
భారత్లో ఏసీలకు గరిష్ట-కనిష్ట ఉష్ణోగ్రతల పరిమితి నిబంధన (New temperature Limit) తప్పనిసరి కానుంది. త్వరలో మార్కెట్లోకి రాబోయే కొత్త ఏసీలన్నీ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతతో మాత్రమే పని చేస్తాయి. ఇలా డిఫాల్ట్ సెట్ ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని, డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేయొచ్చని, అన్నింటికి మించి వేసవిలో పవర్ గ్రిడ్లపై పడే భారమూ తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది.

సాధారణంగా మన దేశంలో ఏసీల టెంపరేచర్ 16-30 డిగ్రీల మధ్య ఉండేది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(BEE) ప్రకారం 24 డిగ్రీల సెల్సియస్ సెట్టింగ్ ఉండడం మంచిదని అప్పట్లో సూచించింది. అది తప్పనిసరిగా ఉండేది కాదు. అయితే ఇకపై అలా కుదరదు. అతి త్వరలో ఏసీలపై బీఈఈ కొత్త టెంపరేచర్ లిమిట్ అమల్లోకి రానుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏసీల టెంపరేచర్ 20 డిగ్రీల నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే పని చేయాలి(డిఫాల్ట్ సెటప్). ఎయిర్ కండిషనర్ల టెంపరేచర్ కనిష్టంగా 20°C నుంచి గరిష్టంగా 28°C మధ్య పరిమితం కానుంది. తద్వారా విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా భారీ ప్రయోజనం కలుగుతుందని కేంద్రం నమ్ముతోంది. అంతేకాదు.. ఈ కొత్త ఏసీ టెంపరేచర్ నిబంధన ద్వారా వినియోగదారులకు 3 ఏళ్లలో రూ.18వేల నుంచి రూ.20వేల కోట్ల వరకు డబ్బు ఆదా అవుతుందని అంచనా వేస్తోంది.

కేవలం ఇళ్లలోనే కాదు.. ఇళ్లు, ఆఫీసులు, మాల్స్, హోటల్స్, సినిమా థియేటర్లు.. అలాగే కార్లు, బస్సులు, రైళ్లు.. ఇలా ప్రజారవాణా వ్యవస్థలోనూ అన్ని ఏసీలకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఏసీలలో డిఫాల్ట్ టెంపరేచర్ సెటప్ నిబంధనలను ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.

ఇటలీలో ఆపరేషన్ థెర్మోస్టాట్ ప్రకారం టెంపరేచర్ 27°C కంటే తక్కువగా ఉండకూడదు. అలా కాని పక్షంలో జరిమానాలు విధిస్తారు. స్పెయిన్లో ఏసీలు 27°C మీద, అంతకంటే ఎక్కువ టెంపరేచర్లో పని చేయాలి. అయితే ఇది అక్కడి ఇళ్లకు మాత్రం వర్తించదు. గ్రీస్లోనూ ఇదే టెంపరేచర్లో ఏసీలు పని చేయాలి. జపాన్లో ‘కూల్ బిజ్’ పేరిట 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్లేస్ల్లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే.. అది చట్టపరమైన నిబంధనేం కాదు. అమెరికా స్టేట్ కాలిఫోర్నియాలో విద్యుత్ ఆదా పేరిట కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి నిబంధనలేవీ లేవు. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో ఏసీ టెంపరేచర్ లిమిట్ నిబంధనలు అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది.

భారత్లో ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేదానిపై స్పష్టత లేదు. కానీ, వీలైనంత త్వరలోనే అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏసీ తయారీదారు కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఏసీ టెంపరేచర్లలో మార్పులు చేయడానికి వీల్లేకుండా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంశాన్ని పరిశీలించాలని కోరుతోంది. అలాగే.. ఇప్పటికే ఉన్నవాటి విషయంలో మాత్రం కచ్చితంగా ఇదే టెంపరేచర్ను అమలు చేయించాలని భావిస్తోంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనేదానిపై ఇప్పుడే స్పష్టత రాకపోవచ్చు. అయితే ఫైన్లు కచ్చితంగా ఉండొచ్చని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కొత్త రూల్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయట. ఇందుకోసం తొలుత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ తర్వాతే ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించాలని భావిస్తోందట!.

కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ అనే అధికారి మాట్లాడుతూ.. భారత్లో ఏసీల సంఖ్య 100 మిలియన్లు దాటేసింది. ప్రతీ ఏడాది దాదాపు 15 మిలియన్ల కొత్త ఏసీలు బిగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిన్న చిన్న మార్పులతో అద్భుతాలే సాధించవచ్చు. భారత్లో విద్యుత్ వినియోగం 241 గిగా వాట్స్కు దాటేసింది. ఎయిర్ కండిషనర్లతోనే 50 గిగా వాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది.ఇది దేశం మొత్తం వినియోగించే మాగ్జిమమ్ కరెంట్లో ఐదింట ఒకటో వంతు.

ఈ తరుణంలో ఏసీలో 1°C పెంచినా.. 6 శాతం విద్యుత్ వినియోగం ఆదా అవుతుంది. అదే పీక్ అవర్లలో అయితే ఏకంగా 3 గిగావాట్ల విద్యుత్ దాకా ఆదా చేయొచ్చు. మరీ ముఖ్యంగా వేసవిలో పవర్ గ్రిడ్లపై భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇదే విషయాన్ని పలు అధ్యయనాల నివేదికలు పేర్కొన్నాయి అని పంకజ్ చేసిన వ్యాఖ్యలను బ్లూమ్బర్గ్ ప్రముఖంగా ప్రచురించింది.

నిబంధనను కఠిన తరం చేయడం ద్వారా పీక్ డిమాండ్ను 2035 నాటికి 60 గిగావాట్ల విద్యుత్ను ఆదా చేయొచ్చు. అయితే.. 60 గిగావాట్లకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?.. సుమారు 7.5 ట్రిలియన్ రూపాయలు. తద్వారా పవర్ప్లాంట్లు, గ్రిడ్ వ్యవస్థల నిర్మాణం అవసరం ఉండదు.

కిందటి ఏడాది 250 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది 270 గిగావాట్లకు చేరింది. ఈ మే నెలలో వర్షాలు పడ్డాయని అనుకున్నప్పటికీ.. జూన్లో వడగాల్పుల ప్రభావంతో జనాలు ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే అధికంగా ఏసీల వినియోగం వల్ల అధిక డిమాండ్తో పాటు కరెంట్ కోతలు తప్పడం లేదు. తాజా.. ఏసీ లిమిట్ నిబంధనలతో ఆ బాధలన్నీ తప్పుతాయి.

భారత్ తీసుకొచిన ఏసీ టెంపరేచర్ కొత్త రూల్పై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మీమ్స్తో మీమర్స్ చెలరేగిపోతున్నారు. అసహనంతో పలువురు జోకులు కూడా పేలుస్తున్నారు. ఆధార్తో ఏసీలను లింకు చేసేయమని కేంద్రాన్ని కోరుతున్నారు. ఏసీ 20°C కంటే తక్కువ సెట్ ేస్తే అరెసట్ ేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనను అమలు చేసి తీరతామని అంటోంది.