PM Modi @75: మోదీకి ఆమె స్పెషల్ విషెస్
బీజేపీ అగ్రనేత, భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ, అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయంగా ఆయనకున్న పాపులారిటీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వివిధ దేశాల అధినేతలు సైతం ఆయనకు విషెస్ తెలియజేశారు. అయితే.. అందులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సందేశం ప్రత్యేకంగా నిలిచింది. మీ శక్తి, సంకల్పం, నాయకత్వం లక్షలాది మందికి ప్రేరణ అంటూ మెలోనీ, మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి కలగాలని.. తద్వారా ఆయన భారత్ను ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు నడిపిస్తూ, మా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచగలుగుతారు అని ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారామె. Buon 75° compleanno al Primo Ministro indiano @narendramodi.La sua forza, la sua determinazione e la sua capacità di guidare milioni di persone sono fonte di ispirazione.Con amicizia e stima gli auguro salute ed energia per continuare a guidare l’India verso un futuro luminoso… pic.twitter.com/OqXr1GFlc0— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2025మోదీ ప్రధాని అయ్యాక ఇటలీ-భారత్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో.. ఇరు దేశాల అధినేతల మధ్య స్నేహం గురించి కూడా సోషల్ మీడియా ప్రత్యేకంగా చర్చించుకుంటుంది. జీ7, జీ20, సీవోపీ28.. ఇలా ఏ సదస్సు, భేటీలో కలుసుకున్నా.. వెంటనే #Melodi (Meloni + Modi) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యేది. చివరకు ఆ హ్యాష్ట్యాగ్తోనే మెలోనీ సైతం ట్వీట్లు చేయడం నెటిజన్స్ను మరింత ఆకర్షించింది. 2023లో సీవోపీ-28 సందర్భంగా.. “Melodi టీమ్ నుంచి హాయ్” అంటూ మెలోనీ పోస్ట్ చేయగా.. దానికి జై హో ఇండియా–ఇటలీ స్నేహం! అని మోదీ స్పందించారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీలు, హాస్యభరిత సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. జార్జియా మెలోనీ 1977 జనవరి 15న ఇటలీ రాజధాని రోమ్లో జన్మించారు. 2022 అక్టోబర్ 22న ఇటలీ అధ్యక్ష బాధత్యలు చేపట్టి.. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. మెలోనీకి వివాహం కాలేదు, కానీ 2015 నుంచి ఆండ్రియా జియాంబ్రూనో అనే టెలివిజన్ జర్నలిస్టుతో సహజీవనం చేశారు. వీళ్లకు ఓ పాప ఉంది. ఓ టీవీ షోలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశాడనే కారణంతో 2023 అక్టోబర్లో జియాంబ్రూనోతో మెలోనీ విడిపోయారు. తన కుమార్తె భద్రత, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమయంలో ఆమె ప్రకటించారు.