యువ ఓటర్లే కీలకం | Youth Play A key Role In Mahabubabad | Sakshi
Sakshi News home page

యువ ఓటర్లే కీలకం

Mar 27 2019 3:48 PM | Updated on Mar 27 2019 4:16 PM

Youth Play A key Role In Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్లు తుది జాబితా విడుదల కావటంతో కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్‌ 11న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ధేశించే స్థాయిలో యువ ఓటర్లు నమోదు కావటంతో ప్రధాన పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మానుకోట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యువ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములలో కీలకం కానున్నారని అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పక్షాలు ఈ మేరకు  కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.

యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలలో ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది.  ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమ యం  ఉండటంతో,  క్షేత్ర స్థాయిలో యువ ఓటర్లకు కావా ల్సినవి అన్ని సర్ధుబాటు  చేసేందుకు ఇప్పటి నుంచే గ్రా మాల్లో నాయకులు సమావేశాలు నిర్వహించి వారిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కొత్త ఓటర్లు
మానుకోట పార్లమెంట్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ఉండగా, ఇప్పుడు కొంతమంది  ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. ఇందులో  తొలిసారి ఓటువేయనున్న వారు 36,401 మంది ఉన్నారు. అందులో మానుకోటలో అత్యధికంగా 7337 మంది, డోర్నకల్‌లో 5762, నర్సంపేటలో 6106, ములుగులో 5554, పినపాకలో 4115, ఇల్లందులో 5018, భద్రాచలంలో 2509మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు గల్లంతైనవారు తిరిగి ఓటు నమోదు చేసుకోవటంతో భారీ సంఖ్యలో ఓటర్లు పెరిగారు. 

కీలకంగా మారనున్న యువత
2014 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి, ఓడిన అభ్యర్థికి మధ్య 34,992 ఓట్లు తేడా మాత్రమే ఉంది.  ప్రస్తుతం పెరిగిన యువ ఓటర్లు సంఖ్య దాదాపుగా దీనికి సమానంగా ఉండటంతో ఫలితాలపై వీరి ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే మొత్తం ఓటర్లలో 20నుంచి 29 సంవత్సరాల మధ్య యువత అధికంగా ఉన్నారు.

ఈసారి వీరు ఎటువైపు మొగ్గుచూపుతారో అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగిన ఓట్లు తమను ముంచుతారో తేల్చుతారో అని పార్టీలు భయపడుతున్నాయి. బయటికి మాత్రం పెరిగిన ఓట్లు తమకే లాభం చేకూర్చుతాయని పలు పార్టీలు తమకు అనుకూలంగా చెప్పుకున్నప్పటకీ లోపల విషయం మాత్రం వేరే విధంగా ఉంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌ యువత ఎప్పుడూ కేసీఆర్‌ పక్షమే అని చెబుతుంటే కాంగ్రెస్‌ మాత్రం బీజేపీ ప్రభుత్వంపై యువత తీవ్ర వ్యతిరేఖంగా ఉందని అందచేత కొత్త ఓటర్లు తప్పకుండా మాకే ఓటేస్తారనే ధీమాలో ఉన్నారు.

యువతకు గాలం 
కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యత అంశాలను పార్టీలు మేనిఫెస్టోలో చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫెస్టోలో యువ ఓటర్లను ఏమాత్రం ఆకర్షిస్తాయో చూడాలి. ఇప్పటికే  నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ త్వరలో నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చెప్పారు. విధివిధానాల కోసం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయం నాటికి మరిన్ని యువతకు తాయిలాలు ప్రకటించే అవకాశం లేకపోలేదు. సాంకేతిక యుగంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో వారు తమ అభిమాన పార్టీ నాయకుల పేర్లతో వాట్సప్, ఫేస్‌బుక్‌ గ్రూపులు క్రియేట్‌ చేసి నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ వైపు మొగ్గు చూపిన యువత ఈసారి ఓటు ఎవరికి వేయనున్నారో అని ఆసక్తి నెలకొంది.  

Advertisement
 
Advertisement
Advertisement