
'ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు తెలుసు'
ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసునని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.
జైపూర్: ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసునని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ప్రధానమంత్రిని నియంత్రించాలని చూడొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితబోధ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని రద్దు చేయాలని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి బుధవారం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
ఈ నేపథ్యంలో రాంమాధవ్ స్పందించారు. ప్రధాని ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం విపక్షాలకు లేదని అన్నారు. ప్రతిపక్షాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. జైపూర్ లో ఇండియన్ యూత్ పార్లమెంట్ నిర్వహించిన 'యువ మోర్చా' కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొన్నారు.