యూపీఏ ప్రభుత్వం ఎంతగానో పట్టుబట్టిన భూసేకరణ బిల్లును లోక్ సభ గురువారం ఆమోదించింది.
యూపీఏ ప్రభుత్వం ఎంతగానో పట్టుబట్టిన భూసేకరణ బిల్లును లోక్ సభ గురువారం ఆమోదించింది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ముఖ్యమైన బిల్లు ఇది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువపై నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. నిర్వాసితులను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఎప్పుడో బ్రిటిష్ వారి పాలనాకాలంలో 1894లో ప్రవేశపెట్టిన పురాతన కాలం నాటి భూసేకరణ చట్టాన్ని చెత్తబుట్టలోకి విసిరేసి, దాని స్థానంలో భూసేకరణలో సరైన పరిహారం పొందే హక్కు, పారదర్శకత, పునరావాస బిల్లుగా దీన్ని పిలవనున్నారు. ఈ బిల్లుపై గురువారం లోక్సభలో జరిగిన ఓటింగ్లో మొత్తం 235 మంది పాల్గొనగా, అనుకూలంగా 216 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓట్లు వేశారు. ఇది చాలా చారిత్రకమైన ముందడుగని, తొలిసారిగా భూసేకరణలో పారదర్శకతను ఇది తీసుకొస్తుందని కాంగ్రెస్ ఎంపీ మీనాక్షి నటరాజన్ అన్నారు.