ములాయం, అఖిలేశ్‌ తాజా పోరు | UP: Akhilesh Yadav and Mulayam Singh Yadav schedule separate meetings with new MLAs | Sakshi
Sakshi News home page

ములాయం, అఖిలేశ్‌ తాజా పోరు

Mar 28 2017 7:10 PM | Updated on Aug 25 2018 5:02 PM

ములాయం, అఖిలేశ్‌ తాజా పోరు - Sakshi

ములాయం, అఖిలేశ్‌ తాజా పోరు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా సమాజ్ వాదీ పార్టీలో ‘పరివార్’ పంచాయతీ తేలలేదు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా సమాజ్ వాదీ పార్టీలో ‘పరివార్’ పంచాయతీ తేలలేదు. ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలన్న దానిపై తండ్రీకొడుకు ములాయం, అఖిలేశ్‌ యాదవ్ మధ్య పోరు మొదలైంది. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో తండ్రీకొడుకు వేర్వేరుగా సమావేశం కావాలని నిర్ణయించడమే ఇందుకు తాజా రుజువు. అఖిలేశ్‌ మంగళవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ‘పెద్దాయన’ నిర్ణయించారు.

మాజీ మంత్రి రామగోవింద్ చౌదరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని అఖిలేశ్‌ భావిస్తుండగా, ములాయం తన సోదరుడికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. తన సోదరుడు శివపాల్ యాదవ్ ను ప్రతిపక్ష నాయకునిగా ఎంపిక చేయాలని ములాయం తలపోస్తున్నారు. పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కూడా విపక్ష నేత రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ములాయం, అఖిలేశ్‌ విడివిడిగా కొత్త ఎమ్మెల్యేలతో మంతనాలు జరపాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 325 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి 54 స్థానాలకే పరిమితమైంది.

Advertisement
 
Advertisement
Advertisement