
అండగా ఉంటా
మొన్నటివరకు తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగిన మహిళా నేత.. నిన్నటికి నిన్న ప్రజాభిమానంతో ప్రత్యర్థులను...
మొన్నటివరకు తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగిన మహిళా నేత.. నిన్నటికి నిన్న ప్రజాభిమానంతో ప్రత్యర్థులను మట్టికరిపించి అసెంబ్లీలో అడుగుపెట్టిన మెతుకుసీమ ధీరవనిత.. ఇపుడు తెలంగాణ తొలిఉప సభాపతిగా సభను సమర్థవంతంగా, హుందాగా నడుపుతూ అందరి మన్ననలు చూరగొంటున్న మహిళా నేత.. ఆమే పద్మాదేవేందర్రెడ్డి.
ప్రజాప్రతినిధిగా నిత్యం బిజీగా ఉండే ఆమె, ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారారు. రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి వెళ్లి ‘సాక్షి’ విలేకరిగా జనం గుండెను తడిమి చూశారు. డిప్యూటీ స్పీకర్ గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న పల్లె జనం పిల్లా పాపలతో కలిసి ఊరు పొలిమేర వద్ద ఆమెకు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువు...పల్లె నాట్యాలతో గ్రామంలోకి తీసుకు వెళ్లారు.
గ్రామం ముంగిట్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మాదేవేందర్రెడ్డి...అక్కడి నుంచి చౌకధర దుకాణం వద్దకు చేరుకుని ‘సాక్షి’ విలేకరిగా జనం సమస్యలు తెలుసుకున్నారు. ‘కూడు గింజలకు ఇగ రంది లేదమ్మా’ అని వెంకటలక్ష్మి అనే గృహిణి చెప్పినప్పుడు ఆత్మసంతృప్తితో పద్మాదేవేందర్రెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి.
డిప్యూటీ స్పీకర్: ఏమ్మా బాగున్నారా?
డి.ధర్మారం ప్రజలు : బాగున్నాం మేడం...
డిప్యూటీ స్పీకర్: అందరికీ రేషన్ అందిందా?
డి.ధర్మారం ప్రజలు : ఎవరి నోటి నుంచి మాట రాలేదు.
డిప్యూటీ స్పీకర్: ఏం మాట్లాడరు? డీలర్ బియ్యం ఇవ్వటం లేదా?
డి.ధర్మారం ప్రజలు :: అయ్యో... అట్టేమీ లేదమ్మా.
డిప్యూటీ స్పీకర్: నీ పేరు చెప్పమ్మా?
నీ సమస్య ఏమిటి?
ఎనబోయిన సత్తెవ్వ: అమ్మా... ఎనిదేళ్ల నుంచి కారట్ల నా మొగని పేరు లేదు. కారటు దిగినప్పుడు ఆయన పట్నం బతకబోయిండు.తల్లి మగ్గురు పేరే ఉంది. నెలకు 12 కిలోల బియ్యమొస్తే ఏం సరిపోతాయమ్మ.
పిట్ల నర్సమ్మ: నాకు కూడా అట్నే అయిందమ్మా. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నోనికి 12 ఏండ్లు. ఆధార్ లేదని కారట్ల పేరెక్కియలేదు. రామాయంపేటకు తీసుకపోయి దింపుకొచ్చిన. ఇప్పుడు పేరు ఎక్కిత్తమని సార్ చెప్పిండు.
డిప్యూటీ స్పీకర్: ఇంతకు ముందు ఎన్ని కిలోల బియ్యం వచ్చేవి? మీకు సరిపోయేదా?
సరస్వతి: అమ్మా..! ఒళ్లలువ కట్టం చేసుకుంటం. కడపునిండా తింటం. రెండు పూటల తింటే నెలకు ఎట్టా లేదన్నా ఇంటిళ్లిపాదికి కలిపి 40 కిలోల బియ్యం పడుతయి. సార్కారోళ్లు ఇన్నాళ్లు ఎంత మంది ఉన్నరు అని సూడకుండ 20 కిలోల బియ్యం ఇస్తే 15 రోజులకే సరిపోయేవి. సుట్టపోడు అస్తే 10 రోజులకు కూడా సరిపోవు. బయట కొందామంటే కిలో బియ్యం (దొడ్డు బియ్యం) రూ.25 ..రూ.30 పలుకుతోంది. ఆలుమగలం కట్టపడితే రోజు రెండు, మూడోందలు దొరుకుతయి. దాంట్లెనే మొగొళ్లు ఇంత ఏసుకుంటరా..! ఇంకేం ఉంటమయ్మ. సెప్పుకుంటే అమ్మలక్కలు సెప్పుకున్నది అంటరు గానీ...తినీ, తినక పస్తులు పండుకునేదాన్ని.
(ఆమెను డిప్యూటీ స్పీకర్ ఆప్యాయం దగ్గరకు తీసుకున్నారు. ఇక నుంచి ఆ కష్టాలుండవని భరోసా ఇచ్చారు)
డిప్యూటీ స్పీకర్: ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుంది కదా? ఇప్పుడెలా ఉందమ్మా?
వెంకటలక్ష్మి: ఇప్పుడు జర నయమే నమ్మా... గంజిలకు ఉప్పుగల్లు తోడయినట్టు. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇత్తన్రు. ఎంత మంది ఉంటే అన్ని ఆర్లు ఇత్తున్నరు. కూడు గింజలకు రంది లేకుంటయిదమ్మా. రేషన్ కింద ఇస్తున్న ఉప్పు, నూనె, పప్పు, మిరపకాయలు అసలు సరిపోట్లేదమ్మా... బియ్యం పెంచినట్టే వాటిని పెంచితే మీకు పుణ్ణెం వస్తదమ్మా. మీ పేరు చెప్పుకొని పేదోళ్లం రెండు పూటలైనా కడుపు నిండా తింటాం.
డిప్యటీ స్పీకర్: నీ సమస్య ఏమిటో చెప్పమ్మా?
ఉడుత యశోద: బీడీ కంపెనోళ్లు నెలల 10 రోజులు కూడా పనిత్తలేరు. ఉప్పు, పప్పుకు శానా ఇబ్బందైతంది. బయట కైకిలి కూడా దొరుకుత లేదు. పిల్లలను బతుకు ఏంగావాలే.. మా బతుకు ఎట్టా ఎల్లదీసుకోవాలే. మాకట్టం మీకు తెలుసుకదమ్మా..మీరు కంపెనోళ్లతో మాట్టాడి మాకు దారి సూపించురి. కార్డున్న బీడీ కార్మికులకు రూ 1,000 పింఛన్ ఇస్తే బాగుంటదమ్మా.
డిప్యూటీ స్పీకర్: నువ్వు ఏదో మాట్లాడాలను కుంటున్నావు?
నర్సయ్య: మేడం గారు.. నాకు అసలే రేషన్ కార్డు లేదమ్మా.. ఊళ్లె ఆధార్ కారటు దింపుకున్నప్పుడు నా కుటుంబం అంతా బీదర్ల బతుకుతున్నాం. మాకెవ్వలు సెప్పలేదు. ఊళ్లె మాకు ఆధార్ కారటు లేదు. ఊళ్లె సర్వే జేత్తున్నరు....కేసీఆర్ సారు అందరిని రమ్మన్నడు అని జెప్తే అప్పుడు ఊళ్లకొచ్చినం. అప్పటి నుంచి ఊళ్లనే ఉంటున్న. రేషన్ కారటుకు కూడా దరఖాస్తు పెట్టుకుంటే ఆధార్ కార్డు ఉందా? అని సారోళ్లు అడిగిండ్రు. ఆదేదో తెల్వక నోరెళ్లబెట్టిన. కుటుంబంమంతా కలిసి నెల రోజుల కింద రామాయంపేటకు పోయి మీ సేవల ఆధార్ దిగినం గానీ..ఇంత వరకు రాలే. నాకు రేషన్ బియ్యం ఇయ్యరని చెప్తున్నారు.
డిప్యూటీ స్పీకర్: ఆహార భద్రత కార్డుకు నువ్వు అర్హుడవే. నువ్వు ఎలాగు మీసేవలో ఆధార్ దిగానని చెప్తున్నావు కాబట్టి, అది రాగానే అధికారులు నీకు ఆహార భద్రత కార్డు అందిస్తారు. అంత వరకు నీ పాత కార్డు మీదనే నువ్వు బియ్యం తీసుకోవచ్చు.
(అక్కడే ఉన్న ఓ విద్యార్థితో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ..)
డిప్యూటీ స్పీకర్: ఏం తమ్ముడు ఎలా ఉన్నావు. చదువు ఎలా సాగుతోంది?
వినోద్ : మేడం.. మా ఊరి పేరు మీకు తెలుసు కదా..! దొంగల ధర్మారం. మీది ఏ ఊరంటే సెప్పుకుంటానికి ఇబ్బందిగా ఉంది. ఊరు పేరుతో కాలేజీలో ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నరు. పేరు మార్పించురి.
డిప్యూటీ స్పీకర్: అవును మీకు ఆ సమస్య ఉందని నాకు తెలుసు. మీరు గమనిస్తూనే ఉంటారు.. మీ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని మీ ఊరు పేరును డి. ధర్మారం అని పలుకుతున్నా. జిల్లా కలెక్టర్కు చెప్పాను తమ్ముడూ. త్వరలోనే మీ ఊరు పేరును సర్వోదయ నగర్ అని మార్చబోతున్నారు. (గ్రామస్తులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.)
ఆ ముచ్చటా తీరింది...
‘‘ఎమ్మెల్యేగా...డిప్యూటీ స్పీకర్గా...ఇంత చేసినా... జర్నలిస్టుగా పనిచేయలేకపోయానే అనే అసంతృప్తి ఏదో మూల ఉండేది. ‘సాక్షి’ కల్పించిన వెసులుబాటుతో ఆ ముచ్చటా తీరింది. వీఐపీ రిపోర్టర్గా జనం మధ్యకు తీసుకువచ్చి..వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రజెంటేషన్: వర్ధెల్లి వెంకటేశ్వర్లు
ఫొటోలు: కె.సతీష్