సమాధానం  చెప్పేందుకు తత్తరపాటు | ZP Chairman Conduct Meeting In Adilabad | Sakshi
Sakshi News home page

సమస్యలపై గళం

Dec 1 2019 12:18 PM | Updated on Dec 1 2019 12:20 PM

ZP Chairman Conduct Meeting In Adilabad - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీచైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌  

సాక్షి,ఆదిలాబాద్‌: పాఠశాలల్లో తరగతి గదులు సరిపోవడం లేదని, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్‌ లేవని, అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అనేక గ్రామాలకు రహదారి సంబంధాలు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారని, సరైన వైద్యసేవలు అందడం లేదని, వైద్యులు ఆస్పత్రులకు రావడం లేదని, సరిపడా మందులు లేవని, రైతుబంధు, రైతుబీమా, పీఎంకిసాన్‌ యోజన డబ్బులు రాలేదని, ఇలా అనేక సమస్యలపై సభ్యులు సందించారు. గుక్కవీడకుండా సభ్యులు అడిగిన సమస్యలకు అధికారులు సమాధానం  చెప్పేందుకు తత్తరపడ్డారు.  జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తమ మండలంలోని సమస్యలపై గళం వినిపించారు.

శనివారం జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ సీఈఓ కిషన్, వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, సభ్యులు  పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, పురాణం సతీశ్‌ గైర్హాజరయ్యారు.  లోక్‌సభ సమావేశాలు ఢిల్లీలో ఉండడంతో ఎంపీ సోయం బాపురావు రాలేకపోయారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూతురు వివాహం ఆదివారం హైదరాబాద్‌లో ఉండడంతో ఆమె సమావేశానికి రాలేదు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. మొత్తం 42 అంశాలకుగానూ విద్యాశాఖ అంశంతో మొదలైన సమావేశంలో వ్యవసాయం, మార్కెటింగ్, ఆర్‌అండ్‌బి, విద్య, వై ద్యం, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్, పరిశ్రమలు, అటవీశాఖ అంశాలపై ఉదయం సెషన్‌లో చర్చ జరిగింది. మధ్యాహ్న భోజనం అ నంతరం మిగితా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే కొన్ని అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ అనేక అంశాలపై తట్టి వదిలేశారు. సాయంత్రానికి సమావేశం ముగించారు. 

తలమడుగు మండలం సాయిలింగిలో టాయిలెట్స్‌ మంజూరు చేయాలని జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి కోరారు. రోడ్ల విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంగా నిధుల మంజూరు విషయంలో వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్నతో ఆయనకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద పట్టాలు ఇచ్చినవారికి ఇప్పటివరకు ఏ ఒక్కరికీ రైతుబంధు రాలేదని బజార్‌హత్నూర్‌ జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భీంపూర్‌ మండలంలోని అర్లి(టి) గ్రామంలో రూ.45లక్షలతో పాఠశాల భవనాలు నిర్మిస్తుండగా 80 శాతం పనులు పూర్తయి మిగితా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భీంపూర్‌ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌ అన్నారు. కుంటాల జలపాతానికి వెళ్లే రోడ్డులో ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్‌కు సంబంధించిన స్థలం అన్యాక్రాంతం అవుతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గాదిగూడలో పీహెచ్‌సీని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలని జెడ్పీటీసీ మెస్రం గంగుబాయి కోరారు.  సమస్యలపై గళంసీజన్‌ను బట్టి అంశాల ప్రస్తావన 

జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా సీజన్‌ను బట్టి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆరేడు అంశాలను తీసుకొని విస్తృతంగా చర్చించాలి. ఇది నా అభిప్రాయం. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి యాక్షన్‌టేక్‌ రిపోర్టును సమావేశం కంటే వారం ముందుగానే అందించే ఏర్పాట్లు అధికారులు చేయాలి. ఇలా జెడ్పీ సమావేశం ఓ క్రమపద్ధతిగా జరిగితే జిల్లాలోని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది.  – దివ్యదేవరాజన్, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement