కొందరికే.. పెట్టుబడి

Rythu Bandhu Scheme Cheque Distribution Warangal - Sakshi

సాక్షి, జనగామ: యాసంగి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది.  మొదటి దఫా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ అధికారులు జమ  చేశారు. మొదటి దఫాలో కేవలం 3,915 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేశారు. రెండో విడత చెల్లింపు ల కోసం రైతుల ఖాతా నంబర్లు సేకరిస్తున్నారు.  ముం దస్తు ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నగదు రూపంలో చెల్లిం చడానికి వీలులేదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిం ది. దీంతో చెక్కుల రూపంలో  కాకుండా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సా యం జమ చేయాలని సూచించడంతో ఈ మేరకు అధికా రులు చెల్లింపుల ప్రక్రియను చేపట్టారు.

తొలి విడతలో రూ.4.65 కోట్లు జమ..
ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు  అందించడానికి రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తొలివిడత రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. రెండో పంటకు అక్టోబర్‌లో చెక్కులను అందించాల్సి ఉండగా ఇంతలో శాసనసభను రద్దు చేశారు. ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతుండడంతో రైతుబంధు చెక్కులను పంపిణీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేరుగా రైతుల అకౌంట్లలో పెట్టుబడి  సాయం జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దఫాలో 13 మండలాల్లోని 3,915 మంది రైతులకువారి అకౌంట్లలో రూ.4,65,69,240 ను జమ చేశారు.

రెండో విడతలో రూ.26.82 కోట్లు..మొదటి  దఫాలో తక్కువ మంది రైతులకే పెట్టుబడి సాయం జమ చేశారు. నవంబర్‌ మొదటివారంలో రెండో దఫా పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. ఇందులో 22,109 మంది రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి రూ.26,82,52,460 చెల్లించనున్నారు.

అకౌంట్ల సేకరణకు ఇక్కట్లు..
రైతుల బ్యాంకు అకౌంట్ల సేకరణలో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని 68 క్లస్టర్లల్లో ఏఈఓలు ఇంటింటా రైతు వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేర్లతోపాటు ఆధార్‌ నంబర్, బ్యాంకు, బ్రాంచి, అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లతోపాటు 9 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఏఈఓలు గ్రామాలకు వెళ్తున్నప్పటికీ రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాలు సేకరించలేక పోతున్నారు.
 
ఖరీఫ్‌లో 6,829 చెక్కులు వాపస్‌.. 
జిల్లావ్యాప్తంగా 1,54,658 చెక్కులు రైతుల పేరుమీద వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం తిరిగి 6,829 చెక్కులను తీసుకుంది. మిగతా 1,47,823 చెక్కుల్లో 1,32,870 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 75 వేల మంది రైతుల ఖాతాలను సేకరించారు. మరో 50 వేల మంది రైతుల వివరాలు తీసుకోవాల్సి ఉంది. రైతుల వివరాలు లేకపోతే రైతుబంధు సాయాన్ని జమ చేయడం మరింత ఆలస్యం కానుంది.

75 వేల ఖాతాలను సేకరించాం
యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మొదటి విడత రైతుల అకౌంట్లలో జమ చేశాం. రెండో విడత కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 75 వేల అకౌంట్లను సేకరించాం. మిగతా రైతుల వివరాలను సేకరిస్తున్నాం. అందరికి డబ్బులు వచ్చేలా ప్రయత్నిస్తాం. –ఎన్‌.వీరూనాయక్, డీఏఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top