జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్‌ | PIL Field In Telangana High Court On Behalf Of Journalists | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్‌ చేస్తోన్న జర్నలిస్ట్‌లు

May 12 2020 12:50 PM | Updated on May 12 2020 12:50 PM

PIL Field In Telangana High Court On Behalf Of Journalists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై పత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్యకార్మికులు ఉన్నారు. వీరితో పాటు జర్నలిస్టులు కూడా కరోనాకి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారికి ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకోవడానికి ముందు రావడం లేదు. దీనికి సంబంధించి కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌  తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. పిటిషనర్‌ తరుపున వాదనలను సీనియర్‌ కౌన్సిల్‌ మాచర్ల రంగయ్య వినిపించారు. (జీహెచ్ఎంసీకి కలిసివచ్చిన లాక్డౌన్..)

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. దాంతో పాటు కరోనా వార్తలు కవర్‌ చేస్తోన్న ప్రతి జర్నలిస్ట్‌కు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని పిటిషనర్‌ కోరారు. అదేవిధంగా వారికి మెడికల్‌ కిట్లు, మాస్క్‌లు ఉచితంగా అందించే విధంగా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్‌ కోరారు. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్  డిపార్ట్ మెంట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారిచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ( మూడు ప్రతి నగరవాసికి అలవాటుగా)

Advertisement
 
Advertisement
Advertisement