
సోనియా బాధ్యురాలు: బాబు
లోక్సభలో చోటుచేసుకున్న పరిణామాలు, పరాకాష్టకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యురాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆమెకు అనుభవమూ, పరిపక్వత లేదని విమర్శించారు.
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో చోటుచేసుకున్న పరిణామాలు, పరాకాష్టకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యురాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆమెకు అనుభవమూ, పరిపక్వత లేదని విమర్శించారు. పార్లమెంటులో ఇంత జరిగినా సోనియా, ప్రధాని మన్మోహన్, రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. లోక్సభ పరిణామాలకు ముగ్గురూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదేం సోనియా రాజ్యం కాదని దుయ్యబట్టారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణను బాబు గురువారం పరామర్శించారు. అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఢిల్లీలో కూర్చొని నిర్ణయం తీసుకోడానికి వీరెవరని ప్రశ్నించారు. ఎస్సార్సీ, కమిషన్, కమిటీలు, అసెంబ్లీ తీర్మానాల ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారని, కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఓట్లు, సీట్లు, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని ధ్వజమెత్తారు. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయన్నారు. దొంగల వలే టేబుల్ ఐటమ్గా బిల్లు పెట్టారని, బిల్లు కోసం అంత రహస్యమెందుకని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రులు వెల్లోకి వచ్చి సభలను అడ్డుకుంటే వారిని నియంత్రించలేకపోయారన్నారు. స్పీకర్ ప్రవర్తన బాధాకరమన్నారు. గొడవల మధ్య బిల్లులను చదివి పాసు చేయడంలో స్పీకర్ చూపిన ఉత్సాహం సభ్యులను కాపాడడంలో చూపలేదని విమర్శించారు. మోదుగుల మైకు పట్టుకుంటే కత్తి పట్టుకున్నారని మంత్రి కమల్నాథ్ అనడం దుర్మార్గమన్నారు. సోనియా ఇటాలియన్ గాంధీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.