మొక్కజొన్నతో మార్క్‌ఫెడ్‌కు నష్టాలు | Telangana Markfed Gone Into Losses With Corn | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నతో మార్క్‌ఫెడ్‌కు నష్టాలు

May 26 2020 2:48 AM | Updated on May 26 2020 2:48 AM

Telangana Markfed Gone Into Losses With Corn - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొంటున్న మార్క్‌ఫెడ్‌ కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. మద్దతు ధరకు కొనడం, తర్వాత వాటిని మార్కెట్‌ ధరలకు విక్రయిస్తుండటంతో భారీగా నష్టాల పాలైంది. దీంతో చివరకు ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కూడా డబ్బుల్లేక, బ్యాం కుల్లో అప్పులు చేస్తోంది. పైగా బ్యాంకు బకాయిలు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలోకి కూడా మార్క్‌ఫెడ్‌ వెళ్లిపోయింది. అయితే తాజా సమగ్ర వ్యవసాయ విధానం నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌ కొన్నేళ్లుగా చేపట్టిన కొనుగోళ్లు, నష్టాలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఏ పంట వల్ల ఎక్కువ నష్టం వచ్చిందో అంచనా వేసింది. 

ఆరేళ్లలో రూ.1,114 కోట్ల నష్టం.. 
మార్క్‌ఫెడ్‌ ఆరేళ్లలో ఏకంగా రూ.1,114 కోట్లు నష్టపోయింది. మొత్తం కొనుగోళ్లలో 26.45 శాతం నష్టాలు రావ డం గమనార్హం. ఇందులో మొక్కజొన్న కొనుగోళ్లతోనే అ ధిక మొత్తంలో నష్టం రాగా, ఆ తర్వాతి స్థానంలో కందులున్నాయి. 2014–15 నుంచి 2019–20 వరకు మార్క్‌ఫెడ్‌ 18.42 లక్షల మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. వీటి విలువ నిర్వహణ ఖర్చులతో కలిపి రూ.4,213 కోట్లు. తిరిగి వీటిని టెండర్ల ద్వారా విక్రయాలు జరపగా వచ్చిన మొత్తం రూ.3,099 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఏకంగా రూ.1,114 కోట్లు నష్టం వచ్చింది.

అందులో మొక్కజొన్న విక్రయాల ద్వారా రూ.532 కోట్లు నష్టం మూటగట్టుకుంది. 2014–15లో రూ.154 కోట్లు నష్టం రాగా, 2017–18 వానాకాలంలో రూ.140 కోట్లు, యాసంగిలో రూ.111 కో ట్లు, 2018–19 వానాకాలంలో రూ.127 కోట్ల నష్టం వచ్చింది. ఆ తర్వాత కందుల ద్వారా రూ.412 కోట్ల నష్టం వాటిల్లింది. 2017–18లో రూ.350 కోట్లు, 2018–19లో రూ.62 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక జొన్నలు, ఎర్ర జొ న్నలతో రూ.56 కోట్లు, శనగలతో రూ.73 కోట్ల నష్టాలు వచ్చినట్లు ప్రాథమిక నివేదికలో మార్క్‌ఫెడ్‌ పేర్కొంది. 

డిమాండ్‌ లేని పంటలతోనే నష్టమా? 
నియంత్రిత సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అం దులో భాగంగానే అసలు మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభు త్వం గత ఆరేళ్లలో కొనుగోలు చేసిన పంటలేవీ? వాటికి ఎంత ఖర్చు అయింది.. తిరిగి విక్రయించే సమయంలో ఎంత నష్టం వచ్చిందనే దానిపై ఈ లెక్కలు తీశారు. ఈ కాలం లో మద్దతు ధరకు కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని తేలింది. పైగా తీవ్ర నష్టాలను చవిచూసింది. డిమాండ్‌ లేని పంటలను అధికంగా పండించ డం ద్వారానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు నిర్ధారణకు వచ్చా రు. ఇటు కొందరు మార్క్‌ఫెడ్‌ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై నష్టాలు వచ్చేలా విక్రయాలు జరపడం కూడా ఓ కారణమన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేలు జరిగేలా కొనుగోళ్లలోనూ సమూ ల సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement