పింక్‌ బ్యాలెట్లపై ఫిర్యాదు.. ఈసీ కామెంట్‌! | Rajat Kumar Chit Chat With Media | Sakshi
Sakshi News home page

Oct 30 2018 6:35 PM | Updated on Mar 18 2019 9:02 PM

Rajat Kumar Chit Chat With Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల రణరంగం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శల బాణాలను సంధిస్తూ హీటెక్కిస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..  పింక్‌ బ్యాలెట్లపై కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసిందని.. అయితే1950 నుంచి పింక్‌ బ్యాలెట్‌ పేపర్లను వాడుతున్నామని తెలిపారు. రంగు మార్పుపై న్యాయకోవిదుల అభిప్రాయం తెలుసుకుంటామన్నారు. ఇప్పటి వరకు నోటీసులు అందిన వారు సమాధానం ఇస్తారని, ఇవ్వని వాళ్ల వివరాలను ఈసిఐకి తెలుపుతామన్నారు. కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో బహిరంగ సభలను అడ్డుకున్న వారిపై ఫిర్యాదులు చేశారని, అలాగే సెక్షన్‌ 127కు సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు.

రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం సరికాదని సూచించారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసుల వ్యవహారానికి సంబంధించి ఇరు రాష్ట్రాల డీజీపీలకు నోటీసులు ఇచ్చామని, అయితే సమాధానం మాత్రం ఇంకా రాలేదన్నారు. పనిభారం ఎక్కువ ఉన్నందున మరో ఇద్దరు అదనపు సీఈఈలు కావాలని అడిగామన్నారు. రాజకీయ పార్టీల సభలకు వచ్చేవారికి డబ్బులు పంపిణీ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, సెక్షన్‌ 117బి ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల విషయంలో మరో 280 కేంద్రాలను అదనంగా కావాలని కోరామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలు జనావాసాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారని తెలిపారు. స్టార్‌ క్యాంపైనర్స్‌గా జాతీయ పార్టీకి 40మంది, రాష్ట్ర పార్టీలకు 20మంది వరకు అనుమతి ఉందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement