
అన్న మోసం చేశాడని తమ్ముడి ఆత్మహత్య
తోడబుట్టిన అన్న తనను మోసం చేశాడని మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల ...
వర్ధన్నపేట టౌన్ : తోడబుట్టిన అన్న తనను మోసం చేశాడని మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో సోమవారం సంచలనం సృష్టిం చింది. వర్ధన్నపేట సీఐ సంతోష్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జంబారపు సత్యనారాయణ(40) తన కుల వృత్తి అయిన సెలూన్ షాపు నిర్వహించుకుంటున్నాడు. సత్యనారాయణకు, అతడి అన్న స్వామికి ఉమ్మడిగా వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై విలువైన భవనం ఉంది. అయితే ఈ భవనం స్వామి పేరిట ఉండడంతో అతడు తన కుమారుడైన నందు పేర రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విషయం సత్యనారాయణకు చెప్పకపోవడంతోపాటు బ్యాంకు నుంచి రుణం పొందాడు. ఈ విషయమై కులస్తులు, గ్రామస్తులు పలుమార్లు పంచాయతీలు చేసి సోదరుడికి వాటా ఇవ్వాలని తీర్పు చెప్పినా స్వామి బేఖాతర్ చేశాడు.
స్వామి కుటుంబ సభ్యులు పలుమార్లు సత్యనారాయణ కుటుంబాన్ని దూషించడం, దాడులకు పాల్పడడం లాంటివి జరిగాయి. దీంతో గత కొన్నినెలలుగా మనోవేదనతో ఉన్న సత్యనారాయణ తన సెలూన్ షాపులోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం సెలూన్ షాపులో పనిచేసే యాకయ్య వచ్చి షట్టర్ లేపడంతో సత్యనారాయణ మృతదేహం కనిపించింది. మృతుడి భార్య బేబి స్థానిక పోలీస్స్టేషన్లో తన భర్త మృతికి స్వామి, అతడి భార్య కళావతి, కుమారుడు నందు, వారికి సహకరించిన మచ్చ సత్యనారాయణ కారకులని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు.