నిజాం‘ఖాన్‌’దాన్‌ | Mir Osman Ali Khan is the richest person in the world | Sakshi
Sakshi News home page

నిజాం‘ఖాన్‌’దాన్‌

Oct 3 2019 2:47 AM | Updated on Oct 3 2019 5:25 AM

Mir Osman Ali Khan is the richest person in the world - Sakshi

తాత ఒడిలో మనవడు. 8వ నిజాం, ముకర్రం జా

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. ప్రపంచంలోనే ధనికుడు. హైదరాబాద్‌ సంస్థానాన్ని 1911 నుంచి 1948 సెప్టెంబర్‌ వరకు పాలించిన నిజాం రాజుల్లో చివరివాడు. ఉస్మాన్‌ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు.. ఆజంజా, మౌజంజా. వీరిని కాదని ఆజంజా కుమారుడు ముకర్రం జాను 8వ నిజాంగా ప్రకటించాడు. హైదరాబాద్‌ సంస్థానంపై భారత సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ రహమతుల్లా ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.3.5 కోట్ల నగదు (1,007,940 పౌండ్ల 9 షిల్లాంగ్‌లు) బదిలీ అయింది. ఈ నిధులు తిరిగి ఇవ్వాలని అప్పట్లోనే ఉస్మాన్‌ అలీఖాన్‌ కోరినా.. పాకిస్తాన్‌ పేచీతో వివాదం అరవై ఏళ్లు నలిగింది. ఎట్టకేలకు లండన్‌ బిజినెస్‌ అండ్‌ ప్రాపర్టీ హైకోర్టు ఇటీవల 140 పేజీల తీర్పు వెలువరించింది.

ఈ తీర్పులో ఉస్మాన్‌ అలీఖాన్‌ తరఫున అప్పటి హైదరాబాద్‌ ఆర్థిక మంత్రి మీర్‌ నవాజ్‌ జంగ్‌ జమ చేసిన నిధులకు ఆయన కొడుకులు ఆజంజా, మౌజంజా వారసులని (మనుమలు ముకర్రం జా, ముఫకం జా) తేల్చి, పాకిస్తాన్‌ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అయితే అప్పట్లో జమ చేసిన రూ. 3.5 కోట్లు ప్రస్తుతం రూ.306 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తం వారసులకే దక్కనున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్త చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం 8వ నిజాం ముకర్రం జా ఐదవ భార్యతో ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, ముఫకం జా ఫ్రాన్స్, లండన్‌లో నివాసం ఉంటూ అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చి వెళ్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement