సరిహద్దు అంశంపై భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఓ విషయంలో మాత్రం మన దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది.
బీజింగ్: సరిహద్దు అంశంపై భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఓ విషయంలో మాత్రం మన దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తొలిసారి విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను తయారు చేసుకోవడాన్ని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ఈ చర్య ద్వారా దేశీయంగా అత్యాధునిక ఆయుధాల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్లయిందని పేర్కొంది.
దేశీయంగా ఆయుధాల ఉత్పత్తిలో భారత ప్రభుత్వం ప్రాథమిక విజయం సాధించిందని ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం తెలియజేస్తోందని కొనియాడింది. దీనికితోడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ను భారత్ ప్రారంభించడం వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉందని పత్రిక అంచనా వేసింది.