తెలంగాణ ఆశలకు గండి | Telagana hopes break | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆశలకు గండి

Feb 19 2015 3:03 AM | Updated on Apr 7 2019 4:30 PM

కేంద్రం నుంచి భారీగా నిధులు ఆశిస్తున్న తెలంగాణ సర్కారుకు ఈ నెలలో చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరుస ఢిల్లీ పర్యటనలు..

  • కేంద్రం నిధులకు కత్తెర
  • నెలనెలా వచ్చింది 900 కోట్లు
  • ఈ నెలలో విడుదలైంది రూ.418 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి భారీగా నిధులు ఆశిస్తున్న తెలంగాణ సర్కారుకు ఈ నెలలో చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరుస ఢిల్లీ పర్యటనలు.. ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్రమోదీతో  భేటీలు... వివిధ శాఖల మంత్రుల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో... ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేంద్రం నుంచి నిధులు వెల్లువెత్తుతాయని ఆశపడ్డ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామమే ఎదురైంది. వివిధ పథకాలు.. పద్దులు.. పన్నుల వాటా కింద కేంద్రం విడుదల చేసే నిధులు ఫిబ్రవరిలో మరింతగా తగ్గిపోవడం కలవరపరుస్తోంది.

    ఇప్పటి వరకు నిధుల విడుదలను చూస్తే సగానికిపైగా కోత పడింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రతీ నెలా కేంద్రం నుంచి వివిధ పన్నుల వాటా కింద సగటున రూ.800 నుంచి రూ.1000 కోట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు కేవలం రూ.418 కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలతో ముగియనుంది. మరో నలభై రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది.

    ఇంత తక్కువ సమయంలోనే పాత బకాయిలతో పాటు నెలనెలా వచ్చే నిధులు రాబట్టుకోవటం తప్పనిసరి. లేకుంటే నిధులు మురిగిపోయే ప్రమాదముంది. ఈ అనివార్య పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం జనవరిలోనే గుర్తించింది. విభాగాల వారీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మంజూరీకి  ఒత్తిడి పెంచాలని.. సీఎం కెసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్ని విభాగాల మంత్రులను అప్రమత్తం చేశారు.
     
    నిధుల కోసం ఢిల్లీ పర్యటనలు


    కేంద్ర గ్రాంట్లను తెచ్చుకునేందుకు ఢిల్లీ పర్యటనలు జోరుగా సాగినప్పటికీ ఆశించినన్ని నిధులు రాకపోగా.. రావాల్సిన తరుణంలో నిధుల్లో కోత పడటం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది. పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం తగ్గిందని.. అదే దామాషా పద్ధతిలో  రాష్ట్రానికి  ఆశించినన్ని నిధులు రాలేదని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం తగ్గిపోవటానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సైతం ఆరా తీస్తోంది. మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన  కేసీఆర్ రాష్ట్రంలో తలపెట్టిన మిషన్ కాకతీయ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు సగం నిధులివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆదాయం ఆశాజనకంగా లేని పరిస్థితిలో కేంద్రం ఎలా స్పందిస్తుంది..? 2015-16 బడ్జెట్టులో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయిస్తుందా..? అనేది ఆర్థిక శాఖ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

    స్పెషల్ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు?

    ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీగా రూ.5వేల కోట్లు వస్తాయని తెలంగాణ సర్కారు ఆరు నెలలుగా ఎదురుచూస్తోంది. ఇప్పటికీ అటువంటి సానుకూల సంకేతాలేవీ రాలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వం 2014-15  బడ్జెట్టులో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలుకు ప్రణాళిక నిధుల్లో రాష్ట్రానికి కేటాయించిన రూ. 11 వేల కోట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. 13 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.  

    రాష్ట్రానికి రూ. 3139 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 997 కోట్లు విడుదలయ్యాయి. మిగతా రూ. 2142 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. అమ్మకపు పన్ను వాటాకు సంబంధించి ఎనిమిదేళ్లుగా రావాల్సిన రూ. 2,500 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయి. ప్రస్తుతమున్న రుణ పరిమితిని పెంచే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ.9వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే వీలుంది. ఈ పరిమితిని రూ.13వేల కోట్లకు పెంచాలనే విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement