22న మూడు రాష్ట్రాల సీఈల భేటీ

Three States CEs Will meet On 22nd Of October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) కాల్వల ఆధునికీకరణ పనుల అంశంలో మళ్లీ కదలిక వచ్చింది. వీటిని పూర్తి చేయాలని గత నెలలో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించిన నేపథ్యంలో దీనిపై 3 రాష్ట్రాల ఉమ్మడి సమావేశం జరపా లని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల చీఫ్‌ ఇంజనీర్లతో కలిపి హైదరాబాద్‌లో ఈ నెల 22న సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఈ భేటీ జరపనుంది.

ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుం చి 7టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర లభ్యమవుతోంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్‌ ఆన కట్ట పొడవును మరో 5అంగుళాలు పెంచాలని నిర్ణయించగా, కర్ణాటక సైతం అంగీకరించింది.

ఈ కాల్వల ఆధునికీకరణకు కర్ణాటకకు రాష్ట్రం రూ.92.74కోట్లు డిపాజిట్‌ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 24%, ప్యాకేజీ–2పనులను మరో 54% వరకు పూర్తి చేసింది. ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో అవి నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రానికి ఏటా 4 టీఎంసీలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఉమ్మడి భేటీని ఈ నెల 22న జరిపేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top