కూతురితో అఫైర్ ఉందని.. చంపి పూడ్చేశారు!

కూతురితో అఫైర్ ఉందని.. చంపి పూడ్చేశారు! - Sakshi


ఆ రెండు కుటుంబాలు రెండు దశాబ్దాలుగా స్నేహంగా ఉంటున్నాయి. హిందూ ముస్లింలే అయినా ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. ముజఫర్నగర్ అల్లర్ల సమయంలోనూ వాళ్ల స్నేహం చెక్కు చెదరలేదు. కానీ.. ఒక్క విషయంతో విభేదాలు భగ్గుమన్నాయి. పక్కవాళ్ల కొడుకు (14) తమ ఇంట్లో కూతురితో (15) సంబంధం పెట్టుకున్నాడని.. అతడిని చంపి తమ ఇంట్లోనే పూడ్చేశారు! ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లా కవాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. స్కూల్లో చదువుకుంటున్న ఎర్షాద్ అనే పిల్లాడి మృతదేహాన్ని పొరుగున ఉండే శ్రీపాల్ సైనీ ఇంట్లోంచి తవ్వితీశారు. అమ్మాయి సోదరులు ఇద్దరితో పాటు మరో బంధువును పోలీసులు అరెస్టు చేశారు.



స్కూలుకు అని వెళ్లిన తన కొడుకు ఎర్షాద్ కనిపించడం లేదని అంతకుముందు షకీల్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకుముందెప్పుడూ అతడు అలా కనిపించకుండా లేడు. కొన్నిరోజుల క్రితం ఎర్షాద్, మరో అమ్మాయి కలిసి వెళ్తుండగా చూశామని స్నేహితులు చెప్పారు. దాంతో ఆ అమ్మాయి ఎవరని ఆరా తీసిన పోలీసులు.. వెంటనే శ్రీపాల్ సైనీ ఇంటి ఆవరణను గాలించారు. ఎర్షాద్ సెల్ఫోన్ కాల్ రికార్డులు చూస్తే అతడు ఆ అమ్మాయితో తరచు మాట్లాడుతున్నట్లు తేలిందని ఎస్ఎస్పీ దీపక్ కుమార్ చెప్పారు. ఆమె సోదరులను గట్టిగా ప్రశ్నిస్తే విషయం బయటపడిందన్నారు. మృతదేహాన్ని వెలికి తీసి, అమ్మాయి సోదరులు మోహన్ సైనీ, పవన్ సైనీలతో పాటు వారి బంధువును కూడా అరెస్టు చేశామన్నారు. తమ పక్కింట్లో ఉండేవాళ్లే ఇలా చేస్తారని ఊహించలేదని అహ్మద్ వాపోయారు. వాడు చాలా చిన్న పిల్లాడని, అంత దారుణంగా ఎలా చంపేశారని కన్నీరు మున్నీరయ్యారు. అయితే.. ఇది మతఘర్షణల రూపం దాల్చకముందే కేసులో వాస్తవాలను బయటపెట్టేందుకు తాము కాలంతో పోటీపడి పరుగులు తీశామని పోలీసులు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top