
చెక్కు అందజేస్తున్న పూరీ జగన్నాథ్ తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: సినీ రంగంలోని అవసరార్థుల కోసం ఏర్పడిన మనం సైతం సంస్థ ఆధ్వర్యంలో పలువురికి ఆర్ధిక సాయం అందించారు. జూబ్లీహిల్స్లోని ఫిలింఛాంబర్ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలని, దీని కోసం తన వంతుగా ఒక యాప్ రూపొందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మాట్లాడుతూ ఇకపై మనం సైతం స్ఫూర్తితో కౌశల్ ఆర్మీ కూడా పనిచేస్తుందన్నారు.
తన వంతుగా పాతిక వేల రూపాయలు విరాళం ప్రకటించారు. సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ.... మనం సైతం ద్వారా పేదల ఆరోగ్యం, విద్య, వృద్ధులకు సహాయపడుతుండడం అభినందనీయమన్నారు. తన వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ గత జనవరి నుంచి ఇప్పటికి 90 మంది పేదలకు ఆర్థిక సహాయం అందించామని, వివిధ ఆస్పత్రులను అభ్యర్థించి పేదలకు 43 లక్షల రూపాయల ఫీజులు తగ్గించామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.