జిల్లా వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్ | today district wide mega lok adalat | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్

Apr 11 2014 11:52 PM | Updated on Sep 2 2017 5:54 AM

జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ తెలిపారు.

 సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్:  జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ తెలిపారు. స్థానిక న్యాయసేవా సదన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, జోగిపేట, నర్సాపూర్, జహీరాబాద్ కోర్టుల్లో న్యాయసేవా సంస్థ జిల్లా చైర్మన్ మాధవరావు ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ, మోటార్ యాక్సిడెంటల్ సంబంధించిన కేసులను పరిష్కరించనున్నట్టు వివరించారు. వివిధ కేసుల్లో నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగకుండా సత్వర న్యాయం కోసం న్యాయసేవా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.

 లోక్ అదాలత్‌లో వివిధ కంపెనీలకు, బ్యాంకులకు సంబంధించి యజమానులు, న్యాయవాదులు పాల్గొంటారని, కక్షిదారుల అంగీకారం మేరకు నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారు సైతం పాల్గొనవచ్చని, వారికి వడ్డీ మాఫీ చేయించడం జరుగుతుందన్నారు.

 లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందడమేగాక డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా లోక్ అదాలత్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాగా గత నవంబర్ నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 5800 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement