన గురుతర, కీలక బాధ్యత ఈ ఎయిర్డిఫెన్స్ వ్యవస్థలదే. రక్షణ, వైమానిక స్థావరాల రక్షణకు ఇదే ప్రాణం. అలాంటి వ్యవస్థలే విఫలమైన నేపథ్యంలో త్వరలో భారత్ జరపబోయే దాడులను అడ్డుకునే వ్యవస్థ ఇక లాహోర్, సియాల్కోట్ వంటి చోట్ల లేదనే చెప్పాలి’’ అని ఉన్నిథాన్ వ్యాఖ్యానించారు. అంతా మేకపోతు గాంభీర్యంభారత్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ గతంలోనే ప్రకటించింది. తమ వైమానిక, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఇన్నాళ్లూ పాకిస్తాన్ చేసిన భీష్మ ప్రతిజ్ఞలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమని బుధవారం నాటి భారతదాడితో తేలిపోయింది. అరగంటలోపు రెండు డజన్లకుపైగా క్షిపణులతో భారత్ విరుచుకుపడుతుంటే వాటిని పాక్ గగనతల వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. మూడేళ్ల క్రితం అత్యాధునిక బ్రహ్మోస్కు సంబంధించిన డమ్మీ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లినప్పుడు కూడా పాక్ ఎయిర్డిఫెన్స్ వ్యవస్థ దానిని కూల్చలేకపోయాయి. అటుగా మన క్షిపణి వెళ్లిన విషయాన్ని మొదట స్వయంగా భారతే ప్రకటించింది. ఇప్పుడు లాహోర్, సియాల్కోట్లోనూ ఇదే వైఫల్యం పునరావృతమైంది. 2019లో భారత వైమానిక దాడులు చేసిన బాలాకోట్లో ముష్కరుల స్థావరాలను నేలమట్టంచేసింది. ఆరోజు సైతం భారత గగనతల సంచారాన్ని పాక్ గగనతల వ్యవస్థలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి. వేధిస్తున్న సాంకేతిక సమస్యలుచైనా తయారీ రక్షణ వ్యవస్థలు తరచూ మొరాయి స్తుండటం, రిపేర్లమయం కావడం పాకిస్తాన్కు పెద్ద సమస్యగా తయారైంది. పాకిస్తాన్ తన రక్షణవ్యవ స్థలకు భారీగా నిధులను కేటాయించలేకపో వడమూ ఇందుకు ప్రధాన కారణం. ఉన్న ఆయు« దాలతోనే ఎలాగోలా పాక్ సాయుధబలగాలు నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. గగనతల రక్షణ వ్యవ స్థలను వాస్తవానికి ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాలి. ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం, అప్పులతో కుదేలైన పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థను కొనే ఆర్థిక దమ్ము లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు దాని గగనతల రక్షణ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నాయి.పాకిస్తాన్ వద్ద ఉన్న వ్యవస్థలేంటి?హెచ్క్యూ–9పీ, హెచ్క్యూ–9బీఈ, ఎఫ్ డీ– 2000, హెచ్క్యూ–16ఎఫ్ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్ ఆధా రపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్వై–80, ఎఫ్ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్వై–80ను పాక్ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్ చేసిన దాడిలో హెచ్క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
ఉక్రెయిన్ను కాపాడేందుకు రంగంలోకి అమెరికా!
వాషింగ్టన్: కెర్చ్ వంతెన పేలుడుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు దిగింది రష్యా. ఈ దాడుల్లో 10 మందికిపైగా మృతి చెందారు. మిసైల్స్తో విరుచుకుపడుతున్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు మరోమారు అండగా నిలిచింది అమెరికా. మిసైల్స్ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా క్షిపణి దాడుల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ఫోన్ ద్వారా మాట్లాడారు బైడెన్. ‘అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను అందిస్తామని బైడెన్ భరోసా కల్పించారు. విచక్షణారహిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి బైడెన్ తన సంతాపం తెలిపారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం, యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యుడిగా చేయటానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు.’ అని వైట్హౌస్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. బైడెన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్వీట్ చేశారు జెలెన్స్కీ. రక్షణ సహకారంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కు మా తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కీవ్పై రష్యా భీకర దాడులు -
తైవాన్లోకి 27 చైనా ఫైటర్ జెట్స్.. ఇక బాంబుల వర్షమేనా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యాటనపై మొదటి నుంచే హెచ్చరికలు చేస్తోంది చైనా. జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అయినప్పటికీ.. తైవాన్లో పర్యటించి తిరిగి స్వదేశానికి వెళ్లారు పెలోసీ. తైవాన్ నుంచి పెలోసీ వెళ్లిపోయిన వెంటనే ఆ ద్వీప దేశంపై చర్యలకు ఉపక్రమించింది చైనా. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తైవాన్ గగనతలంలోకి చైనాకు చెందిన 27 ఫైటర్ జెట్స్ ప్రవేశించినట్లు తైపీ ప్రకటించింది. ‘27 పీఎల్ఏ విమానాలు ఆగస్టు 3న తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్ జెట్స్, 5 జే16 జేట్స్ 16 ఎస్యూ-30 జేట్స్ ప్రవేశించాయి. వాటికి ప్రతిస్పందనగా తైవాన్ సైతం తమ ఫైటర్ జెట్స్ను రంగంలోకి దించింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని మోహరించింది. ’ అంటూ ట్వీట్ చేసింది రక్షణ శాఖ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తైవాన్ లెక్కచేయలేదు. దీంతో అతి సమీపంలో ప్రమాదకర మిలిటరీ ప్రదర్శన చేపట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది డ్రాగన్. స్పీకర్ విజిట్పై అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అలాగే.. హైఅలర్ట్ ప్రకటించింది చైనా మిలిటరీ. సైనిక డ్రిల్స్లో భాగంగా లాంగ్ రేంజ్ షూటింగ్ వంటివి ప్రదర్శించింది. దీంతో తైవాన్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. తైవాన్కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు పెలోసీ. 27 PLA aircraft (J-11*6, J-16*5 and SU-30*16) entered the surrounding area of R.O.C. on August 3, 2022. Please check our official website for more information: https://t.co/m1gW2N4ZL7 pic.twitter.com/Aw71EgmRjj — 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) August 3, 2022 ఇదీ చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’
గాజా సిటీ: దాదాపు 500 రాకెట్లు ఒక్కసారిగా దాడి చేస్తే.. ఎంతటి విధ్వంసం జరగాలి. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా తక్కువ నష్టంతో బయటపడింది. ఇదేలా సాధ్యం అంటే ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ను రక్షించిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శత్రుత్వం కొనసాగుతున్న తరుణంలో, సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పైకి 1,050 కి పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్తో దాడులకు తెగబడ్డారు. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ దాదపు 500 రాకెట్లను అడ్డుకున్నట్లు తెలిపింది. ఐరన్ డోమ్ అంటే ఏంటి.. సాధారణంగా తక్కువ దూరాల్లోని శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థే ఐరన్ డోమ్. దీన్ని అమెరికా సాయంతో ఇజ్రాయిల్కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్స్ పది సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసింది. 2011లో దీనిని వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాస్ట్రిప్ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, మోర్టార్ షెల్స్ని ఇది ఎదుర్కొంటుంది. దీని రేంజ్ 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఎలా పని చేస్తుంది.. ఈ వ్యవస్థ మొత్తంలో రాడార్లు,సాఫ్ట్వేర్,రాకెట్ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజాస్ట్రిప్ లో రాకెట్ ప్రయోగించిన వెంటనే రాడార్ పసిగట్టి.. దాని గురించిన సమాచారాన్ని సాఫ్ట్వేర్ వ్యవస్థకు పంపిస్తుంది. టార్గెట్ రాకెట్ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్ను ప్రయోగించదు. ఒకవేళ అది జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్ను ప్రయోగించి శత్రువుల రాకెట్ను గాల్లోనే పేల్చివేస్తుంది. దీని సక్సెస్ రేట్ 90 శాతంగా ఉంది. చదవండి: భర్తతో వీడియో కాల్.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్ The #IronDome is truly a life saver! This is the Iron Dome in action tonight, as rockets are fired at southern #Israel from #Gaza! pic.twitter.com/y4HCyaTntK — Arsen Ostrovsky (@Ostrov_A) May 10, 2021 -
గగనతలందాకా గట్టి నిఘా
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ రాజధాని నగరంలో భారీభద్రతా ఏర్పాట్లు చేశారు. భూఉపరితలం నుంచి గగనతలందాకా గట్టి నిఘా ఉంచారు. ఎర్రకోట పరిసరాల వద్ద భారీఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానమంత్రికి పలు ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు శాఖతోపాటు పారామిలిటరీ బలగాలకు చెందిన దాదాపు 30 వేలమంది భద్రతా సిబ్బందికి నిఘా బాధ్యతలను అప్పగించారు. స్పెషల్ సెల్కు చెందిన ఐదు వేలమంది స్థానిక పోలీసులు కూడా ఈ నిఘా బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపువాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయమై పోలీసు శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తమకు నగరవాసులు అన్నివిధాలుగా సహకరించాలని ఆయన కోరారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ కోటతోపాటు నగరంలోని అత్యంత ఎత్తయిన భవనాలపై ఎన్ఎస్జీకి చెందిన షార్ప్షూటర్లను మోహరించామన్నారు. దీంతోపాటు సత్వర స్పందన బృందాలు (క్యూఆర్ఎస్), బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్. ఎస్డబ్ల్యూటీ, వజ్ర బృందాలను కూడా రంగంలోకి దించామన్నారు. వేదిక సమీపంలో హెలికాప్టర్లతోపాటు ఎయిర్ డిఫెన్స్ మెకానిజంను కూడా సిద్ధం చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 200 సీసీటీ వీ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు. దీంతోపాటు కంట్రోల్రూంను కూడా ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాల వద్ద అదనపు సిబ్బంది ఢిల్లీ మెట్రో, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ల వద్ద సీఐఎస్ఎఫ్కు చెందిన అదనపు బలగాలను మోహరించారు. కాగా ఎర్రకోటకు వచ్చే నగరవాసుల కోసం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీటీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయా ణ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా అల్పాహారం అందించడానికి కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఢిల్లీ బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. మోడీ ప్రసంగం ఆలకించేందుకు నగరం సిద్ధం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఆలకించేందుకు నగరం సన్నద్ధమైంది. ఎర్రకోటపై శుక్రవారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ఎర్రకోటనుంచి ప్రసంగించనున్నారు. మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అనంతరం మోడీ జాతినుద్దేశించి ఎర్రకోటనుంచి ప్రసంగించడం తొలిసారి. మోడీ ప్రసంగం అసాధారణ రీతిలో సాగుతుందని భావిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో ఆయన స్వాతంత్య్ర దినోత్సవాన్ని గొప్ప పండుగగా మార్చివేశారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని చెరగని జ్ఞాపకంగా మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సకల ఏర్పాట్లుచేసింది. 68వ ఇదిలాఉంచితే నగరంలోని అసోలా భట్టి వన్యపరిరక్షణ కేంద్రంలో మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. వారంరోజుల స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఇప్పటికే 4.16 లక్షల మొక్కలను నాటిన సంగతి విదితమే.