రాజధానిలో మరో నిర్భయ.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం | Married woman gang raped in moving car in Delhi | Sakshi
Sakshi News home page

రాజధానిలో మరో నిర్భయ.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం

Oct 26 2013 5:18 PM | Updated on Oct 17 2018 5:51 PM

నిర్భయ లాంటి ఘటనే మరొకటి మళ్లీ దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో జరిగింది. పాతికేళ్ల వివాహిత మహిళపై కదులుతున్న కారులో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

నిర్భయ సంఘటన తర్వాత దేశ రాజధాని సహా అన్ని ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడినా ఇప్పటికీ మహిళలకు రక్షణ ఉండట్లేదు. నిర్భయ లాంటి ఘటనే మరొకటి మళ్లీ దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో జరిగింది. పాతికేళ్ల వివాహిత మహిళపై కదులుతున్న కారులో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వారిలో ఇద్దరు సాహిబాబాద్ ప్రాంతానికి చెందిన ఓ భూస్వామి కొడుకులు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

అత్యాచారం చేసిన తర్వాత వారు నలుగురూ ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి అక్కడినుంచి పారిపోయారు. తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదైంది. ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో నివసించే ఆ మహిళ అర్తాలా ప్రాంతంలోని ఓ దర్గాలో ప్రార్థనలు చేసుకోడానికి ఒంటరిగా వచ్చింది. తన ఇంటి యజమాని కొడుకు హేమంత్ లాలా, మరో ఇద్దరు తనను వెంబడించారని, తాను తిరిగి వెళ్లేటప్పుడు ఒంటరిగా ఉండటంతో తమ కారులోకి లాగేసి తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తర్వా హిందన్ నది సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను వదిలి పారిపోయారు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే బాగోదని కూడా వారు బెదిరించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేశామని, ఆ నివేదికలు ఇంకా రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.  నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement