టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం.. భారీ ఏర్పాట్లు | prepared on TRS pleanery | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం.. భారీ ఏర్పాట్లు

Apr 21 2015 8:14 PM | Updated on Sep 3 2017 12:38 AM

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని విజయవంతంగా ముగించేందుకు అధికార టీఆర్‌ఎస్ భారీ కసరత్తే చేస్తోంది.

ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్
బహిరంగ సభ ఏర్పాట్లపైనా దృష్టి
జిల్లాకు లక్ష మంది జన సమీకరణ లక్ష్యం
మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతల అప్పగింత


హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని విజయవంతంగా ముగించేందుకు అధికార టీఆర్‌ఎస్ భారీ కసరత్తే చేస్తోంది. అధికార పార్టీ హోదాలో, కొత్త రాష్ట్రంలో తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ కోసం ఏర్పాట్లనూ అంతే భారీ స్థాయిలో చేస్తోంది. ప్రతీ నియోజకవర్గానికి మూడు వందల మంది చొప్పున ప్రతినిధుల లెక్కన మొత్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీ కోసం ఆహ్వానిస్తున్నారు.

ఈనెల 24న ప్లీనరీ, రెండు రోజుల తేడాతో 27న బహిరంగ సభ కూడా ఉండడంతో రాష్ట్ర రాజధానిలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, హోర్డింగులు, సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుంటూ మంత్రులు అందరికీ ఏర్పాట్ల బాధ్యతలను అప్పజెప్పింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను నిత్యం ఇద్దరు ముగ్గురు మంత్రులు పరిశీలిస్తున్నారు.


పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మంగళవారం పరిశీలించారు. ప్లీనరీ విజయవంతం కోసం ఇప్పటికే పార్టీ నాయకత్వం మబొత్తంగా ఏడు కమిటీలను ఏర్పాటు చేయగా, ఏ కమిటికామిటీ తమ పనిలో మునిగిపోయాయి. నియోజకవర్గానికి 300 మంది చొప్పున 36వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరందరినీ ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు సమన్వయ పరుస్తారు. ప్రతీ ప్రతినిధికి ఓ కిట్‌ను అందివ్వనున్నారు. ఈ కిట్లలో ప్లీనరీ తీర్మానాలతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల సమాచారం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement