
'జరగబోయేది మీరే చూస్తారు'
టీడీపీలో తనకు అన్యాయం జరగలేదని, తనకు ఎవరూ వెన్నుపోటు పొడవలేదని ఎంపీ గుండు సుధారాణి అన్నారు.
న్యూఢిల్లీ: టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా ఆ పార్టీ ఎంపీ గుండు సుధారాణి అడుగులు వేస్తున్నారు. బుధవారం ఆమె ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి, తెలంగాణ బిడ్డగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను కలిసినట్టు ఆమె తెలిపారు. వాటర్ గ్రిడ్ లాంటి పథకాలను అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపేందుకే కేసీఆర్ ను కలిశానని అన్నారు.
పదవులు శాశ్వతం కాదని, వాటి కోసం తాను పాకులాడడం లేదని ఆమె అన్నారు. టీడీపీలో తనకు అన్యాయం జరగలేదని, తనకు ఎవరూ వెన్నుపోటు పొడవలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. ' జరగబోయేదాన్ని మీరే చూస్తారు. బ్రాహ్మలకు తెలవకుండా పెళ్లైతే కాదు కదా' అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గురువారం టీఆర్ఎస్ పార్టీలో సుధారాణి చేరతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.