పాక్‌ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత | PIA plane crash: 43 bodies recovered; Pakistani pop star on board | Sakshi
Sakshi News home page

పాక్‌ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత

Dec 7 2016 11:47 PM | Updated on Apr 3 2019 5:32 PM

పాక్‌ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత - Sakshi

పాక్‌ విమాన దుర్ఘటన: మృతదేహాల వెలికితీత

పీకే-661 విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వెలికి తీశారు. పాప్‌ సంచలనం జునైద్‌ జంషీద్‌ కూడా అదే విమానంలో ఉన్నాడు..

 48 మంది దుర్మరణం
  అబోటాబాద్ పర్వత ప్రాంతంలో ప్రమాదం

 
 ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బుధవారం అబోటాబాద్ సమీపంలోని పర్వతాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో 48 మంది మరణించారు. ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులోని చిత్రల్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన పీకే-661 అనే విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తి హవేలియన్‌లోని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపాన సద్ధా బటోల్ని గ్రామం దగ్గర్లో కూలిపోయింది. అనంతరం విమానం నుంచి మంటలు పైకి ఎగిశాయని విమానయాన శాఖ అధికారి తెలిపారు. విమాన ప్రమాదాల గురించి తెలిపే ఏవియేషన్ హెరాల్డ్ అనే వెబ్‌సైట్ కూడా ఇంజిన్‌లో సమస్య వల్లే విమానం కూలిపోయిందని తెలిపింది. విమానంలో ఉన్న వారందరూ చనిపోయారనీ, ఇప్పటిదాకా 36 మృతదేహాలను వెలికితీశామని పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.
 
  పీకే-661 విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్రల్ నుంచి బయలుదేరింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్లామాబాద్‌లోని బెనజీర్ భుట్టో విమానాశ్రయాన్ని చేరుకోవాల్సి ఉంది. అంతలోనే ఘోర దుర్ఘటన సంభవించింది. ప్రముఖ పాప్ గాయకుడిగా పేరు తెచ్చుకుని తర్వాత ఇస్లాం మత బోధకుడిగా మారిన జునైద్ జంషెద్, ఆయన భార్య కూడా ప్రమాదంలో మృతి చెందారు. 52 ఏళ్ల జునైద్ మత ప్రచారానికి సంబంధించిన పనిపై చిత్రల్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విమానం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎరుుర్‌లైన్‌‌స (పీఐఏ)కు చెందినది.


 
  ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 42 మంది ప్రయాణికులు (వారిలో 9 మంది మహిళలు, ఇద్దరు శిశువులు, ముగ్గురు విదేశీయులు), ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లు, ముగ్గురు పైలట్లు, ఒక ఇంజినీర్ ఉన్నారు. విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయే కొద్ది సేపటి ముందు.. తాము ప్రమాదంలో ఉన్నామనీ, సహాయం కావాలనే సంకేతాలను పైలట్లు ట్రాఫిక్ నియంత్రణ విభాగానికి పంపారని అధికారులు తెలిపారు. ఈ విమానం పదేళ్ల నుంచి సేవలు అందిస్తోందనీ, మంచి కండిషన్‌లోనే ఉందని తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ప్రమాదం కొండ ప్రాంతంలో జరిగినందున మృతదేహాల తరలింపునకు ఎక్కువ సమయం పడుతోందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.
 
  పాక్‌లో గత ప్రమాదాలు
  2012లో భోజా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737 కూలి  121 మంది మృతి.
 
  2010లో ఎయిర్ బ్లూ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ 321 విమానం కూలిపోరుు 152 మంది చనిపోయారు.
 
 1992లో పీఐఏకు చెందిన ఎయిర్‌బస్ ఏ300 విమానం కూలి 167 మంది మరణించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement