‘గురుకుల బోర్డు’కు ప్రత్యేక కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ)కు ప్రత్యేక కార్యాలయం సిద్ధమవుతోంది. నగరంలోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో నాలుగో అంతస్తును బోర్డుకు ప్రభుత్వం కేటాయించింది. దీంలో ఇక్కడ మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. సొసైటీల్లో సీనియర్ సెక్రటరీ బోర్డుకు కన్వీనర్గా వ్యవహరిస్తారు. మిగతా సెక్రటరీలు సభ్యులుగా కొనసాగుతారు. బోర్డులోని ప్రతిసభ్యుడికి ప్రత్యేక చాంబర్ ఉండేలా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఈ నెల 18న గురుకుల పాఠశాలల్లో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. ఈ మేరకు బోర్డు కసరత్తు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల్లో బోధన, బోధనేతర విభాగాల్లో 5,313 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర అంశాలపై ప్రతిపాదనలు రూపొందించిన బోర్డు ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే.. నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.