రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆస్పత్రి పాలయ్యాడు.
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే .. లంగర్హౌస్లో నివసించే వెంకట్రెడ్డి, సుష్మ (25) భార్యాభర్తలు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై ఎన్ఎఫ్సీఎల్ నుంచి పంజగుట్ట వైపు రాత్రి 8.00 గంటల ప్రాంతంలో వస్తుండగా అదే మార్గం గుండా వెళుతున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జూబ్లీ మెడికల్ హాల్ ఎదురుగా ఢీకొట్టింది.
బస్సు వెనకటైరు సుష్మపై నుంచి వెళ్లడంతో ఆమె తల ఛిద్రమైపోయింది. వెంకట్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సుష్మ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి, వెంకట్రెడ్డిని చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ బి. ఆంజనేయులు (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.