వారణాసికి పసుపు రైతులు 

Telangana 50 Numbers Farmers Going To Varanasi - Sakshi

ఆర్మూర్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పసుపు రైతుల బృందం బయలుదేరి వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. నామినేషన్లు సమర్పించేందుకు జిల్లాకు చెందిన సుమారు 25 మంది రైతులు ఆర్మూర్‌ నుంచి గురువారం బయలుదేరి వెళ్లారు. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు రైతుల సమస్యలను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం, ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలనే లక్ష్యంగా రైతులు ఈ నామినేషన్లు 
వేయనున్నారు.

ఇటీవల రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చర్చ జరిగేలా చేయగలిగారు. అయితే రైతుల ఐక్య కార్యాచరణ కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేస్తే సమస్య తీవ్రత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని పసుపు రైతులు భావిస్తున్నారు. దీంతో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు కాకుండా పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నామినేషన్లు వేయనున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర సాధించుకోవడంతో పాటు పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమ బాట పట్టిన రైతులు తమకు గెలుపు, ఓటములు ముఖ్యం కాదని తమ సమస్య దేశ వ్యాప్తంగా చర్చకు వస్తే త్వరలో పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.
 
బయల్దేరిన పసుపు రైతులు.. 
పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలోని రైతు సేవా కేంద్రం సమీపానికి చేరుకున్న పసుపు రైతులు విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి పసుపు రైతులు చలో వారణాసి పేరిట నామినేషన్లు వేయడానికి బయల్దేరుతున్నామన్నారు. తమకు మద్దతుగా తమిళనాడుకు చెందిన పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు దైవశిగామణి ఆధ్వర్యంలో సైతం పసుపు రైతులు తరలి వస్తున్నారన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

పసుపునకు ప్రత్యేక బోర్డు సాధించుకోవడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ పసుపు రైతులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. 12 ఏళ్లుగా తాము పసుపు రైతుల పక్షాన ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. డిచ్‌పల్లి మండలంలో పసుపు పండించరన్న అరవింద్‌ జ్ఞానం ఏపాటితో అర్థమయిందన్నారు. డిచ్‌పల్లి మండలంలో రెండు వందల మంది రైతులు 300 ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారన్నారు. అనంతరం ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి శివారు నుంచి బస్సులో హైదరాబాద్‌ వరకు బయల్దేరిన పసుపు రైతులకు కోటపాటి నర్సింహనాయుడు వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌ నుంచి వీరు రైలు ప్రయాణం ద్వారా వారణాసికి చేరుకోనున్నారు. వారణాసికి బయల్దేరిన వారిలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి, కొట్టాల చిన్నారెడ్డి, వేముల శ్రీనివాస్, నాగలింగం, గురడి రాజరెడ్డి తదితరులున్నారు. కాగా వారణాసికి వెళ్లిన రైతులతో మాకు సంబంధం లేదని నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన పసుపు రైతులు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.వారణాసి వెళ్లిన వారంతా టీఆర్‌ఎస్‌ నాయకులన్నారు.

కమ్మర్‌పల్లి నుంచి.. 
కమ్మర్‌పల్లి: ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి నామినేషన్‌ వేయడానికి కమ్మర్‌పల్లి నుంచి రైతులు గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తున్నామని తెలిపారు. బద్దం రాజశేఖర్‌ రెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, చింత గణేష్, రాజేష్, పెంట ముత్తెన్న, బద్దం రాజేశ్వర్, రాజేందర్, శివ, మోహన్, పాషా, లక్ష్మణ్‌ తదితరులు వారణాసి వెళ్లిన వారిలో ఉన్నారు.

ఏర్గట్ల నుంచి..
మోర్తాడ్‌: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీగా పోటీ చేయడానికి ఏర్గట్ల మండలంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గురువారం తరలి వెళ్లారు. పసుపు ఏర్పాటు లక్ష్యంగా ప్రధానిపై పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారణాసికి తరలివెళ్లిన వారిలో నాయకులు తుపాకుల శ్రీనివాస్‌గౌడ్, ఉపేంద్ర, బద్దం ముత్యం, దండబోయిన సాయన్న, బర్మ చిన్న నర్సయ్య తదితరులు ఉన్నారు.

మాకు సంబంధం లేదు.. 

పెర్కిట్‌ (ఆర్మూర్‌): వారణాసిలో నామినేషన్లు వేస్తున్న వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన రైతులు స్పష్టం చేశారు. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ ఎమ్మార్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు మాట్లాడుతూ వారణాసిలో నామినేషన్లు వేస్తున్న వారు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారని స్పష్టం చేశారు.

తాము పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కినపుడు వారు ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేసారన్నారు. వాళ్లకు చిత్త శుద్ధి ఉంటే అప్పుడే మాతో కలిసి వచ్చేవారన్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. మండలాల వారీగా కమిటీలు వేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రైతులు కోల వెంకటేశ్, ఏలేటి మల్లారెడ్డి, గడ్డం రాజేశ్వర్, మహేందర్, నర్సయ్య, ఆరె సాయన్న, సుమన్, సంజీవ్, మోహన్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డి, లింగా రెడ్డి, ప్రవీణ్, రైతు ప్రతినిధులు అన్వేష్‌ రెడ్డి, సాయా రెడ్డి, ప్రభాకర్, దేవరాం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top