మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు | TRS Govt Minorities Main Priority Deputy CM Muhammad Ali | Sakshi
Sakshi News home page

మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు

May 2 2018 10:26 AM | Updated on May 2 2018 10:26 AM

TRS Govt Minorities Main Priority Deputy CM Muhammad Ali - Sakshi

మసీదును పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి లక్ష్మారెడ్డి

బాలానగర్‌ (జడ్చర్ల) : రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు. బాలానగర్‌లోని జాతీయ రహదారి పక్కన మహ్మద్‌ నజీరొద్దీన్‌ అండ్‌ సన్స్‌ ఆధ్వర్యంలో అదునాతన సదుపాయలతో నూతనంగా నిర్మించిన మసీద్‌ను సోమవారం ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ముస్లింలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ముస్లింల అభివృద్ధికి మరింత కృషిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మసీదుల అభివృద్ధితోపాటు, అందులో పనిచేసే గురువులకు జీతం ఇచ్చే ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. 


దేశంలోనే ఆదర్శ రాష్ట్రం
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టి అమలుచేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. తన నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మసీద్‌ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వాల్యానాయక్, ఇబ్రహిం, దాస్‌రాంనాయక్, గోపాల్‌రెడ్డి, గిరిజన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, మాజీ ఎంపీపీ నర్సింహులు, చెన్నారెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement