మృత పిండంతో మూడు రోజులు.. | Three days of dead soul | Sakshi
Sakshi News home page

మృత పిండంతో మూడు రోజులు..

Aug 15 2017 3:09 AM | Updated on Sep 17 2017 5:31 PM

మృత పిండంతో మూడు రోజులు..

మృత పిండంతో మూడు రోజులు..

ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేదలకు సరైన వైద్యం అందకుండా పోతోంది.

- వైద్యం కోసం వస్తే చేతులెత్తేసిన వైద్యులు 
కలెక్టర్‌ జోక్యం చేసుకుంటే తప్ప అందని వైద్యం 
 
చింతపల్లి (దేవరకొండ): ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేదలకు సరైన వైద్యం అందకుండా పోతోంది. చేతిలో చిల్లి గవ్వలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ.. ఓ గర్భిణీ మృతపిండంతో 3 రోజులు నరకయాతన అనుభవించింది. చివరకు కలెక్టర్‌ జోక్యం చేసుకోవడంతో వైద్యులు స్పందించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియ గౌరారం గ్రామానికి చెందిన గ్యారపాటి యాదమ్మ, గెల్వయ్య దంపతులు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. యాదమ్మ  ఆరు నెలల గర్భవతి.

ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చింతపల్లి   ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో స్కా నింగ్‌ చేయగా కడుపులోనే పిండం మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతపిండాన్ని తొలగించాల్సిన వైద్యులు నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చారు. తమది నిరుపేద కుటుంబమని, ఆర్థిక స్థోమత లేదని ఆపరేషన్‌ చేసి మృత పిండాన్ని తొలగించాలని వైద్యులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు.

రాత్రంతా దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలోనే గడిపారు.  ఈ నెల 13న నల్లగొండ జిల్లా ఆ స్పత్రికి ఆర్టీసీ బస్సులో వెళ్లామని బాధిత దంపతులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.  సోమవారం  కామినేని ఆస్పత్రికి వెళ్లేందుకు నల్లగొండ బస్టాండ్‌ వరకు వచ్చారు.
 
కలెక్టర్‌ జోక్యం  
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ వెంటనే వైద్యులతో మాట్లాడారు. అంబులెన్స్‌ పిలిపించి ఆమెను తిరిగి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.  
 
సూపరింటెండెంట్‌ వివరణ 
ఈ విషయమై ‘సాక్షి’జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌ పి.నర్సింగరావును వివరణ కోరగా మృత పిండంతో ఆస్పత్రికి వచ్చిన ఆమెకు వైద్యం అందించామని తెలిపారు. రక్తహీనత కారణంగా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించామన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement