చలో హైదరాబాద్ | Chalo Hyderabad! | Sakshi
Sakshi News home page

చలో హైదరాబాద్

Jan 18 2016 3:53 AM | Updated on Aug 28 2018 4:00 PM

చలో హైదరాబాద్ - Sakshi

చలో హైదరాబాద్

సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లిన వారంతా హైదరాబాద్ బాట పట్టడంతో విజయవాడ-హైదరాబాద్, కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారులపై ఆదివారం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.

* సెలవులు ముగియడంతో నగరబాట పట్టిన జనం
* టోల్‌ప్లాజాల వద్ద ‘జామ్’జాటం
* కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

చౌటుప్పల్/షాద్‌నగర్/సాక్షి, విజయవాడ బ్యూరో: సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లిన వారంతా హైదరాబాద్ బాట పట్టడంతో విజయవాడ-హైదరాబాద్, కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారులపై ఆదివారం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో తీవ్ర ట్రాఫిక్ జామై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై సాధారణ రోజుల్లో రోజుకు 17వేల వాహనాలు తిరుగుతుండగా, ఆదివారం 32వేల వాహనాలు రాకపోకలు సాగించాయి.

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, ఇటు మహబూబ్‌నగర్ జిల్లాలోని రాయికల్, అడ్డాకుల, అలంపూర్ టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మరోవైపు రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ఏపీలోని కాకినాడ, మచిలీపట్నం, తాడేపల్లిగూడెం, నరసాపురం, గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం ఒక్కరోజే 10 ప్రత్యేక రైళ్లు నడిపింది. సోమ, మంగళవారాల్లో కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది.

సోమవారం నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనుండటం, కార్యాలయాలకు వెళ్లాల్సిరావడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది గమ్యస్థానాలవైపు పయనమయ్యారు. తణుకు, కల పర్రు, పొట్టిపాడు, కీసర, గట్టు భీమవరం టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు గంటల సేపు నిలిచిపోయాయి.  ఆదివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు గట్టుభీమవరం టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపునకు 21 వేల వాహనాలు వెళ్లాయి.

Advertisement
 
Advertisement
Advertisement