యాజమాన్యంలో చెడ్డవారివల్లే సమస్యలు | NSE bars four National Spot Exchange Ltd defaulters from trading | Sakshi
Sakshi News home page

యాజమాన్యంలో చెడ్డవారివల్లే సమస్యలు

Aug 27 2013 2:27 AM | Updated on Sep 1 2017 10:08 PM

యాజమాన్య టీమ్‌లోని కొంతమంది చెడ్డ వ్యక్తులవల్లే చెల్లింపుల సంక్షోభం ఎదురైందని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) బోర్డు మాజీ సభ్యులు తాజాగా ఆరోపించారు.

న్యూఢిల్లీ: యాజమాన్య టీమ్‌లోని కొంతమంది చెడ్డ వ్యక్తులవల్లే చెల్లింపుల సంక్షోభం ఎదురైందని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) బోర్డు మాజీ సభ్యులు తాజాగా ఆరోపించారు. ఇటీవల రాజీనామా చేసిన సంస్థ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శంకర్‌లాల్ గురుతోపాటు,  బీడీ పవార్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. వీరిరువురితోపాటు మరో డెరైక్టర్ రామనాథన్ దేవరాజన్ గత వారం బోర్డుకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం బోర్డులో ఇద్దరే మిగిలారు. ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డులో ప్రస్తుతం ప్రధాన ప్రమోటర్ జిగ్నేష్ షా, జోసఫ్ మెస్సీ మాత్రమే మిగిలారు.
 
 కాగా, కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపులను సెటిల్ చేయలేక ఎన్‌ఎస్‌ఈఎల్ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఈవో అంజనీ సిన్హాతోపాటు మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన మేనేజ్‌మెంట్ టీమ్‌ను తొలగిస్తూ ఇటీవలే ఎన్‌ఎస్‌ఎఈల్ బోర్డు నిర్ణయం తీసుకుంది కూడా. ఈ నెల 7నే రాజీనామా: ఎన్‌ఎస్‌ఈఎల్ బోర్డుకి ఈ నెల 7న రాజీనామా చేశానని గురు చెప్పారు. ఎక్స్ఛేంజీ కార్యకలాపాలలో వ్యవసాయ మార్కెటింగ్‌ను ప్రోత్సహించే కార్యక్రమాన్ని(మిషన్) కొనసాగించడంలేదని తనతోపాటు, బీడీ పవార్ కూడా భావించారని గురు పేర్కొన్నారు.
 
 ఎక్స్ఛేంజీలో ఈ స్థాయి కుంభకోణం జరగడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో తనకు ఏ విధమైన సంబంధమూ లేదని చెప్పారు. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ లేదా ఎక్స్ఛేంజీని నడిపే విషయంలో నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. సీఈవో ఆధ్వర్యంలోని టీమ్ ఈ విషయాలను చూసుకుంటుందని చెప్పారు. చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు, యాజమాన్య టీమ్‌లోని చెడ్డ వ్యక్తులను శిక్షించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement