వడగళ్ల నష్టాన్ని చూడొచ్చారు.. | The group came to | Sakshi
Sakshi News home page

వడగళ్ల నష్టాన్ని చూడొచ్చారు..

Apr 24 2014 3:28 AM | Updated on May 29 2018 4:06 PM

గత నెలలో జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర అధికారుల బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది.

  •      జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం
  •      తిమ్మంపేట, చిన్నపెండ్యాల, గవిచర్లలో  పర్యటన
  •      పంట క్షేత్రాలను పరిశీలించిన అధికారులు
  •      కడగండ్లపై నివేదిక అందజేసిన కలెక్టర్
  •  వరంగల్, న్యూస్‌లైన్ : గత నెలలో జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర అధికారుల బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. మూడు రోజుల పాటు కురిసిన వడగళ్లు జిల్లాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపెద్ద వడగళ్లు పడడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

    ఈ ప్రాంతాలను కేంద్ర బృందం పర్యటించింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామంలో మొక్కజొన్న, వరి, మామిడి, సపోటా తోటలను పరిశీలించింది. రైతులతో చర్చించి పంటలు, నష్టపోయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ధ్వంసమైన ఇండ్లు, మృతి చెందిన పశువుల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌ఘనపురం మండలం చిన్నపెండ్యాల గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు.

    అనంతరం కలెక్టరేట్‌లో వివిధ మండలాల్లో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటలు, ధ్వంసమైన ఇండ్లు, మృతి చెందిన పశువులకు సంబంధించిన ఛాయ చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో వడగండ్ల వాన వలన నష్టపోయిన పంట వివరాలను జిల్లా కలెక్టర్ జి.కిషన్ కేంద్ర బృందానికి వివరించారు. వ్యవసాయ పక్షాన జరిగిన నష్టంపై నివేదిక సమర్పించారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 22కోట్ల పరిహారాన్ని కోరుతూ నివేదిక అందించారు. ఇందులో వెయ్యి హెక్టార్లలో పత్తి, 13వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13వేల హెక్టార్లలో వరి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు.

    ఉద్యవనశాఖ నుంచి 4436.65 హెక్టార్లలో మిర్చి, పండ్లు, కూరగాయాల తోటలకు జరిగిన నష్టాన్ని తెలియజేశారు. 8169 మంది రైతులు నష్టపోయారని, రూ. 4.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు. వ్యవసాయ శాఖతో పాటు రెవిన్యూ, ఉద్యావనశాఖ, రోడ్లు,భవనాలు, విద్యుత్‌శాఖ అధికారులు తమ శాఖలపరంగా జరిగిన నష్టంపై నివేదిక అందించారు. కలెక్టరేట్‌లో సమావేశం అనంతరం సంగెం మండలం గవిచర్లలో దెబ్బతిన్న పంటల పరిస్థితిని పరిశీలించారు.

    ఈ సందర్భంగా రైతులు పూర్తిగా నష్టపోయారనే అంచనాకు అధికారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు బి.కళ్యాణచ క్రవర్తి, ఆర్‌పి సింగ్, పంకజ్ త్యాగి, టిజిఎస్ త్యాగి, ఎన్‌ఎస్ మోది, డీఆర్‌ఓ సురేంద్రకరణ్, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ జి.రామారావు, ఉద్యాన వన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎంవి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement