breaking news
Abbas Children Home
-
చిన్నారుల అదృశ్యంపై ఆర్జేడీ విచారణ
నకిరేకల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఆశ్రమ చిన్నారుల అదృశ్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజనల్ జా యింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మీ విచారణ జరిపారు. నకిరేకల్ని సంతోష్నగర్లో నివాసముంటున్న ఆశ్రమ నిర్వాహకురాలు కవిత గృహాన్ని ఆర్జేడీ, జిల్లా ఇన్చార్జ్ ఐసీడీఎస్ పీడీ మోతి, సీఐ శ్రీనివాస్రావు సందర్శించారు. నిర్వాహకురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వద్ద ఉన్న ఐదుగురు చిన్నారులు ఐతరాజు విష్నేష్, వేముల సురేష్, వేముల శివ, నోముల రవి, నోముల సాయి విచారించారు. జ్వరం వచ్చిందని.. జ్వరం రావడంతోనే అనాథాశ్రమంలోని 22 మంది చిన్నారులను వారి సంరక్షకులకు అప్పగించి మిగిలిన ఐదుగురు అనాథలను తన వద్ద ఉంచుకున్నట్టు ఆశ్రమ నిర్వాహకురాలు కవిత అధికారులకు వివరణ ఇచ్చింది. కవిత వద్ద ఉన్న ఆ చిన్నారులను నల్లగొండలోని బాలసదన్కు తరలించాలని ఆర్జేడీ ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు. పిల్లలను ఇబ్బంది పెడితే చర్యలు: ఆర్జేడీ ఆశ్రమాల పేరుతో నిరుపేద, అనాథ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రిజినల్ జాయింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి నిధులు వస్తాయని ఆశతో కొంత మంది ఆశ్రమాలు స్థాపించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మోత్కూరులో కూడా అబ్బాస్ పిల్లల ఆశ్రమం నిర్వాహకురాలు కవిత కూడా అదే పని చేయబోయిందని పేర్కొన్నారు. గత జనవరిలో ఇలాంటి ఆశ్రమాలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేశారని గుర్తుచేశారు. అయిన మోత్కూర్ అబ్బాస్ పిల్లల అనాథాశ్రమం నిర్వాహకులు దరఖాస్తులు కూడా చేసుకోలేదన్నారు. ఆశ్రమంలో ఉండాల్సిన పిల్లలు ఇతర ప్రాంతాలకు ఇష్టానుసారంగా తరలించండం చట్టరీత్యా నేరమన్నారు. చీటింగ్ చేసిన కవితపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఆమె వెంట నకిరేకల్, రామన్నపేట సీఐలు శ్రీనివాసరావు, బాల గంగిరెడ్డి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, నకిరేకల్ మోత్కూర్ మండలాల ఐసీడీఎస్ సూపర్ వైజర్లు అరుణశ్రీ, సావిత్రమ్మ, డీసీపీఓ సైదులు ఉన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం : ఓఎస్డీ నల్లగొండ క్రైం : మోత్కూరులోని స్మైల్ చైల్డ్ హోం కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తామని జిల్లా ఇన్చార్జ్ ఏఎస్పీ, ఓఎస్డీ రాధాకిషన్రావు తెలిపారు. కేంద్రంలోని 27 మంది విద్యార్థుల అదృశ్యంపై శనివారం ఆయన స్పందించారు. తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ రికార్డులో ఎక్కువగా చూపించారని తేలిందన్నారు. 22 మంది పిల్లలు చైల్డ్ హోం కేర్ సెంటర్లో ఉండగా 16 మంది పిల్లలు మోత్కూరు మండలానికి సంబంధించిన వాళ్లు కాగా మరో ఐదుగురు పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి డబ్బులు లాగేందుకు ఎక్కువ మంది పిల్లలను చూపించారన్నారు. -
కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయ్యారనే వార్త శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. మునగాలకు చెంది న డి.కవిత, కరీంనగర్ జిల్లాకు చెందిన బాలరాజు మండల కేం ద్రంలో అబ్బాస్ చిల్డ్రన్ హోంను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది చిన్నారులు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఇందులో కోశాధికారిగా ఎం.వెంకటేశ్వర్లు, ట్యూటర్గా ఓర్సు జ్యోతి, ఆయాగా గొలుసుల లక్ష్మమ్మ పనిచేస్తున్నారు. దీని నిర్వహణకు ఫ్రాన్స్ దేశం నుంచి నిధులు వస్తున్నట్టు తెలిసింది. అవి దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ గుట్టు రట్టవుతుందనే నిర్వాహకులు చిల్డ్రన్ హోంను మూసివేసినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు చిల్డ్రన్ హోం నుంచి 27 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని లీగల్సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీస్శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్పీ ప్రభాకర్రావు వెంటనే జిల్లా విద్యాధికారి ఎస్.విశ్వనాథరావును అప్రమత్తంచేశారు. రామన్నపేట సీఐ ఎ.బాలగంగిరెడ్డి, తహసీల్దార్ బి.ధర్మయ్య, ఎంఈఓ జె.సత్తయ్య మూసివేసి ఉన్న చిల్డ్రన్హోం వద్దకు వచ్చి విచారణ జరుపుతున్నారు. చిన్నారులు ఏమైనట్టు..? చిల్డ్రన్హోం ఈ నెల 18వ తేదీ రాత్రి నుంచి మూతబడినట్టు అందులో పనిచేస్తున్న ఆయా గొలుసుల లక్ష్మమ్మ పేర్కొంది. ఈ చిల్డ్రన్ హోంలో వసతి పొందుతున్న సాయికుమార్, వేముల శివకృష్ణ, రవిశంకర్ను నిర్వహకులు బాలరాజు, కవిత గత జూన్ 24న మోత్కూరు పట్టణం గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ చేయించినట్లు ఎంఈఓ విచారణలో తేలింది. దసరా సెలవుల వరకు ఈ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయినట్లు హాజరు రిజిస్టర్లో ఉంది. కాగా, అక్టోబర్ 17,18 తేదీల్లో చిల్డ్రన్హోంలో మీటింగ్లు నిర్వహించినట్లు సీఐ విచారణలో ఆయమ్మ గొలుసు ల లక్ష్మమ్మ తెలిపింది. నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే నేపథ్యంలో నిర్వహకులు చిల్డ్రన్హోం ను మూసివేశారా?, పిల్లలను ఇతర చోటుకు తరలించారా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా, 5 గురు పిల్లలతో కవిత తన తల్లిదండ్రులతో నకిరేకల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన 22 మంది పిల్లలు ఏమయ్యారనే విషయం తేలాల్సి ఉంది.